TSRTC strike issue: టిఎస్ఆర్టీసీకి నెలకు ఆ రూ.640 కోట్లు ఎవరిస్తారు ?

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Last Updated : Nov 22, 2019, 12:01 AM IST
TSRTC strike issue: టిఎస్ఆర్టీసీకి నెలకు ఆ రూ.640 కోట్లు ఎవరిస్తారు ?

హైదరాబాద్: ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TSRTC) విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై ప్రభుత్వం విస్తృతస్థాయిలో చర్చ జరిపింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా నడుస్తున్న కేసులు తదితర అంశాలపై కూలంకశంగా అధ్యయనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్‌లో గురువారం ఆర్టీసీపై ఉన్నత స్థాయిలో చర్చ జరిగింది. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, సీనియర్ అధికారులు నర్సింగ్ రావు, సునిల్ శర్మ, రామకృష్ణ రావు, సందీప్ సుల్తానియా, న్యాయశాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి, ఎజి ప్రసాద్,అడిషనల్ ఎజి రాంచందర్ రావు, ఆర్టీసీ ఇడిలు వెంకటేశ్వరరావు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు. 
    
ఆర్టీసీకి ఇప్పటికే 5వేల కోట్లకు పైగా అప్పులున్నాయి. తక్షణం చెల్లించాల్సిన అప్పలు, బకాయిలు దాదాపు 2వేల కోట్ల వరకు ఉన్నాయి. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ మాసానికి సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే 240 కోట్ల రూపాయలు కావాలి. సిసిఎస్‌కు 500 కోట్ల రూపాయలు ఇవ్వాలి. డీజిల్ బకాయిలు చెల్లించాలి. రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉన్నది. 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలి. పిఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు 65-70 కోట్ల రూపాయల వరకు చెల్లించాల్సి ఉంటుంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్లు నడవాలంటే నెలకు రూ.640 కోట్ల రూపాయలు కావాలి అనే అంచనాకు వచ్చారు. 

అయితే, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ భారమంతా ఎవరు భరించాలి. ఆర్టీసీకి ప్రస్తుతం అంత శక్తి లేదు. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదు. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? ఆర్టీసీకి వున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడం. మరి చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైంది. 

ఇదంతా ఇలా ఉండగా.. రూట్ల ప్రైవేటీకరణ అంశంపై శుక్రవారం హైకోర్టు తీర్పు వెలువరించే అవకాశం ఉంది. అందుకే రూట్ల ప్రైవేటీకరణపై హై కోర్టు తీర్పు వెల్లడించిన తర్వాతే అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Trending News