Telangana Formation Day: 1200 మంది అమరుల త్యాగఫలితమే తెలంగాణ.. ఆ రోజు నేను నిరవధిక దీక్ష చేశా: కిషన్ రెడ్డి

Kishan Reddy On Telangana Formation Day Celebrations: తెలంగాణ రాష్ట్ర ఆవతరణ దినోత్సవ వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. గోల్కొండ కోటలో త్రివర్ణపతాకాన్ని ఎగురవేస్తామని చెప్పారు. అదేవిధంగా సాయుధ బలగాల పరేడ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.  

Written by - Ashok Krindinti | Last Updated : May 31, 2023, 06:46 PM IST
  • తెలంగాణ కోసం బీజేపీ పాల్గొనని ఉద్యమం లేదు
  • తెలంగాణ ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తాం..
  • కేంద్ర బలగాల కవాతు ఉంటుంది: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
Telangana Formation Day: 1200 మంది అమరుల త్యాగఫలితమే తెలంగాణ.. ఆ రోజు నేను నిరవధిక దీక్ష చేశా: కిషన్ రెడ్డి

Kishan Reddy On Telangana Formation Day Celebrations: ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు విషయంలో బీజేపీ పాత్ర అత్యంత కీలకమని.. రాష్ట్ర సాధనకోసం బీజేపీ పాల్గొనని ఉద్యమమే లేదని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. నాడు కాకినాడ తీర్మానం మొదలుకుని, రాష్ట్ర సాధన వరకు.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. రాష్ట్రాభివృద్ధి కోసం బీజేపీ సంపూర్ణ సహకారం అందిస్తోందన్నారు. 9 ఏళ్లలో రాష్ట్రాభివృద్ధికోసం కేంద్రం అన్నిరకాలుగా సహకరిస్తోందన్నారు. బుధవారం న్యూఢిల్లీలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కేంద్రమంత్రి మాట్లాడుతూ.. గతేడాది తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఢిల్లీలో నిర్వహించామని, ఈసారి గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నామని తెలిపారు. 

2వ తేదీన గోల్కొండ కోటపై త్రివర్ణపతాకాన్ని ఎగురవేయడంతోపాటు.. సాయుధ బలగాల పరేడ్ నిర్వహిస్తున్నట్లు కిషన్ రెడ్డి తెలిపారు. సాయంత్రం ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాల్లో శంకర్ మహదేవన్, డాక్టర్ ఆనంద శంకర్ & బృందం, మంజులా రామస్వామి బృందం ద్వారా ప్రదర్శనలు ఉంటాయన్నారు. వీరితోపాటు మంగ్లీ, మధుప్రియలు తెలంగాణ సంప్రదాయాన్ని, ఉద్యమాన్ని ప్రతిబింబించే పాటలు పాడతారని చెప్పారు. పాఠశాల విద్యార్థుల కోసం ‘ఖిలా ఔర్ కహానీ’ థీమ్ తో ‘పెయింటింగ్ & ఫొటో’ పోటీలు నిర్వహించామని తెలిపారు.

"నాడు తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులు, ఉద్యోగులు, కార్మికులు, కర్షకులు.. ఇలా ప్రతి ఒక్కరూ సర్వస్వాన్నీ త్యాగం చేసి పోరాడారు. ఏ ఒక్క కుటుంబమో.. ఏ ఒక్క వ్యక్తి కారణంగానో తెలంగాణ రాలేదు. 1200 మంది అమరుల త్యాగఫలితమే తెలంగాణ. ఉద్యమ సమయంలో జరిగిన ప్రతి ఉద్యమంలోనూ బీజేపీ పాత్ర ఉంది. పార్లమెంటులోనూ సుష్మాస్వరాజ్ గారి నేతృత్వంలోని బీజేపీ.. నాటి అధికార కాంగ్రెస్ మెడలు వంచి తెలంగాణ బిల్లు పెట్టే పరిస్థితి తీసుకొచ్చింది. రాష్ట్ర సాధనకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో ఆంధ్రభవన్లో నేను నిరవధిక దీక్ష చేశా.." అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

రాష్ట్ర సాధన అనంతరం ఈ 9 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం అందించిన సహకారాన్ని వివరిస్తూ.. త్వరలోనే తెలంగాణ ప్రజలముందు పూర్తి వివరాలతో ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. విభజన అంశాల పరిష్కారంలో కేంద్రం అన్నిరకాలుగా ప్రయత్నిస్తోందని.. ఓ ప్రశ్నకు సమాధానంగా కిషన్ రెడ్డి తెలిపారు. రాజ్యాంగబద్ధంగానే నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుందని.. ఈ విషయంలో విభేదాలకు తావిచ్చేలా, ప్రజలను రెచ్చగొట్టేలా ఎవరూ వ్యాఖ్యానించకపోవడమే మంచిదని ఆయన అన్నారు. దక్షిణ భారతం-ఉత్తర భారతం అంటూ విభేదాలను ప్రోత్సహించేందుకు పనిచేస్తున్న వారికి.. కేంద్ర ప్రభుత్వం ‘ఏక్ భారత్-శ్రేష్ఠ్ భారత్’ పేరుతో చేపడుతున్న కార్యక్రమాలు కనిపించడం లేదా? అని కిషన్ రెడ్డి ప్రస్తావించారు.

తమిళనాడుకు చెందిన ‘సెంగోల్‌’ను పార్లమెంటులో ప్రతిష్టించడం, కాశీ-తమిళ్ సంగమం, తమిళ్-సౌరాష్ట్ర సంగమం, కాశీ-తెలుగు సంగమం, కశ్మీర్-తమిళ సంప్రదాయాలను కలిపిన ‘వితస్తా’ కార్యక్రమం వంటివెన్నో చేపడుతున్న విషయాన్ని ఈ సందర్భంగా కిషన్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణలో బీజేపీ నేతల మధ్య విభేదాలే లేవని, కొందరు ఉద్దేశపూర్వకంగానే ఈ వివాదాలను సృష్టిస్తున్నారన్నారు. నాయకులు పార్టీకి ఎంతముఖ్యమో.. ప్రజల్లోనూ పార్టీని గెలిపించాలనే ఆలోచన అంతే ముఖ్యమని కిషన్ రెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా వివిధ రాజ్‌భవన్‌ల్లోనూ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయన్నారు.

Also Read: Bandi Sanjay: A నుంచి Z వరకు బీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలు ఇవే.. బండి సంజయ్ కౌంటర్   

Also Read: Google New Rules: లోన్‌ యాప్‌లపై గూగుల్ కఠిన చర్యలు.. కొత్త నిబంధనలు ఇలా..!  

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , FacebooK

Trending News