భారత స్వర్ణ పతక విజేతపై దాడి

కామన్వెల్త్‌ క్రీడల్లో భారతదేశానికి స్వర్ణ పతకాన్ని అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ పూనమ్‌ యాదవ్‌పై పలువురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు

Last Updated : Apr 15, 2018, 09:01 PM IST
భారత స్వర్ణ పతక విజేతపై దాడి

కామన్వెల్త్‌ క్రీడల్లో భారతదేశానికి స్వర్ణ పతకాన్ని అందించిన వెయిట్‌ లిఫ్టర్‌ పూనమ్‌ యాదవ్‌పై పలువురు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. వివరాల్లోకి వెళితే వారణాసి ప్రాంతంలో తనకు తెలిసిన వారి ఇంటికి వెళ్లినప్పుడు కొందరు వ్యక్తులు క్రీడాకారిణిపై దాడికి యత్నించారు. ఆమెపై రాళ్లు విసిరారు. ఈ ఘటనతో విస్తుపోయిన ఆమె వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

పూనమ్ బంధువులకు, ఆ ఊరిలో మరికొంతమందికి భూమికి సంబంధించి ఓ విషయంలో చాలా రోజులుగా గొడవ నడుస్తోంది. ఈ క్రమంలో ఆ సమస్యను గురించి తెలుసుకోవడానికి వెళ్లిన క్రీడాకారిణిపై ప్రత్యర్థులు దాడికి దిగారు. ఆ ఘటనలో పూనమ్ తండ్రికి, సోదరుడికి కూడా గాయాలయ్యాయి. అయితే.. పూనమ్ పోలీసులకు సమాచారం అందించి.. తనను కాపాడమని తెలియజేయగానే వెంటనే వారు రంగంలోకి దిగారు.

వారణాసి గ్రామీణ ఎస్పీ అమిత్‌ కుమార్‌ ఈ సంఘటన గురించి తెలుపుతూ తాము సమాచారం అందిన వెంటనే వెళ్లి క్రీడాకారిణిని, ఆ కుటుంబ సభ్యులను సురక్షితంగా ఇంటికి తీసుకెళ్లామని తెలియజేశారు. ఈ ఘటనకు కారకులైనవారి పై తాము తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. పూనమ్ ఇటీవలే 69 కేజీల విభాగంలో భారతదేశానికి వెయిట్ లిఫ్టింగ్‌లో బంగారు పతకం తీసుకొచ్చారు. 

Trending News