జగన్‌ని కలుస్తా.. చంద్రబాబుని ఓడించేందుకు కృషి చేస్తా : మోత్కుపల్లి నర్సింహులు

ఎవడబ్బ సొమ్మని అలా ఖర్చు పెడుతున్నావ్‌ చంద్రబాబూ ? : మోత్కుపల్లి నర్సింహులు

Last Updated : Jun 15, 2018, 01:38 PM IST
జగన్‌ని కలుస్తా.. చంద్రబాబుని ఓడించేందుకు కృషి చేస్తా : మోత్కుపల్లి నర్సింహులు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రపూరిత వైఖరి వల్లే దళితులకు పదవులు రాలేదని మాజీ మంత్రి, టీడీపీ తెలంగాణ విభాగం బహిష్కృత నేత మోత్కుపల్లి నర్సింహులు ఆగ్రహం వ్యక్తంచేశారు. తనను నమ్మిన వాళ్లను నమ్మిస్తూనే గొంతు కోసే నమ్మక ద్రోహి చంద్రబాబు. అందుకే ఎలాగైనా సరే రాబోయే ఎన్నికల్లో దళితులు, అన్ని రాజకీయ పక్షాలు ఏకమై చంద్రబాబును చిత్తుగా ఓడించేందుకు కృషి చేయాలని మోత్కుపల్లి పిలుపునిచ్చారు. గురువారం హైదరాబాద్‌లో వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి తనని కలిసిన సందర్భంలో మోత్కుపల్లి నర్సింహులు ఈ వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు తనకు చేసిన అన్యాయాన్ని సైతం నర్సింహులు విజయసాయి రెడ్డికి వివరించి ఆవేదన వ్యక్తంచేశారు. 

వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, మోత్కుపల్లి నర్సింహులు మధ్య జరిగిన భేటీలో అనేక అంశాలు ప్రస్తావనకొచ్చినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా పార్క్ హయత్ హోటల్‌లో బస చేయడం, ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లడం వంటి పనుల ద్వారా చంద్రబాబు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని మోత్కుపల్లి మండిపడ్డారు. చంద్రబాబు లక్షల కోట్ల నల్ల ధనం సంపాదిస్తే, ఇప్పుడు అతడి కొడుకు నారా లోకేష్ కూడా అదే పని చేస్తున్నాడు అని మోత్కుపల్లి ఆరోపించారు.
చంద్రబాబు ఆస్తులపై విచారణ చేపడితే అసలు వాస్తవాలు వెలుగులోకొస్తాయని మోత్కుపల్లి డిమాండ్ చేశారు. 

దళితులని గౌరవించే వైఎస్ జగన్‌తో కలిసి నడుస్తా. వీలైతే వైఎస్ జగన్‌తో కలిసి పాదయాత్రలో పాల్గొంటా. ఈ వారంలో తిరుమలకు వెళ్లనున్న తాను.. చంద్రబాబును ఓటమి పాలుచేసి అసలు రాజకీయాల్లోనే లేకుండా చేయాల్సిందిగా ఆ వేంకటేశ్వర స్వామిని వేడుకుంటానని మోత్కుపల్లి తన మనసులో మాటను చెప్పుకొచ్చారు. 

Trending News