చైనాకు వెళ్తున్న రంగస్థలం మూవీ ?

చైనాలో భారతీయ చిత్రాలకు పెరుగుతున్న ఆదరణ 

Last Updated : Jun 11, 2018, 12:45 PM IST
చైనాకు వెళ్తున్న రంగస్థలం మూవీ ?

చైనా ఆడియెన్స్‌కి క్రమక్రమంగా భారతీయ చిత్రాలపై ఇష్టం పెరిగిపోతోంది. ఎక్కువ ఎమోషన్స్‌తో కూడిన కథాంశం ఉన్న భారతీయ చిత్రాలను చైనా ఆడియెన్స్ ఆదరిస్తున్నారు. గతంలో బజ్రంగీ భాయిజాన్, బాహుబలి: ది బిగినింగ్, బాహుబలి: ది కన్‌క్లూజన్, దంగల్ వంటి చిత్రాలతోపాటు రజినీకాంత్ నటించిన పలు చిత్రాలు చైనాలో రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు భారీ కలెక్షన్స్ సైతం సొంతం చేసుకున్నాయి. దీంతో భారత్‌లో బాగా పర్‌ఫామ్ చేసిన చిత్రాలకు చైనాలో ఆదరణ పెరుగుతూవస్తోంది. తాజాగా టాలీవుడ్‌లో సూపర్ హిట్ అయిన రంగస్థలం చిత్రంపై సైతం చైనా డిస్ట్రిబ్యూటర్స్ కన్ను పడినట్టు టాలీవుడ్ వర్గాల్లో ఓ టాక్ వినిపిస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో రామ్ చరణ్, సమంత, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో నటించారు. 

టాలీవుడ్ మీడియా కథనాల ప్రకారం భారతీయ చిత్రాలను చైనాలో రిలీజ్ చేస్తోన్న ఓ చైనీస్ డిస్ట్రిబ్యూటర్ ఈ రంగస్థలం సినిమాను చైనాలో విడుదల చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. వాస్తవానికి రంగస్థలం సినిమా అంతా ఆంధ్రాలో ఒక ప్రాంతానికి చెందిన యాసతో కొనసాగుతుంది. కానీ రంగస్థలం సినిమాలో ఉన్న రివేంజ్ స్టోరీ, ఎమోషన్స్ చైనా ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతాయని ఆ డిస్ట్రిబ్యూటర్ భావిస్తున్నాడట. మరి చైనా సెన్సార్ బోర్డ్ రంగస్థలం విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో లేదో వేచిచూడాల్సిందే. 

Trending News