బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు భారతప్రధాని నరేంద్ర మోడీ ఈ రోజు ఒకే వేదికను పంచుకున్నారు. నితీష్ సీఎం అయ్యాక వీరిద్దరూ ఒక వేదిక మీద కలవడం ఇదే తొలిసారి. ఈ రోజు దాదాపు 3,700 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించడం కోసం బీహార్ వచ్చిన మోడీ, నితీష్ను కూడా కలిశారు. అలాగే పట్నా విశ్వవిద్యాలయం శతాబ్ది వేడుకల్లో కూడా ప్రధాని పాలుపంచుకున్నారు. ఈ రోజు ఉదయమే నితీష్ గౌరవసూచకంగా విమానాశ్రయానికి వచ్చి మరీ మోడీకి ఆహ్వానం పలికారు. పట్నా విశ్వవిద్యాలయంలో విద్యార్థులను ఉద్దేశించి మోడీ మాట్లాడుతూ "దాదాపు ప్రతీ రాష్ట్రంలో మనకు కనిపించే సీనియర్ స్థాయి సివిల్ సర్వీసెస్ ఆఫీసర్లందరూ పట్నా యూనివర్సిటీలోనే చదువుకోవడం విశేషం. నేను ఢిల్లీలో కూడా బీహార్ నుండి వచ్చిన అనేకమంది అధికారులను కలిశాను" అని తెలిపారు. అలాగే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ని ప్రత్యేకంగా అభినందించారు. బీహార్ ఉన్నతికి నితీష్ కుమార్ చేసున్న సేవలు ఎంతో అభినందించాల్సినవి అని కొనియాడారు.
PM Shri @narendramodi at the centenary celebrations of Patna University in Patna, Bihar. Watch LIVE at https://t.co/Sfv9Z49LED pic.twitter.com/PkZb193Mw6
— BJP LIVE (@BJPLive) October 14, 2017
అలాగే నేటి విద్యావ్యవస్థ మీద మోడీ స్పందిస్తూ, సృజనాత్మక విద్యకు నేడు దేశంలో పెద్దపీట వేయాల్సిన అవసరం ఎంతో ఉందని, అందుకోసం ప్రభుత్వం అయిదు సంవతర్సాల వరకు 10 ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మరియు 10 పబ్లిక్ యూనివర్సిటీల కోసం 10,000 కోట్ల ఫండింగ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉందని ప్రకటించారు. అలాగే యువతను ఉద్దేశించి మాట్లాడుతూ, యువకులు ప్రజలు ఎదుర్కొనే దైనందిన సమస్యలకు పరిష్కారాలు కనిపెట్టే దిశగా తమ చదువును, సృజనాత్మకతను వినియోగించాలని కోరారు. భారతదేశం యువకులతో నిండిన దేశమని, వారు దేశ అభ్యున్నతికి, ప్రపంచ అభ్యున్నతికి ఎంతో చేయగలరని మోడీ అభిప్రాయపడ్డారు.