TTD Chairman Bhumana Karunakar Reddy: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ.. కీలక నిర్ణయాలు వెల్లడి

TTD Chairman Bhumana Karunakar Reddy: చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Sep 7, 2023, 08:23 AM IST
TTD Chairman Bhumana Karunakar Reddy: ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై స్పందించిన టీటీడీ.. కీలక నిర్ణయాలు వెల్లడి

TTD Chairman Bhumana Karunakar Reddy: యువ‌త‌లో హైంద‌వ స‌నాత‌న ధ‌ర్మ వ్యాప్తి కోసం శ్రీ‌వారి ఆల‌యం నుండే తొలి అడుగు వేస్తున్నామ‌ని, ఇందులో భాగంగా రామ‌కోటి త‌ర‌హాలో గోవింద కోటి రాసిన 25 ఏళ్ల లోపు వారికి వారి కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఒక‌సారి తిరుమ‌ల స్వామివారి బ్రేక్ ద‌ర్శ‌నం క‌ల్పిస్తామ‌ని టీటీడీ ధర్మకర్తల మండలి అధ్య‌క్షులు భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి వెల్ల‌డించారు. 10 ల‌క్ష‌ల 1,116 సార్లు గోవిందనామం రాసిన‌వారికి ద‌ర్శ‌న సౌభాగ్యం క‌ల్పిస్తామ‌న్నారు. తిరుమ‌ల అన్న‌మ‌య్య భ‌వ‌నంలో మంగ‌ళ‌వారం ధ‌ర్మ‌క‌ర్త‌ల మండ‌లి తొలి స‌మావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా తీసుకున్న ముఖ్య నిర్ణ‌యాల‌ను టీటీడీ ఛైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి మీడియాకు తెలియ‌జేశారు.

స‌నాత‌న ధ‌ర్మం ప‌ట్ల‌, మాన‌వీయ, నైతిక విలువ‌ల ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఎల్‌కెజి నుండి పిజి వ‌ర‌కు చ‌దువుతున్న విద్యార్థుల‌కు సుల‌భంగా అర్థ‌మ‌య్యేలా 20 పేజీల్లో భ‌గ‌వ‌ద్గీత సారాంశాన్ని పుస్త‌క ప్ర‌సాదంగా కోటి పుస్త‌కాలు ముద్రించి పంపిణీ చేస్తామ‌న్నారు. 

అధికమాసం కారణంగా ఈ ఏడాది సెప్టెంబర్‌ 18 నుండి 26వ తేదీ వరకు సాలకట్ల బ్రహ్మోత్సవాలు, అక్టోబర్‌ 15 నుంచి 23 వరకు నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తాం. పెరటాసి మాసం కూడా వస్తున్నందువల్ల భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది కావున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేసి బ్ర‌హ్మోత్స‌వాల‌ను విజ‌య‌వంతం చేస్తాం అని టీటీడీ ఛైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రకటించారు.

సెప్టెంబర్‌ 18న ధ్వజారోహణం సందర్భంగా ముఖ్యమంత్రివర్యులు వైఎస్‌. జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారు. 2024 సంవత్సరం టీటీడీ క్యాలండర్లు, డైరీలను ముఖ్యమంత్రి జగన్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాలలో ముఖ్యంగా గరుడసేవ నాడు విశేషంగా విచ్చేసే భక్తులకు సౌకర్యాల కల్పనలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా, తగిన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను ఆదేశించడం జరిగింది అని టీటీడీ ఛైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. నేరుగా వచ్చి బ్రహ్మోత్సవాలను తిలకించలేని భక్తుల సౌలభ్యం మేరకు ఉదయం, రాత్రి వాహన సేవలను శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ( SVBC ) ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తాం అని స్పష్టంచేశారు.  

చిరుత దాడిలో మృతి చెందిన చిన్నారి లక్షిత కుటుంబానికి టీటీడీ ద్వారా గతంలో ప్రకటించిన రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియాను రూ.10 లక్షలకు పెంచాలని టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్టు టీటీడీ ఛైర్మ‌న్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. 

ఈ ఏడాది జరిగే శ్రీవారి సాలకట్ల, నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మరింత మెరుగ్గా పారిశుద్ధ్య నిర్వహణకు గాను అదనంగా కార్మికులను ఏర్పాటు చేసుకునేందుకు రూ.32.73 లక్షలు మంజూరుకు ఆమోదం తెలపడం జరిగిందన్నారు.చంద్రగిరి శ్రీ మూలస్థాన ఎల్లమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.2 కోట్లతో దాఖలైన టెండర్ ఆమోదించడం జరిగిందన్నారు.

