లీటర్ పెట్రోల్ రూ.25 తగ్గించవచ్చు.. ఎలానో చెప్పిన చిదంబరం

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి.

Last Updated : May 23, 2018, 11:10 AM IST
లీటర్ పెట్రోల్ రూ.25 తగ్గించవచ్చు.. ఎలానో చెప్పిన చిదంబరం

దేశవ్యాప్తంగా పెట్రోల్ ధరలు మండిపోతున్నాయి. రోజు రోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతున్నది. పెరుగుతున్న చమురు ధరల నేపథ్యంలో తాజాగా మాజీ కేంద్ర ఆర్థిక మంత్రి పి.చిదంబరం ట్విట్టర్‌లో ఓ కామెంట్ పోస్టు చేశారు.

ప్రభుత్వ ఖజానాను నింపుకొనేందుకు కేంద్రమే సాధారణ ప్రజలపై భారాన్ని మోపి పెట్రో వసూళ్లకు పాల్పడుతోందని విమర్శించారు. ప్రస్తుతం ఢిల్లీలో లీటరు పెట్రోల్ రూ.77 ఉంది. అయితే ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్రం సుమారు రూ.25 లాభం పొందుతోందన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పడిపోయినప్పుడు ప్రతి లీటరు పెట్రోల్‌పై రూ.15 కేంద్ర ప్రభుత్వం ఆదా చేస్తుందని, ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం రూ.10 అదనపు ట్యాక్స్‌ను విధిస్తోందని చిదంబరం ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ కారణంగా ప్రతి లీటరు పెట్రోల్‌పై కేంద్రం రూ.25 లాభం పొందుతోందని తెలిపారు. ఈ డబ్బు సగటు వినియోగదారుడిదే అన్నారు. 'ప్రభుత్వం అనుకుంటే ప్రతి లీటరు పెట్రోల్‌పై రూ.25 తగ్గించవచ్చు. కానీ ప్రభుత్వం అలా చేయదు. కేవలం ఒకటి లేదా రెండు రూపాయలు తగ్గిస్తూ ప్రజలను మోసం చేస్తోంది' అని చిదంబరం విమర్శించారు.

 

 

Trending News