వీర భోగ వసంత రాయలు మూవీ రివ్యూ

వీర భోగ వసంత రాయలు మూవీ రివ్యూ

Last Updated : Oct 26, 2018, 04:50 PM IST
వీర భోగ వసంత రాయలు మూవీ రివ్యూ

నటీనటులు : నారా రోహిత్, శ్రీవిష్ణు, సుధీర్ బాబు, శ్రీయ శరన్, మనోజ్ నందన్ తదితరులు
సంగీతం : మార్క్ కే రాబిన్
నిర్మాత‌: అప్పారావ్ బెల్లానా
రచన – ద‌ర్శ‌కుత్వం: ఇంద్ర‌సేన ఆర్
నిడివి : 132 నిమిషాలు
విడుదల తేది : 26 నవంబర్ 2018

ఇదివరకే పలు చిత్రాల్లో కలిసి నటించిన నారా రోహిత్, శ్రీ విష్ణు ఈసారి ఇంకాస్త భిన్నమైన కథను ఎంచుకుని చేసిన సినిమా ఇది. వీళ్లిద్దరితోపాటు ఈసారి సుదీర్ బాబు కూడా తోడవడంతో ఈ సినిమాకు మరింత మల్టీస్టారర్ లుక్ వచ్చింది. మరి ఈ ముగ్గురు ఎలాంటి కథను సెలెక్ట్ చేసుకున్నారు ? ఈ మల్టీస్టారర్ ప్రేక్షకులను ఎంత వరకు ఎంటర్‌టైన్ చేసిందనే వివరాలు తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ :
ఓ చిన్న కుర్రాడు (చరిత్ మానస్) తన ఇల్లు కనపడట్లేదంటూ పోలిస్ స్టేషన్‌లో అడుగుపెడతాడు. ఇల్లుతో పాటు తన తల్లితండ్రులు కూడా కనిపించట్లేదని పోలీసులకు తెలియజేస్తాడు. ఈ ఆసక్తికరమైన కేసును టేకప్ చేస్తాడు ఇన్స్‌పెక్టర్ వినయ్ కుమార్ (సుధీర్ బాబు). అలాగే ఆ తర్వాత 300 మంది ప్రముఖులు ప్రయాణిస్తున్న ఓ ఫ్లైట్ హైజాక్ అవుతుంది. ఈ కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా రంగంలోకి దిగుతాడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దీపక్ రెడ్డి (నారా రోహిత్). ఈ కేసు దర్యాప్తులో భాగంగా దిలీప్ రెడ్డికి నీలిమ (శ్రియ శరన్) అనే మరో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ పరిచయం అవుతుంది. ఇదిలావుండగా, మరోవైపు సిటీలో టీనేజ్ వయసులో ఉన్న అమ్మాయిలు కిడ్నాప్ అవుతుండటం కలకలం సృష్టిస్తుంది. 

అయితే ఈ మూడు సంఘటనల వెనుక ఉన్నది వీరభోగవసంతరాయలు (శ్రీవిష్ణు) అని తెలుసుకున్న పోలీసులు షాకవుతారు. అతని వద్ద బంధీలుగా ఉన్న 300 మంది ప్రముఖులను విడిచిపెట్టాలంటే ఇన్వెస్టిగేషన్ టీమ్‌కి ఒక టాస్క్ ఇస్తాడు వసంతరాయులు. మరోవైపు అనుమానాస్పద హత్యలు పోలిస్ డిపార్ట్మెంట్‌ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి. అసలింతకీ వీర భోగ వసంత రాయులు ఎవరు ? అతని కథేంటి ? ఏ లక్ష్యంతో అతడు ఈ నేరాలకు పాల్పడ్డాడు ? అన్ని సంఘటనలకి అతనే కారణమా ? చివరికి ఇన్వెస్టిగేషన్ టీమ్ అతన్ని పట్టుకోగలిగిందా లేదా అనేదే మిగతా కథాంశం.

నటీనటుల పనితీరు :
ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్‌గా నారా రోహిత్ తన క్యారెక్టర్‌కి పర్ఫెక్ట్ అనిపించాడు. న్యూ మేకోవర్, పెర్ఫార్మెన్స్‌తో శ్రీ విష్ణు బెస్ట్ ఇచ్చాడు. సుదీర్ బాబు ఉన్నంతలో పరవాలేదనిపించుకున్నాడు. సుదీర్‌కి డబ్బింగ్ కుదరలేదు. శ్రియ శరన్ జస్ట్ ఓకే అనిపించుకుంది. సుదీర్ బాబు తనయుడు మాస్టర్ చరిత్ మానస్ పరవాలేదనిపించుకున్నాడు. మనోజ్ నందం, రవి ప్రకాష్, శశాంక్ తమ క్యారెక్టర్స్‌కి  న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :
సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు నేపథ్య సంగీతం చాలా కీలకం. మార్క్ కే రాబిన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేకపోయింది. ఎస్ వెంక‌ట్, న‌వీన్ యాద‌వ్ సినిమాటోగ్రఫీ బాగుంది. కొన్ని సన్నివేశాల్లో కెమెరా మెన్స్ ప్రతిభ కనిపిస్తుంది. శ‌శాంక‌ర్ మాలి ఎడిటింగ్ పరవాలేదు. ఇంకా కొన్ని సన్నివేశాలు ట్రిమ్ చేయొచ్చనిపించింది. ఆర్ట్ వర్క్ బాగుంది. ఇంద్ర‌సేన్ కథ- కథనం ఆకట్టుకోలేకపోయాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అంతంత మాత్రంగానే ఉన్నాయి.

