ఆల్‌రౌండర్ హీరోగా పెట్టి సుకుమార్ సినిమా

ఓవైపు దర్శకుడిగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంటూనే మరోవైపు నిర్మాతగా తాను మరో సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు సుకుమార్. 

Last Updated : Mar 16, 2018, 10:20 PM IST
ఆల్‌రౌండర్ హీరోగా పెట్టి సుకుమార్ సినిమా

సుకుమార్ తెరకెక్కించిన రంగస్థలం సినిమా ఈ నెల 30వ తేదీన ఆడియెన్స్ ముందుకు రానుంది. ఓవైపు దర్శకుడిగా ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా వుంటూనే మరోవైపు నిర్మాతగా తాను మరో సినిమాను నిర్మించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు సుకుమార్. సుకుమార్ సొంత నిర్మాణ సంస్థ సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌పై నిర్మాణం కానున్న సినిమాలో హీరో ఇంకెవరో కాదు.. రామ్ చరణ్, సమంత జంటగా తెరకెక్కిన రంగస్థలం సినిమాలో విలన్ పాత్ర పోషించిన ఆది పినిశెట్టినే. అవును, హీరోగా, విలన్‌గా విభిన్నమైన పాత్రలు చేస్తూ నటుడిగా ఆల్‌రౌండర్ అనిపించుకుంటున్న ఆది పినిశెట్టి.. సుకుమార్ సినిమాతో మరోసారి హీరోగా ఆడియెన్స్ ముందుకు రానున్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, రంగస్థలం సినిమాలో ఆది పినిశెట్టి చేత విలన్ పాత్ర చేయించిన దర్శకుడే ఈసారి నిర్మాతగా హీరో పాత్ర చేయిస్తున్నాడన్న మాట.

ఇక్కడి వరకు బాగానే వుంది కానీ ఇంతకీ సుకుమార్ సినిమాను డైరెక్ట్ చేయబోయేది ఎవరు అనేదే కదా మీ సందేహం. ఆ.. అక్కడికే వస్తున్నాం. టాలెంట్ వున్న దర్శకులని ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుండే సుకుమార్ ఈసారి కార్తిక్ వర్మ దండుని దర్శకుడిగా ఎంచుకున్నాడు. గతేడాది నవదీప్ హీరోగా రిలీజైన భమ్ భమ్ బోలేనాథ్ సినిమాను డైరెక్ట్ చేసిన కార్తిక్ వర్మ ఆ సినిమాతో హిట్ కొట్టలేకపోయాడు కానీ దర్శకుడిగా సుకుమార్ కంట్లో పడ్డాడు. అందుకే భమ్ భమ్ బోలేనాథ్ ఫలితంతో సంబంధం లేకుండా అతడికి సుకుమార్ రైటింగ్స్ బ్యానర్‌లో సినిమా డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చాడు సుకుమార్. 

ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనులు సైతం పూర్తయ్యాయి. త్వరలోనే హీరోయిన్ వివరాలతో యుక్తంగా అభిమానుల ముందుకొచ్చేందుకు సుకుమార్ ప్లాన్ చేస్తున్నాడు. 

Trending News