వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి

ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగ భృతికి బడ్జెట్ లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు.

Last Updated : Jul 17, 2018, 09:37 AM IST
వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి

ఆంధ్రప్రదేశ్‌లో నిరుద్యోగ భృతికి బడ్జెట్‌లో వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించామని ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్లుగానే వచ్చే నెల (ఆగస్టు) నుంచి నిరుద్యోగ భృతి చెల్లిస్తామని చెప్పారు. రాష్ట్రంలో 10లక్షల మందికి ప్రభుత్వం నిరుద్యోగ భృతి ఇవ్వనుంది. కనీస విద్యార్హత డిగ్రీ ఉండి.. 22-35 ఏళ్ల మధ్య ఉన్న నిరుద్యోగులకు నెలకు వెయ్యి రూపాయల చొప్పున ఇవ్వాలని ఇప్పటికే నిర్ణయించిన సంగతి తెలిసిందే. అటు రాష్ట్రాభివృద్ధి కోసం ఇప్పటికే రూ.1.60 లక్షల కోట్లు అప్పు చేశామని, ఈ ఏడాది మరో రూ.23 వేల కోట్ల వరకు అప్పు చేసే పరిస్థితి ఉందని యనమల పేర్కొన్నారు.

నిరుద్యోగ భృతి పొందే యువతీయువకులకు వివిధ శాఖల అనుసంధానంతో నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇస్తారు. నిరుద్యోగ భృతికి నమోదు చేసుకునే సమయంలోనే వారికిష్టమైన మూడు రంగాలను ఎంపిక చేసుకొనే అవకాశం ఇస్తారు. దాని ఆధారంగా కంపెనీలకు ఎంపికయ్యేలా శిక్షణ ఇస్తారు. కంపెనీలతో ఒప్పందం చేసుకుని నిరుద్యోగులను అప్రెంటి‌స్‌లుగా తీసుకునేలా చూస్తారు. మరోవైపు నిరుద్యోగ భృతి తీసుకొనే యువతీయువకుల వివరాలతో జాబ్‌ పోర్టల్‌‌ను రూపొందించి.. కంపెనీలకు ఈ డేటా అందుబాటులో ఉంచి... అర్హతలున్నవారిని ఎంపిక చేసుకునే వీలు కల్పిస్తారు. నిరుద్యోగ భృతి కోసం  ప్రత్యేక వెబ్‌సైట్‌ రూపొందచనున్నారు. ఇందులో ఆధార్‌ నంబర్‌ ఎంటర్‌ చేయగానే... వారి ఫోన్‌కు ఓటీపీ వెళ్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేయగానే నిరుద్యోగ భృతికి అర్హులా? కాదా? అనే విషయం తెలుస్తుంది.

Trending News