ముంబయిలోని బాంద్రాలో రూ.1.65 కోట్లతో శ్రీ వేంకటేశ్వరస్వామి వారి రెండో ఆలయం, రూ.5.35 కోట్లతో సమాచార కేంద్రం నిర్మాణానికి పరిపాలన ఆమోదం. ఈ మొత్తాన్ని టీటీడీ బోర్డు స‌భ్యులు విరాళంగా అందిస్తారు. రూ.49.48 కోట్లతో టీటీడీ ఉద్యోగుల 1476 క్వార్టర్ల మరమ్మతులు చేపట్టేందుకు ఆమోదించడం జరిగిందని కరుణాకర్ రెడ్డి స్పష్టంచేశారు. రూ.600 కోట్లతో తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనుక వైపు గల 2, 3 సత్రాల స్థానంలో అచ్యుతం, శ్రీపథం వసతి సముదాయాల నిర్మాణానికి అనుమతులు ఆమోదించినట్టు స్పష్టంచేశారు.

టీటీడీ ఆలయాల్లో అర్చకులు, పరిచారకులు, పోటు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లు కలిపి 413 పోస్టులు మంజూరు కోసం ప్రభుత్వానికి విన్నవించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుపతిలో నిర్మాణం కానున్న శ్రీ పద్మావతి చిన్నపిల్లల సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రిలో 29 మంది స్పెషలిస్టు డాక్టర్లు, 8 మంది డ్యూటీ డాక్టర్లు, 15 మంది పాలనా సిబ్బంది, ఏడుగురు పారామెడికల్‌ సిబ్బంది, 241 మంది శ్రీ లక్ష్మీ శ్రీనివాస మ్యాన్‌పవర్‌ కార్పొరేషన్‌ సిబ్బంది కలిపి మొత్తం 300 మంది నియామకానికి ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ ఆధ్వర్యంలోని ధర్మగిరి, కీసరగుట్ట, విజయనగరం, ఐ.భీమవరం, కోటప్పకొండ, తెలంగాణలోని నల్గొండ వేద విజ్ఞానపీఠాలకు సంబంధించి అదనంగా 47 అధ్యాపక పోస్టుల మంజూరుకు ఆమోదం చెప్పడం జరిగిందని భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు.

యాత్రికులకు మరిన్ని సదుపాయాలు 
తిరుపతికి వచ్చే లక్షలాది మంది యాత్రికులకు మరింత మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు టీటీడీ ధర్మకర్తల మండలి పలు నిర్ణయాలు తీసుకుందని చెబుతూ.. భక్తులు తిరుచానూరుకు సులువుగా చేరుకోవడం కోసం రేణిగుంట రోడ్డులోని నారాయణాద్రి కూడలి నుంచి తిరుచానూరు వైపు ఉన్న రోడ్డును నాలుగు వరసల 150 అడుగుల బైపాస్ రోడ్డుగా అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నాం అన్నారు. దీనివల్ల యాత్రీకులకు సౌకర్యవంతంగా ఉండటంతో పాటు, తిరుపతి నగరం మీద ట్రాఫిక్ ఒత్తిడి కూడా తగ్గుతుంది అని తెలిపారు.

తిరుపతి నగరంలోని శ్రీనివాసం వసతి సముదాయం పక్కన గల వైఎస్సార్ మార్గం నుంచి సామవాయి మార్గం వరకు రూ.9.60 కోట్లతో 40 అడుగుల రోడ్డు నిర్మాణానికి నిర్ణయం తీసుకోవడంతో పాటు తిరుచానూరు అమ్మవారి దర్శనం అనంతరం యాత్రికులు తిరుపతి నగరంలోని మంగళం ప్రాంతానికి  సులువుగా చేరుకోవడానికి వీలుగా మంగళం రోడ్డులోని ఆర్టీవో కార్యాలయం కూడలి నుంచి రేణిగుంట రోడ్డులోని శ్రీ పద్మావతి ఫ్లోర్ మిల్ దాకా రూ.19.50 కోట్లతో 2.90కిలో మీటర్ల దూరం 80 అడుగుల మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి ఆమోదం లభించిందన్నారు.

యాత్రికులు  ట్రాఫిక్ ఇబ్బందులు పడకుండా రేణిగుంట రోడ్డులోని హీరో హోండా షోరూమ్ నుంచి తిరుచానూరు రోడ్డులోని గ్రాండ్ రిడ్జ్ హోటల్ వద్ద బైపాస్ రోడ్డుకు చేరుకునేలా రూ.4 కోట్లతో 1.135 కిలో మీటర్ల మేరకు రోడ్డు నిర్మాణానికి అనుమతి ఇవ్వడం జరిగిందన్నారు.  

చివరిగా తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి.. సనాతన ధర్మం అనేది ఒక మతం కాదని, అదొక జీవనయానమని అని చెప్పారు. ఈ విషయం తెలియక సనాతన ధర్మానికి కులాలను ఆపాదించి విమర్శలు చేయడం వల్ల సమాజంలో అలజడి చెలరేగే ప్రమాదం ఉంటుందన్నారు. ఇది విమర్శకులకు కూడా మంచిది కాదని కరుణాకర్ రెడ్డి హితవు పలికారు.

Trending News