Ind Vs NZ: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ మెరుపులు వృథా

India Vs New Zealand 1st T20 Highlights: మొదటి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ తగిలింది. 21 పరుగుల తేడాతో న్యూజిలాండ్ జట్టు జయకేతనం ఎగురవేసింది. లక్ష్యఛేదనలో భారత్ బ్యాట్స్‌మెన్ ముకుమ్మడిగా విఫలమయ్యారు. ముఖ్యంగా టాపార్డర్ విఫలమవ్వడంతో టీమిండియా కోలుకోలేకపోయింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 27, 2023, 11:08 PM IST
Ind Vs NZ: తొలి టీ20 మ్యాచ్‌లో భారత్‌కు ఎదురుదెబ్బ.. వాషింగ్టన్ సుందర్ మెరుపులు వృథా

India Vs New Zealand 1st T20 Highlights: వన్డే సిరీస్‌ గెలిచి ఊపుమీదున్న టీమిండియాకు టీ20 మొదటి మ్యాచ్‌లో కివీస్ జట్టు కళ్లెం వేసింది. రాంచీ వేదికగా జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత్‌ను 21 పరుగుల తేడాతో ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ జట్టు 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. అనంతరం భారత్ తొమ్మిది వికెట్ల నష్టానికి 155 రన్స్‌కే పరిమితమైంది. లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్ ముకుమ్మడిగా విఫలమయ్యారు. వాషింగ్టన్ సుందర్ (25 బంతుల్లో 50) మెరుపులు మెరిపించగా.. సూర్యకుమార్ యాదవ్ (47) రాణించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్లింది న్యూజిలాండ్.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ హార్ధిక్ పాండ్యా ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. కివీస్ ఓపెనర్లు ఫిన్ అలెన్, డ్వేన్ కాన్వే శుభారంభం చేశారు. వీరిద్దరు మొదటి వికెట్‌కు 4.2 ఓవర్లలో 43 పరుగులు జోడించారు. ఫిన్ అలెన్ 23 బంతుల్లో 35 పరుగులు చేయగా.. డ్వేన్ కాన్వే 35 బంతుల్లో 52 రన్స్ చేశాడు. వీరిద్దరు ఔట్ అయిన తరువాత మిగిలిన బ్యాట్స్‌మెన్ విఫలమయ్యారు. టీమిండియా బౌలర్లు క్రమం తప్పకుండా వికెట్లు తీశారు. చివర్లో మిచెల్ (59 రన్స్, 30 బంతుల్లో; 3 ఫోర్లు, 5 సిక్సర్లు) చెలరేగడంతో 20 ఓవర్లలో జట్టు స్కోరు 176 రన్స్ చేసింది. భారత బౌలర్ల వాషింగ్టన్ సుందర్ 2, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి తలో వికెట్ తీశారు. 

177 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు సరైన ఆరంభం దక్కలేదు. ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (7), ఇషాన్ కిషన్ (4), వన్‌డౌన్ బ్యాట్స్‌మెన్ రాహుల్ త్రిపాఠి (0) వరుసగా పెలియన్‌కు క్యూకట్టారు. దీంతో 15 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి భారత్ కష్టాల్లో పడింది. ఆ తరువాత సూర్యకుమార్ యాదవ్ (34 బంతుల్లో 47, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), హార్ధిక్ పాండ్యా (21) రాణించడంతో కోలుకున్నట్లే కనిపించింది. అయితే జట్టు స్కోరు 83 పరుగల వద్ద సూర్యకుమార్ యాదవ్ ఔట్ అవ్వగా.. కాసేపటికే హార్ధిక్ పాండ్యా కూడా ఔట్ అయ్యాడు. దీపక్ హుడా (10) కూడా విఫలమవ్వడంతో భారత్ ఓటమి ఖరారు అయింది.

అయితే చివర్లో వాషింగ్టన్ సుందర్ మెరపులు మెరిపించాడు. 28 బంతుల్లోనే 50 రన్స్ చేశాడు. ఇందులో ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు ఉన్నాయి. న్యూజిలాండ్ బౌలర్లలో బ్రేస్‌వెల్, శాంట్నర్, ఫెర్గ్యూసన్ చెరో వికెట్లు, డూఫీ, ఇషో సోధీ తలో వికెట్ పడగొట్టారు. మిచెల్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. రెండో టీ20 మ్యాచ్‌ లక్నోలో ఈ నెల 29న జరగనుంది.
 

 

Trending News