శ్రీదేవిని పెంచిన తల్లికి కన్నీరే మిగిలింది

శ్రీదేవి మృతి నేపథ్యంలో అనసూయమ్మను కలిసిన ఓ ప్రముఖ తెలుగు ఛానెల్.. శ్రీదేవితో ఆమెకు వున్న అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది.

Last Updated : Feb 25, 2018, 09:40 PM IST
శ్రీదేవిని పెంచిన తల్లికి కన్నీరే మిగిలింది

దక్షిణాది నుంచి ఉత్తరాది వరకు అన్ని భాషా సినీపరిశ్రమల్లో భారీ అభిమాన బలగం సొంతం చేసుకున్న శ్రీదేవి అకాల మృతి ఆమె సమీప బంధువులని మరింత ఆవేదనకు గురిచేసింది. తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన శ్రీదేవికి తెలుగు రాష్ట్రాలతో ప్రత్యేకమైన అనుబంధం కలిగి వుండటమే కాదు.. ఆమె సొంత పిన్ని అయిన అనసూయమ్మ కూడా తిరుపతిలోనే వుంటారు. శ్రీదేవి మృతి నేపథ్యంలో అనసూయమ్మను కలిసిన ఓ ప్రముఖ తెలుగు ఛానెల్.. శ్రీదేవితో ఆమెకు వున్న అనుబంధాన్ని తెలుసుకునే ప్రయత్నం చేసింది. ఈ సందర్భంగా ఆ ఛానెల్‌తో మాట్లాడిన అనసూయమ్మ.. చిన్నప్పుడు తన చేతుల మీదుగా పెరిగి, పెద్దయిన శ్రీదేవి ఇవాళ ఈ విధంగా తమని విడిచివెళ్లిపోవడం బాధ కలిగించిందని అన్నారు. 

తాము చెన్నైలో ఉండే రోజుల్లో శ్రీదేవి చిన్నపిల్లగా వున్నప్పుడు తానే శ్రీదేవిని పెంచాను. ఆ తర్వాత తనకు పెళ్లి అయి తిరుపతి వచ్చేయగా, శ్రీదేవి పెళ్లి చేసుకుని ముంబై వెళ్లిపోయిందని తెలిపారు అనసూయమ్మ. తన అక్క (శ్రీదేవి తల్లి) ముంబైలో శ్రీదేవి వద్దే చనిపోయింది. ఆ తర్వాత అప్పుడప్పుడు ఫోన్ ద్వారా మాట్లాడేవారు. ఎప్పుడైనా తిరుపతి వస్తే, తప్పకుండా తన ఇంటికి వచ్చి వెళ్లేవారు అని అనసూయమ్మ తనకు శ్రీదేవితో వున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం తన ఆరోగ్యం సహకరించడం లేదు. శ్రీదేవిని కడసారి చూడాలని వున్నప్పటికీ.. ముంబై వెళ్లడానికి తన ఆరోగ్యం సహకరించడం లేదు. అందుకే తన పిల్లలు ముంబై వెళ్లారని చెప్పారామె.

Trending News