కెరీర్ స్టార్టింగ్ నుండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ సెలెక్ట్ చేసుకుంటూ కెరీర్‌ని కొనసాగిస్తున్న నారా రోహిత్, శ్రీ విష్ణు కలిసి ‘వీరభోగ వసంత రాయులు’ అనే టైటిల్‌తో సినిమా చేస్తున్నారనగానే… వీరి నుండి మరో డిఫరెంట్ సినిమా వస్తుందని ఆడియెన్స్ ఆశించారు. దీనికి తోడు సుదీర్ బాబు, శ్రియ శరన్ కూడా సినిమాలో ముఖ్య పాత్రలు పోషించడంతో సినిమాపై అంచనాలు ఇంకొంత రెట్టింపయ్యాయి. పోస్టర్స్, ట్రైలర్‌తో టాలీవుడ్‌లో ఓ చిన్న సైజు హంగామా చేసింది ఈ మల్టీస్టారర్ సినిమా.

ఇక సినిమా విషయానికొస్తే స్క్రిప్ట్ రాసుకునే సమయంలో దర్శకుడు ఇంద్రసేన్‌కు ఇది కాస్త ఎగ్జైటింగ్ కథ అనిపించొచ్చు కానీ స్క్రీన్ మీద ప్రెజెంట్ చేసిన విధానం మాత్రం రొటీన్ అనిపించింది. నిజానికి ఈ కథకి టాలెంటెడ్ స్టార్ట్ కాస్టింగ్‌ను ఎంచుకున్న దర్శకుడు వారితో ఈ కథను రక్తి కట్టించేలా తెరకెక్కించడంలో విఫలం అయ్యాడు. సినిమా ప్రారంభంలో ప్రేక్షకుడిలో ఆసక్తి కలిగించిన దర్శకుడు కాసేపటికే అర్థంపర్థం లేని సీన్స్‌తో విసుగు తెప్పించాడు. ముఖ్యంగా కన్ఫ్యూజన్ స్క్రీన్ ప్లే సినిమాకు అతిపెద్ద మైనస్. సుదీర్ బాబు, శ్రియ డబ్బింగ్ వాయిస్‌లు వింటుంటే ప్రేక్షకులకు ఇంగ్లీష్ డబ్బింగ్ సినిమా చూస్తున్నామనే ఫీలింగ్ కలుగుతుంది. డబ్బింగ్ విషయంలో, డైలాగ్స్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా సినిమాకు మైనస్.

కొన్ని సందర్భాల్లో ఈ సినిమాతో దర్శకుడు అసలు ఏం చెప్పాలనుకున్నాడు అనే ప్రశ్న ప్రేక్షుకుడిలో మొదలవుతుంది. నిజానికి ఇలాంటి సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాలకు స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగా ఉండాలి. అప్పుడే ప్రేక్షుకుడు థ్రిల్ అవుతాడు. తను చెప్పాలనుకున్న కథను ఆసక్తికరమైన స్క్రీన్ ప్లే తో ఎగ్జిక్యూట్ చేయలేకపోయాడు ఇంద్రసేన. బాలికలపై అత్యాచారాలు, కిడ్నాపులను ఇతి వృత్తంగా తీసుకొని ఈ సినిమాను సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కించిన దర్శకుడు చాలా చోట్ల తడబడ్డాడు. కథ రొటీన్ అనిపించడం, స్క్రీన్ ప్లే కూడా సరిగ్గా లేకపోవడంతో నారా రోహిత్, శ్రీ విష్ణు , సుదీర్ బాబు కూడా ఏం చేయలేకపోయారు. ఇంటర్వెల్ తర్వాత వచ్చే సన్నివేశాలు మరీ బోర్ కొట్టించినా క్లైమాక్స్ సీన్స్ పరవాలేదనిపిస్తాయి. అంతిమంగా నారా రోహిత్, సుదీర్ బాబు, శ్రీ విష్ణులను చూసి థియేటర్స్‌కి వెళ్ళే ఆడియెన్స్‌ను ‘వీర భోగ వసంత రాయలు’ నిరాశపర్చడం ఖాయం.

రేటింగ్ : 1.5 / 5

జీ సినిమాలు సౌజన్యంతో... 

Trending News