వావ్.. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం

గోల్డ్‌కోస్ట్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో నాలుగోరోజు భారత క్రీడాకారుల పతకాల వేట మొదలైంది.

Last Updated : Apr 8, 2018, 05:28 PM IST
వావ్.. కామన్వెల్త్‌లో భారత్‌కు మరో రెండు స్వర్ణాలు, ఒక రజత పతకం

గోల్డ్ కోస్ట్ లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో నాలుగోరోజు భారత క్రీడాకారుల పతకాల వేట మొదలైంది. వెయిట్ లిఫ్టింగ్ లో కాకుండా.. ఈసారి మహిళల 10మీటర్ల ఎయిర్ పిస్టోల్ విభాగంలో భారత్‌కు ఒక స్వర్ణం, ఒక రజతం లభించాయి. మను భాకర్‌‌కు స్వర్ణం లభించగా, హీనా సింధుకు సిల్వర్ మెడల్ లభించింది. అలానే వారణాసికి చెందిన పూనం యాదవ్ 69 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బంగారు పతకం సాధించింది. ఇప్పటివరకు భారత్‌కు వచ్చిన స్వర్ణాలు ఆరు. అందులో ఐదు బరువులు ఎత్తడంలోనే కావడం విశేషం.

 

ఈ స్వర్ణ పతకంతో ప్రస్తుతం భారత్, పతకాల పట్టికలో 3 వ స్థానంలో (6  స్వర్ణాలు, 2 రజతం, 1 కాంస్యం) కొనసాగుతోంది. 22  స్వర్ణాలు, 17  రజతాలు, 20  కాంస్య పతకాలతో ఆస్ట్రేలియా మొదటి స్థానంలో ఉండగా, 14 స్వర్ణాలు, 14  రజతాలు, 6 కాంస్యాలతో ఇంగ్లాండ్ రెండవ స్థానంలో.. 5 స్వర్ణాలు, 7  రజతాలు, 6  కాంస్య పతకాలతో  కెనడా నాలుగో స్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో సౌతాఫ్రికా, స్కాట్లాండ్, న్యూజిలాండ్, వేల్స్,  మలేషియా, బెర్ముడా దేశాలు (టాప్-10లో)ఉన్నాయి.

శనివారం గోల్డ్‌కోస్ట్‌లో జరిగిన కామన్వెల్త్ క్రీడల్లో భారత్ రెండు స్వర్ణాలను సాధించింది. వెయిట్ లిఫ్టింగ్‌లో 85 కేజీల పురుషుల విభాగంలో తెలుగు తేజం రాగాల వెంకట్ రాహుల్ స్వర్ణ పతకం సాధించాడు. అంతకు ముందు వెయిట్‌ లిఫ్టింగ్‌ పురుషుల 77 కేజీల విభాగంలో సతీశ్‌కుమార్‌(తమిళనాడు) స్వర్ణం సొంతం చేసుకున్నాడు.

శుక్రవారం కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్  ఓ స్వర్ణం, ఓ కాంస్యం సాధించింది. 53 కేజీల వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో  మహిళల విభాగంలో సంజిత చాను స్వర్ణం కైవసం చేసుకుంది. పురుషుల విభాగంలో వెయిట్ లిఫ్టర్ దీపక్ లాతర్ 69 కేజీల విభాగంలో కాంస్య పతకాన్ని సాధించాడు.

కాగా.. 21వ కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పతకం అందించిన ఘనత గురురాజ్‌కే దక్కింది. గురువారం జరిగిన వెయిట్‌లిఫ్టింగ్‌ పోటీల్లో మహిళ విభాగంలో మీరాబాయి చాను(48 కేజీల పోటీ) స్వర్ణాన్ని గెలుపొందగా, పురుషుల విభాగంలో పి గురురాజ్ 56 కేజీల విభాగంలో భారత్‌కు రజత పతకాన్ని అందించాడు.

Trending News