అయోధ్య కేసు తీర్పు: అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

అయోధ్య కేసు తీర్పు: అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

Last Updated : Nov 7, 2019, 07:18 PM IST
అయోధ్య కేసు తీర్పు: అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

న్యూ ఢిల్లీ: అయోధ్య రామజన్మ భూమి-బాబ్రీ మసీద్ వివాదంపై తీర్పు వెలువడనున్న నేపథ్యంలో అంతటా అప్రమత్తంగా వుండాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ముఖ్యంగా టెర్రర్ దాడులు జరిగే ప్రమాదం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికల నేపథ్యంలో అయోధ్యలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, శాంతి భద్రతలు దెబ్బ తినకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిందిగా ఉత్తర్ ప్రదేశ్ సర్కార్ని కేంద్రం అప్రమత్తం చేసింది. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించడంతో పాటు ఈ వివాదంపై సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంపైనా నిఘా వేయాల్సిందిగా కేంద్రం సూచించింది. 
                             
4000 మంది కేంద్ర సాయుధ పోలీసు బలగాలు లేదా కనీసం 16 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు ఉండేలా పారామిలిటరీ బలగాలతో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పేర్కొంది. అంతేకాకుండా ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటిబీపీ), సెంట్రల్ రిజర్వు పోలీసు ఫోర్స్(సీఐఎస్ఎఫ్), సహస్ర సీమ బల్(ఎస్ఎస్బి), రాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) భద్రతా బలగాల నుంచి ఒక్కో విభాగం నుంచి ఆరు కంపెనీల చొప్పున బలగాలను రంగంలోకి దించాల్సిందిగా కేంద్రం నుంచి యూపీ సర్కార్ కి స్పష్టమైన ఆదేశాలు వెలువడ్డాయి. అందులో భాగంగానే ఇప్పటికే 13 కంపెనీల సీఆర్పీఎఫ్ బలగాలు అయోధ్యకు పంపించినట్టు కేంద్రం తెపింది. మరో రెండు, మూడు రోజుల్లో మిగతా బలగాలను పంపనున్నట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Trending News