జనసేనాని ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం.. భవిష్యత్ కార్యాచరణ వెల్లడి

జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేడు గుంటూరులో జరగనుంది.

Last Updated : Mar 14, 2018, 12:43 PM IST

    గుంటూరులో జనసేన బహిరంగ సభ నేడు
    నేడే భవిష్యత్ కార్యాచరణ వెల్లడి
    వేదిక మీద నుండే కార్యకర్తలకు దిశా నిర్దేశం
    బందోబస్తుకు డీజీపీకి లేఖ

జనసేనాని ఆవిర్భావ సభకు సర్వం సిద్ధం.. భవిష్యత్ కార్యాచరణ వెల్లడి

జనసేన పార్టీ ఆవిర్భావ సభ నేడు గుంటూరులో జరగనుంది. ఆచార్య నాగార్జున వర్సిటీ సమీపంలోని 35 ఎకరాల స్థలంలో జనసేన ఆవిర్భావ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభం అవుతుంది. సాయంత్రం ఐదు గంటలకు జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రసంగిస్తారు. నేటి ప్రసంగంలో పవన్‌ కల్యాణ్‌ భవిష్యత్ రాజకీయ ప్రణాళికలను ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ ఏర్పాటైన తర్వాత మొదటిసారిగా నిర్వహిస్తున్న బహిరంగ సభ కావడంతో పాటు పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ఈ సభా వేదిక నుంచే కార్యకర్తలకు దిశా నిర్ధేశం చేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏ రకమైన ప్రకటన చేస్తారో ఈ సభలో చూడాల్సి ఉంది. ఈ మహాసభకు రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అభిమానులు భారీ సంఖ్యలో హాజరవుతారని తెలుస్తోంది.

 

డీజీపీకి లేఖ

ఆంధ్రప్రదేశ్ డీజీపీ మాలకొండయ్యకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ లేఖ రాశారు. జనసేన ఆవిర్భావ సభకు భద్రత కల్పిస్తున్నందుకు పవన్ కల్యాణ్ ధన్యవాదాలు తెలిపారు. తనపై దాడి జరిగితే ప్రజాజీవితంపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశముందని లేఖలో పేర్కొన్నారు. గతంలో భీమవరంలో ఫ్లెక్సీలు చింపివేసినందుకే అభిమానులు ధర్నా చేశారన్న విషయాన్ని గుర్తుచేశారు. ఇటీవల అనంతపురం పర్యటనలో జరిగిన ఘటనల దృష్ట్యా భద్రత కోరుతున్నానని తెలిపారు. భద్రతకు పోలీసులు నిస్సహాయత ప్రకటిస్తే.. ఏదైనా జరిగితే ప్రభుత్వానిదే బాధ్యత అని పవన్ లేఖలో పేర్కొన్నారు.

 

 

Trending News