Polavaram Project: కష్ట సమయంలో ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్..!

Union Govt On Polavaram Project: పోలవరం ప్రాజెక్ట్‌లో తాగు నీటి విభానికి సంబంధించి ఖర్చులను కూడా భరించేందుకు కేంద్రం అంగీకారం తెలిపింది. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, అదనంగా మరో 2 వేల కోట్లు విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.  

Written by - Ashok Krindinti | Last Updated : Jul 31, 2023, 07:43 PM IST
Polavaram Project: కష్ట సమయంలో ఏపీకి కేంద్రం గుడ్‌న్యూస్.. ఎట్టకేలకు గ్రీన్‌ సిగ్నల్..!

Union Govt On Polavaram Project: పోలవరం ఇరిగేషన్‌ ప్రాజెక్ట్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి శుభవార్త తెలిపింది. ప్రాజెక్ట్‌లో కేవలం సాగు నీటి విభాగం పనులకు  మాత్రమే నిధులు ఇస్తామని.. తాగు నీటి విభాగం కోసం చేసే ఖర్చును భరించే ప్రసక్తే లేదంటూ ఇన్నాళ్లు ఒప్పుకోని కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకారం తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చేసిన విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకుని తాగునీటి విభాగానికి ప్రతిపాదించిన వ్యయాన్ని కూడా తిరిగి చెల్లించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాజ్యసభలో సోమవారం వైసీపీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి పోలవరం ప్రాజెక్ట్‌ సవరించిన అంచనా వ్యయానికి సంబంధించిన 55,548 కోట్ల రూపాయల నిధుల గురించి అడిగిన ప్రశ్నకు జలశక్తి మంత్రి బిశ్వేశ్వర్‌ తుడు జవాబిచ్చారు.

పోలవరం ప్రాజెక్ట్‌లో ఇరిగేషన్‌ విభాగానికి సంబంధించి మిగిలిపోయిన పనులు పూర్తి చేయడానికి రూ.10,911.15 కోట్లు, వరదల కారణంగా దెబ్బతిన్న ప్రాజెక్ట్‌ నిర్మాణంలో మరమ్మతు పనుల నిమిత్తం అదనంగా మరో 2 వేల కోట్ల రూపాయలు విడుదల చేయడానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ అంగీకరించిందని తెలిపారు. అలాగే తాగునీటి విభాగానికి సంబంధించిన ప్రతిపాదిత ఖర్చును రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి చెల్లించేందుకు అభ్యంతరం లేదని తమకు సమాచారం ఇచ్చిందని మంత్రి చెప్పారు.

పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇప్పటి వరకు కాంపోనెంట్‌ వారీగా జరిగిన పనులకు కేంద్రం నిధులు చెల్లిస్తూ వస్తోంది. కాంపోనెంట్‌ వారీగా నిధుల చెల్లింపు వలన ప్రాజెక్ట్‌ నిర్మాణ పనుల్లో తీవ్ర జాప్యం నెలకొంటోందని రాష్ట్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు కేంద్ర ప్రభుత్వానికి విన్నవించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఢిల్లీ పర్యటనల్లో ఇదే విషయాన్ని పలుమార్లు ప్రధాని నరేంద్ర మోదీ, జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ దృష్టికి తీసుకువచ్చి కాంపోనెంట్‌ వారీ చెల్లింపులపై సీలింగ్‌ను ఎత్తివేయాలని కోరారు. పోలవరం ప్రాజెక్ట్‌లో కాంపోనెంట్‌ వారీ సీలింగ్‌ను ఎత్తివేస్తున్నట్లుగా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వ్యయ విభాగం గత జూన్‌ 5న తమకు రాసిన లేఖలో స్పష్టం చేసినట్లు మంత్రి వెల్లడించారు.

విశాఖలో కేంద్ర ప్రభుత్వం అమృత్ మిషన్ కింద 234 కోట్లతో మంజూరు చేసిన 8 ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తికాగా.. మిగిలిన ప్రాజెక్ట్‌ పనులు పురోగతిలో ఉన్నాయని పట్టణాభివృద్ధి వ్యవహారాల శాఖ సహాయ మంత్రి కౌశల్ కిషోర్ తెలిపారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అమృత్ మిషన్ కింద ఎంపిక చేసిన నగరాల్లో విశాఖపట్నం ఒకటి అని తెలిపారు. అందులో భాగంగా గ్రౌండింగ్ అయిన మొత్తం ప్రాజెక్టులకుగాను రూ.73.31 కోట్లతో చేపట్టిన 4 ప్రాజెక్టులు పూర్తయ్యాయని.. మిగిలిన ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉన్నట్లు వెల్లడించారు. 

అలాగే 217 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ప్రారంభించిన మరికొన్ని పనులు భౌతికంగా పూర్తయినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. విశాఖ నగరంలో తాగునీటి సరఫరాకు సంబంధించి 70.44 కోట్లతో చేపట్టిన రెండు ప్రాజెక్టులు, 2.87 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన రెండు పార్కుల నిర్మాణం పూర్తయినట్లు పేర్కొన్నారు. అమృత్ మిషన్ ప్రాథమికంగా 2015-16 ఆర్థిక సంవత్సరం నుంచి 2019-20 ఆర్థిక సంవత్సరం వరకు ఐదేళ్ల కాలవ్యవధితో పూర్తిచేయాలన్న లక్ష్యంతో ప్రాణాళికను సిద్ధం చేసినట్లు చెప్పారు. 

Trending News