జియో ఆలోచన మా అమ్మాయిదే:ముకేశ్ అంబానీ

టెలికాం రంగంలోకి ప్రవేశించిన ఆదిలోనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో‌కు సంబంధించి ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

Last Updated : Mar 17, 2018, 01:18 PM IST
జియో ఆలోచన మా అమ్మాయిదే:ముకేశ్ అంబానీ

టెలికాం రంగంలో ప్రవేశించిన ఆదిలోనే సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో‌కు సంబంధించి ఆ సంస్థ అధినేత ముకేశ్ అంబానీ ఓ ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘ఫైనాన్షియల్ టైమ్స్-ఆర్సెలార్ మిట్టల్ బోల్డ్‌నెస్‌ ఇన్ బిజినెస్ అవార్డ్స్’ కార్యక్రమంలో ‘డ్రైవర్స్ ఆఫ్ చేంజ్’ అవార్డు అందుకున్న అంబానీ మాట్లాడుతూ.. జియో ఆలోచన వెనక ఉన్న కథను వెల్లడించారు.

అమెరికాలోని యేల్ యూనివర్సిటీలో చదువుతున్న మా అమ్మాయి ఇషా 2011లో ఇంటికొచ్చింది. ఓసారి తన ప్రాజెక్టు వర్క్‌ను నెట్ ద్వారా సమర్పించేందుకు కంప్యూటర్ ఆన్ చేసింది. నెట్ చాలా స్లోగా ఉండడంతో ఆ విషయాన్ని నాకు చెప్పింది. అక్కడే ఉన్న ఇషా సోదరుడు ఆకాశ్ వెంటనే స్పందిస్తూ అప్పట్లో వాయిస్ కాల్స్ ద్వారా టెలికాం కంపెనీలకు డబ్బులొచ్చేవి. ఇప్పుడంతా డిజిటల్ మయం. ఇక భవిష్యత్తు అంతా బ్రాండ్‌బ్యాండ్‌దే అన్నాడు. ఈ టెక్నాలజీని భారత్ మిస్ కాకూడదని వాళ్లిద్దరూ నాతో అన్నారు. వారి మాటలతో నాకో ఆలోచన వచ్చింది. జియో స్థాపనకు నాందిపలికిందని ముకేశ్ వివరించారు.

చవకైన ధరకే దేశంలోని అందరికీ నాణ్యమైన వాయిస్ కాల్స్‌తోపాటు డేటాను అందించాలని అప్పుడే నిర్ణయించుకున్నట్టు తెలిపారు. ఇప్పుడు 5జీ సేవలకు కూడా సిద్ధమవుతున్నట్టు అంబానీ ప్రకటించారు. ప్రస్తుతం రిలయన్స్ జియో 4జీ ఎల్‌టీఈలో అతిపెద్ద డేటా నెట్‌వర్క్ కలిగి ఉందని చెప్పిన అంబానీ.. వచ్చే ఏడాది నాటికి భారత్ 4జీ సేవల్లో ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ అవుతుందని జోస్యం చెప్పారు. రెండేళ్ల క్రితం డేటా వినియోగంలో భారత్ ప్రపంచంలో 155వ స్థానంలో ఉంటే జియో రాకతో ప్రస్తుతం అగ్రస్థానానికి చేరుకున్నట్టు అంబానీ వివరించారు.

Trending News