Purandeswari Political Career: పురందేశ్వరిని బీజేపి పక్కకుపెట్టిందా ? ఎన్టీఆర్ కూతురు చేసిన తప్పేంటి ?

Purandeswari Gets Big Shock From BJP: పురందేశ్వరికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చిందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న బీజేపి హై కమాండ్.. ఆమెపై ఒకటి తర్వాత ఒకటిగా యాక్షన్ తీసుకుంటూ గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తుండమే ఈ టాక్‌కి కారణమైంది.

Written by - Pavan | Last Updated : Sep 10, 2022, 01:29 AM IST
  • పురందేశ్వరికి గతంలో ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన బీజేపి
  • పురందేశ్వరికి ఇచ్చిన పదవుల్లో, ప్రాధాన్యతల్లో కోత
  • పురందేశ్వరిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న అధిష్టానం
  • పురందేశ్వరి టీడీపీకి దగ్గరవుతున్నారా ?
  • ఇంతకీ ఎన్టీఆర్ కూతురు చేసిన తప్పేంటి ?
  • అమిత్ షా వంటి పెద్దలు చెప్పినా ఆమె వినిపించుకోలేదా ?
Purandeswari Political Career: పురందేశ్వరిని బీజేపి పక్కకుపెట్టిందా ? ఎన్టీఆర్ కూతురు చేసిన తప్పేంటి ?

Purandeswari Gets Big Shock From BJP: పురందేశ్వరికి భారతీయ జనతా పార్టీ షాకిచ్చిందా అంటే అవుననే టాక్ బలంగా వినిపిస్తోంది. దగ్గుబాటి పురందేశ్వరి వ్యవహారశైలిపై గుర్రుగా ఉన్న బీజేపి హై కమాండ్.. ఆమెపై ఒకటి తర్వాత ఒకటిగా యాక్షన్ తీసుకుంటూ గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు తగ్గించుకుంటూ వస్తుండమే ఈ టాక్‌కి కారణమైంది. అన్నింటికి మించి పురందేశ్వరిని పలు కీలక బాధ్యతల నుంచి తప్పిస్తూ బీజేపి నిర్ణయం తీసుకోవడం ఆమెకు మరింత షాక్‌నిచ్చే అంశం కానుంది. ఇంతకీ పురందేశ్వరి చేసిన తప్పేంటి ? పార్టీలో చేర్చుకుని ప్రయార్టీ ఇచ్చిన బీజేపికి కోపం తెప్పించేంత తప్పు ఆమె ఏం చేశారు ? పురందేశ్వరి నుంచి బీజేపి తిరిగి తీసేసుకుంటున్న పదవులు ఏంటి ? ప్రస్తుతం పురందేశ్వరి పొలిటికల్ స్టేటస్ ఏంటి, పొలిటికల్ స్టాండ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

కేంద్రంలో యూపీఏ సర్కారు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర మంత్రిగా పనిచేసిన దగ్గుబాటి పురందేశ్వరి.. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలో చేరారు. తెలుగు రాష్ట్రంపై ఉత్తరాధి వారి పెత్తనం ఏంటని ప్రశ్నిస్తూ తెలుగు దేశం పార్టీని స్థాపించి, ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని పరిపాలించిన స్వర్గీయ నందమూరి తారక రామారావుకు కూతురైన పురందేశ్వరికి బీజేపిలో తగిన గౌరవమే దక్కింది. 2014లో బీజేపిలో చేరిన పురందేశ్వరికి ఆ పార్టీ అదే ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కడప జిల్లా రాజంపేట నుంచి పోటీ చేసే అవకాశం ఇచ్చింది. కానీ ఆ ఎన్నికల్లో ఆమె ఓటమిపాలయ్యారు. అయినప్పటికీ ఆమెను నిరుత్సాహపర్చకుండా బిజేపి అధినాయకత్వం ఆమెకు ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్ ఇంచార్జ్ బాధ్యతలు అప్పగించారు.

