టీఎస్ఆర్టీసిలో 6 వేల తాత్కాలిక నియామకాలు

తాత్కాలిక సిబ్బంది సహాయంతో ఆదివారం నుండి పూర్తిస్థాయిలో బస్సుల్ని నడుపుతాం: టిఎస్ఆర్టీసీ యాజమాన్యం

Last Updated : Oct 6, 2019, 12:05 PM IST
టీఎస్ఆర్టీసిలో 6 వేల తాత్కాలిక నియామకాలు

హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు చెందిన సిబ్బంది సమ్మె బాట పట్టడంతో ఆర్టీసి సేవలు నిలిచిపోకుండా ఉండేందుకు టిఎస్ఆర్టీసి తాత్కాలిక ప్రాతిపదికన 6 వేల నియామకాలు. అందులో 4 వేల మంది డ్రైవర్లు, 2 వేల మంది కండక్టర్ల ఉన్నారు. తాత్కాలిక సిబ్బంది సహాయంతో ఆదివారం నుండి పూర్తిస్థాయిలో బస్సుల్ని నడుపుతామని ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. సమ్మెలో పాల్గొంటూ విధులకు దూరంగా ఉన్న సిబ్బంది శనివారం సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరకపోతే, వారిపై వేటు తప్పదని ఆర్టీసీ యాజమాన్యం హెచ్చరికలు జారీచేసింది.

ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొనడంపై సీఎం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. సమ్మె చేసే కార్మికులను ఉపేక్షించేది లేదని.. వారిపై కఠినంగా వ్యవహరించాలని సంబంధిత అధికారులకు స్పష్టంచేసినట్టు తెలుస్తోంది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకే శనివారం సాయంత్రం 6 గంటలల్లోపు విధుల్లో చేరని వారిపై వేటు వేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం సిద్ధమైనట్టు సమాచారం. అదే సమయంలో విధుల్లో చేరినవారికి రక్షణ కల్పిస్తామని ప్రభుత్వం స్పష్టంచేసింది. 

సమ్మెలో పాల్గొంటున్న కార్మిక సంఘాలతో చర్చలు జరపవద్దని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇదివరకు నియమించిన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారుల కమిటీని ఉన్నపళంగా రద్దు చేసింది. అంతేకాకుండా రవాణా శాఖ కమిషనర్‌గా సందీప్‌ సుల్తానియాను నియమించి ప్రస్తుత పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి కఠినంగా వ్యవహరించాల్సిందిగా ఆయనకు సూచించినట్టు సమాచారం.

Trending News