Minister Harish Rao: రాహుల్ గాంధీ కౌంటర్స్‌కి మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్స్

Minister Harish Rao vs Rahul Gandhi: తెలంగాణలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ తీవ్ర స్థాయిలో అవినీతికి పాల్పడుతోందని.. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో బీజేపికి ఏ గతి అయితే పట్టిందో.. రాబోయే రోజుల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే గతి పడుతుంది అంటూ ఖమ్మం జనగర్జన బహిరంగ సభలో ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు.

Written by - Pavan | Last Updated : Jul 3, 2023, 05:03 AM IST
Minister Harish Rao: రాహుల్ గాంధీ కౌంటర్స్‌కి మంత్రి హరీశ్ రావు స్ట్రాంగ్ కౌంటర్స్

Minister Harish Rao vs Rahul Gandhi: రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ట్విటర్ ద్వారా స్పందించిన మంత్రి హరీశ్ రావు.. దేశాన్ని దోచుకున్న చరిత్ర మీది.. అవినీతికి మారుపేరుగా మారిన పార్టీ మీది. అందుకే మీ పార్టీ పేరే స్కాంగ్రెస్‌గా మారింది అందుకే దేశ ప్రజలు మిమ్మ‌ల్ని అధికారం నుంచి దించి మూల‌న కూర్చోబెట్టారు అని రాహుల్ గాంధీని ఎద్దేవా చేశారు.  

బీజేపికి బీ టీమ్‌గా కొనసాగుతున్న బీఆర్ఎస్ పార్టీని ప్రతిపక్షాల సమావేశానికి ఆహ్వానిస్తే తాము ఆ సమావేశానికి రాలేము అని తెగేసి చెప్పాం అని ఖమ్మం సభలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కూడా మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. బీఆర్‌ఎస్‌ పార్టీ ఎవరికీ బీ టీం కాదు.. మాది పేద ప్రజలకు ఏ టీం అని అన్నారు. ప్రజల సంక్షేమం చూసే ఏ - క్లాస్ టీం. బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌ పార్టీకి లేదు. అందుకే దేశాన్ని బీజేపీ కబంద హస్తాల నుంచి కాపాడేందుకే బీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టింది అని మంత్రి హరీశ్ రావు అభిప్రాయపడ్డారు.  

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు అందిస్తాం అని రాహుల్ గాంధీ చేసిన ప్రకటనను మంత్రి హరీశ్ రావు తిప్పికొట్టారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ చేపట్టిన పొడు పట్టాల పంపిణీ కళ్లకు కనిపించలేదా అని ప్రశ్నించిన రేవంత్ రెడ్డి.. మేం పట్టాలు పంచినంక మళ్లీ మీరెచ్చేదేంది ? అప్‌డేట్ తెలుసుకోని ఔట్ డేటెడ్ పొలిటీషియ‌న్ రాహుల్‌ గాంధీ అని ఎద్దేవా చేశారు. 
 
కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు 80,321.57 కోట్లు అయితే, అవినీతి లక్ష కోట్లు అని అనడం పెద్ద జోక్ అని మంత్రి హరీశ్ రావు విస్మయం వ్యక్తంచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం ఖర్చు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది అని, కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడ ఇవ్వ‌లేద‌ని మీ పార్టీ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్రం స‌మాధానం ఇచ్చిన విష‌యం తెలియ‌దా ? అని కాంగ్రెస్ పార్టీ శ్రేణులను నిలదీశారు. స్కీమ్‌ల్లోని స్కాంల్లో ఆరితేరిన కాంగ్రెస్ కుంభకోణాల గురించి మాట్లాడడం.. దెయ్యాలు వేదాలు వల్లించ‌డ‌మే అవుతుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 

ఖమ్మం సభలో రైతుల గురించి కాంగ్రెస్ నేతలు మాట్లాడటాన్ని తప్పు పట్టిన మంత్రి హరీశ్ రావు... అప్పుడే ముదిగొండ కాల్పుల ఘటనను మరిచిపోయారా అని ప్రశ్నించారు. భూములు అడిగితే జైల్లో వేసిన వాళ్ళు, కరెంట్ అడిగితే రైతులను పిట్టల్లా కాల్చి చంపినోళ్లు అంతా ఒక్క చోట చేరి ఖమ్మంలో కల్లబొల్లి కబుర్లు చెప్తే నమ్మే వాళ్ళు ఎవరు లేరు అని మండిపడ్డారు. ఖ‌మ్మం స‌భ గురించి ఒక్క ముక్క‌లో చెప్పాలంటే.. పసలేని ఆరోపణలు, ఊకదంపుడు ప్రసంగాలు.. రాసిచ్చిన స్క్రిప్టుతో రాహుల్ గాంధీ స్కిట్ చేసినట్టుగా ఉంది అని మంత్రి హరీశ్ రావు సెటైర్లు వేశారు.

Trending News