పురందేశ్వరికి అప్పుడు ఎందుకంత ప్రాధాన్యత ?
కాంగ్రెస్ పార్టీ నుండి రెండు పర్యాయాలు లోక్ సభకు ఎన్నికై రెండుసార్లు కేంద్ర సహాయ మంత్రిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన పురందేశ్వరికి కాంగ్రెస్ పార్టీతో మంచి సంబంధాలు ఉన్నాయి. మరోవైపు తన తండ్రి నందమూరి తారక రామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ నేతలతోనూ ఆమెకు అంతే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఎన్టీఆర్ కూతురిగా ఆమె ఎక్కడికెళ్లినా అక్కడ ఆమెకు సముచిత స్థానం, గౌరవం దక్కేవి. అయితే, రాష్ట్ర విభజన అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రాభవం కోల్పోయి ఆ పార్టీ నేతలు దిక్కులు చూస్తున్న సమయంలోనే ఆమె కూడా కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపిలో చేరారు. 

కాంగ్రెస్ పార్టీని వీడి తమ పార్టీలో చేరిన పురందేశ్వరికి బీజేపి కూడా సముచిత స్థానం కల్పించింది. కేంద్ర మంత్రిగా పనిచేసిన అనుభవం, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలతో ఆమెకు ఉన్న సంబంధాలు భవిష్యత్తులో తమ పార్టీకి కలిసొస్తాయని అప్పట్లో బీజేపి భావించిందంటారు. ముఖ్యంగా టీడీపీకి చెందిన కీలక నేతలను, ఇతర రంగాల ప్రముఖులను బీజేపిలో చేర్పించడంలో పురందేశ్వరి ప్రధాన పాత్ర పోషిస్తారని బీజేపి భావించినట్టు సమాచారం. అందుకే ఆమె రాజంపేట లోక్ సభ స్థానం ఓడినప్పటికీ.. ఆ ఒక్క టికెట్‌తో మాత్రమే సరిపెట్టకుండా పార్టీలో తగిన ప్రాధాన్యత ఇస్తూ వచ్చినట్టు పార్టీ వర్గాలు చెబుతుంటాయి. అన్నింటికి మించి బీజేపీలో చేరికల కమిటీకి చైర్‌పర్సన్‌గా నియమించిన బీజేపి అధిష్టానం.. ఆమె నుంచి ఎంతో ఆశించిందని ఆ పార్టీ నేతలే చెబుతుంటారు. 

పురందేశ్వరి చేసిన తప్పేంటి ?
బీజేపీలో చేరికల కమిటీకి చైర్‌పర్సన్‌గా ఉన్న పురందేశ్వరి ఆ స్థానానికి, ఆ పదవికి న్యాయం చేయడం లేదని బీజేపి భావిస్తోందట. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి ప్రాంతాల వారీగా వివిధ బలమైన సామాజిక వర్గాలకు చెందిన వారు బీజేపిలో చేరేలా పురందేశ్వరి వ్యవహరిస్తారని భావించినప్పటికీ.. ఆమె ఆ దిశగా ఏ కోశానా ప్రయత్నాలు చేయడం లేదని స్వయంగా బీజేపి అధిష్టానమే అర్థం చేసుకున్నట్టు టాక్ వినిపిస్తోంది. చేరికల కమిటీ మీటింగ్స్ పెట్టి పార్టీని పునరుత్తేజపర్చాలని స్వయంగా అమిత్ షా వంటి సీనియర్ నాయకులే చెప్పినా.. ఆమెలో చలనం లేదనేది పురందేశ్వరి మీదున్న ప్రధానమైన అభియోగం. 

Purandeswari-to-join-tdp-rumours-on-purandeswari-political-career.jpg

పురందేశ్వరి టీడీపీకి దగ్గరవుతున్నారా ?
బీజేపిలో చేరికలపై పురందేశ్వరి ఆసక్తి చూపించకపోవడం బీజేపి ఆగ్రహానికి ఓ కారణమైతే.. ఇటీవల కాలంలో ఆమె టీడీపీ పట్ల మెతక వైఖరి అవలంభిస్తున్నారని, ఆమె ఆ పార్టీకి దగ్గరవుతున్నారా అనే అనుమానాలు బీజేపికి కలుగుతున్నాయంట. తన తండ్రి స్థాపించిన టీడీపీ వైపు ఆమె ఆకర్షితులవుతున్నట్టు గ్రహించిన బీజేపి హై కమాండ్.. ఆమెపై ఎప్పటికప్పుడు ఓ కన్నేసిపెట్టినట్టు టాక్. 

