మళ్లీ భంగపడ్డ మన్నె క్రిశాంక్‌.. ఈసారి టికెట్‌ రాకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామే!

Manne Krishank Resign To BRS Party Very Soon: రెండు సార్లు టికెట్‌ ఆశించి భంగపడ్డాడు. అధికారంలో ఉన్నప్పుడు.. ఇప్పుడు ప్రతిపక్షంలో. ఎమ్మెల్యే టికెట్‌ దక్కకపోవడంతో మన్నె క్రిశాంక్‌ బీఆర్‌ఎస్‌కు రాజీనామా చేయబోతున్నాడా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Apr 7, 2024, 06:17 PM IST
మళ్లీ భంగపడ్డ మన్నె క్రిశాంక్‌.. ఈసారి టికెట్‌ రాకుంటే బీఆర్‌ఎస్‌ పార్టీకి రాజీనామే!

Manne Krishank: నెలల వ్యవధిలోనే అనూహ్య పరిణామాలు చోటుచేసుకోవడంతో బీఆర్‌ఎస్‌ పార్టీ కుదేలైంది. పదేళ్లు పరిపాలించిన పార్టీ ఇప్పుడు గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటోంది. ఇప్పుడు ఆ పార్టీకి మరో కీలక నాయకుడు రాజీనామా చేయబోతున్నాడని సమాచారం. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడు అయిన మన్నె క్రిశాంక్‌ పార్టీ మారుతారని తెలుస్తోంది. సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ ఎమ్మెల్యే సీటును ఎప్పటి నుంచో ఆశిస్తున్న క్రిశాంక్‌కు ఈసారి కూడా నిరాశే ఎదురైనట్టు తెలుస్తోంది. లాస్య నందిత మృతితో ఖాళీ అయిన కంటోన్మెంట్‌ స్థానానికి ఉప ఎన్నిక జరుగనుంది. ఈ స్థానం నుంచి లాస్య నందిత సోదరి నివేదితను అభ్యర్థిగా గులాబీ పార్టీ దాదాపుగా ఖరారు చేసింది. నివేదిత అభ్యర్థిత్వం ఖరారుతో క్రిశాంక్‌కు భంగపాటు ఎదురైంది. మరోసారి టికెట్‌ ఆశించి భంగపడ్డారు. 

Also Read: KCR Arrest: కేసీఆర్‌ జైలుకు వెళ్లడం ఖాయమా? రేవంత్‌ రెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ ఇదేనా?

ఈ సందర్భంగా క్రిశాంక్‌ 'ఎక్స్‌'లో స్పందించాడు. 'కంటోన్మెంట్‌ ఉప ఎన్నిక విషయమై పార్టీ అధ్యక్షుడు కేసీఆర్‌ ఆధ్వర్యంలో జరిగే సమావేశానికి ఆహ్వానం అందింది. ఆ సమావేశంలో నిర్ణయం ఏదైనా సరే నా గురువు కేటీఆర్‌ వెంటే నడుస్తా' అని ప్రకటించారు. తన 15 ఏళ్ల రాజకీయంలో ఎలాంటి అవినీతికి తావులేకుండా చేసినట్లు తెలిపారు. కేసీఆర్‌ తనను గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని, బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు తనకు అండగా నిలబడ్డారని గుర్తుచేసుకున్నారు. అధికారం లేదని పార్టీని వీడడం భావ్యం కాదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా క్రిశాంక్‌ కొందరికి క్షమాపణలు చెప్పారు. 'అధికార ప్రతినిధిగా సోషల్‌ మీడియాలో అనేక మంది కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను గాయపరిచానని, వారికి క్షమాపణలు తెలిపారు.

Also Read: Tukkuguda Meeting: తుక్కుగూడ సభలో భట్టి విక్రమార్కకు అవమానం.. ఓవరాక్షన్ చేసిన సీపీ తరుణ్ జోషి..

కాగా పార్టీపై అసంతృప్తి ఉన్న విషయం తెలుసుకుని బీజేపీ టికెట్‌ ఆఫర్‌ చేసిందని క్రిశాంక్‌ తెలిపాడు. అయితే ఆ ప్రతిపాదనను తిరస్కరించినట్లు ప్రకటించాడు. 'నాకు ఫోన్‌ చేసి అవకాశం ఇచ్చిన బీజేపీకి చెందిన ప్రముఖ నాయకుడికి కృతజ్ఞతలు చెబుతున్నా. ఆయన ఆఫర్‌ను తిరస్కరించాను' అని తెలిపాడు. అయితే బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచే టికెట్‌ వస్తే మంచిదనే అభిప్రాయంలో క్రిశాంక్‌ ఉన్నాడు. 'సొంత పార్టీ నుంచి ఎవరికైనా అవకాశం వస్తే బాగుంటుంది. ఒక కుటుంబాన్ని విడిచిపెట్టి మరో కుటుంబంలోకి వెళ్లడం అంత సులువు కాదు' అని తెలిపాడు. దీన్ని బట్టి చూస్తే క్రిశాంక్‌ బీఆర్‌ఎస్‌ పార్టీలో ఇబ్బందికరంగా కొనసాగుతున్నాడు. టికెట్‌ ఆశిస్తుంటే పార్టీ మాత్రం పట్టించుకోవడం లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో క్రిశాంక్‌ కంటోన్మెంట్‌ ఆశించగా లాస్య నందితకు అవకాశం దక్కింది. అయినా కూడా ఆమె గెలుపు కోసం అతడు పని చేశాడు. ఆమె మృతిచెందడంతో వచ్చిన ఉప ఎన్నికలో కూడా అవకాశం రాకపోవడంతో నిరాశలో ఉన్నాడు. 

వాస్తవంగా క్రిశాంక్‌ రాజకీయ జీవితం కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభమైంది. ఆ పార్టీలో యువ నాయకుడిగా కొనసాగుతున్న క్రిశాంక్‌ అనంతరం కేటీఆర్‌ పిలుపుత బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరాడు. గులాబీ పార్టీ అధికార ప్రతినిధిగా చర్చలు, సమావేశాల్లో పాల్గొంటూ కేసీఆర్‌, కేటీఆర్‌ వాణి వినిపించేవాడు. జాతీయ మీడియాలో క్రిశాంక్‌ ఏ విషయంపైన అయినా వాగ్ధాటిగా మాట్లాడుతాడు. కాంగ్రెస్‌, బీజేపీల నుంచి ఇప్పుడు పిలుపు వస్తున్నా కూడా ప్రస్తుతానికి క్రిశాంక్‌ ఎలాంటి నిర్ణయం తీసుకోవడం లేదు. అభ్యర్థిగా నివేదిత అధికారికంగా పేరు వెలువడితే క్రిశాంక్‌ తన భవిష్యత్‌ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News