పురందేశ్వరికి దూరమవుతున్న పదవులు 
పురందేశ్వరికి ప్రాధాన్యత కల్పిస్తూ గతంలో ఇచ్చిన పదవులను బీజేపి తిరిగి తీసుకుంటోంది. బీజేపిలో చేరికలపై ఆసక్తి చూపించకపోగా.. టీడీపీకి దగ్గరవుతున్నట్టుగా కనిపిస్తున్న పురందేశ్వరి విషయంలో ఇకనైనా జాగ్రత్త పడకపోతే లాభం లేదని బీజేపి అధిష్టానం భావించినట్టు తెలుస్తోంది. అందుకే గత నెలలో ఒరిస్సాలో బీజేపి ఇంచార్జ్ పోస్ట్ నుంచి తప్పించి సహ ఇంచార్జ్‌గా కొనసాగిస్తున్నారు. ఇదిలావుండగా తాజాగా ఛత్తీస్‌ఘడ్ బిజేపి ఇంచార్జ్ బాధ్యతల నుంచి కూడా పురందేశ్వరిని తప్పిస్తూ బీజేపి అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఇక మిగిలిందల్లా.. చేరికల కమిటీ బాధ్యతల నుంచి తప్పించడమేనని.. ఇక రేపోమాపో ఆ పని కూడా జరిగిపోవడం ఖాయం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

రాజకీయాలకు గుడ్‌బై చెబుతారా ? కొడుకు హితేష్‌కి వారసత్వం ఇస్తారా ? పురందేశ్వరి మనసులో ఏముంది ?
బీజేపిలో చేరినప్పటి నుంచి రాజకీయాల్లో చురుకుగా లేని పురందేశ్వరి.. ఒకానొక దశలో ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పే ఆలోచనలో ఉన్నారనే టాక్ వినిపించింది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు -  పురందేశ్వరిల వారసుడు దగ్గుబాటి హితేష్‌ని రాజకీయాల్లోకి దింపేందుకు ప్లాన్ జరుగుతున్నట్టుగానూ ఓ ప్రచారం జరిగింది. దగ్గుబాటి వెంకటేశ్వర రావు వైసీపీలో చేరి, తాను గతంలో అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహించిన ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుండే వైసీపీ తరపున హితేష్‌కి టికెట్ ఇప్పిస్తే ఎలా ఉంటుందనే కోణంలోనూ మంతనాలు జరిగినట్టు రాజకీయవర్గాల్లో ప్రచారం జరిగింది. ఒకవేళ హితేష్ పూర్తి స్థాయిలో రాజకీయాల్లోకి దిగితే.. తాను రాజకీయాల నుంచి రిటైర్ అయ్యే ఆలోచనలో పురందేశ్వరి (Dabbubati Purandeswari) ఉన్నారనేది ఆమె సన్నిహితులు చెప్పే మాట. ఈ మొత్తం వ్యవహారంపై పురందేశ్వరి మనసులో ఏముందనేదే ప్రస్తుతం ఆసక్తికరమైన అంశం.

Also Read : Chandrababu:వేరుశనగ బస్తాల చోరీ.. ప్రేమ పేరుతో చేపలమ్ముకునే అమ్మాయికి మోసం! చంద్రబాబు ఫ్లాష్ బ్యాక్ ఇదేనట..!

Also Read : AP CABINET: కేబినేట్ లో మార్పుల దిశగా సీఎం జగన్.. వేటు పడే మంత్రులు వీళ్లేనా?

Also Read : AP Politics: ఏపీలో ప్రతిపక్షం ఏకం కాదా..జగన్ వ్యూహానికి బీజేపీ అధిష్టానం మద్దతుందా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News