దేవుడు అవకాశం ఇచ్చాడు; బీజేపీ జేడీఎస్‌ను చీల్చేందుకు కుట్ర చేస్తోంది: కుమారస్వామి

కర్ణాటకలో అధికారంలోకి రావడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కుమారస్వామి అన్నారు.

Last Updated : May 16, 2018, 01:34 PM IST
దేవుడు అవకాశం ఇచ్చాడు; బీజేపీ జేడీఎస్‌ను చీల్చేందుకు కుట్ర చేస్తోంది: కుమారస్వామి

బెంగళూరు: కర్ణాటకలో అధికారంలోకి రావడానికి బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోందని జేడీఎస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన కుమారస్వామి ఆరోపించారు. తమ పార్టీ ఎమ్మెల్యేలకు రూ.100 కోట్ల రూపాయిలు, మంత్రి పదవులు ఇస్తామని ఆశ చూపారని ఆరోపించారు. అంత నల్లధనం వారికి ఎక్కడి నుంచి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. గతంలో మేఘాలయ, గోవా, మణిపూర్‌ రాష్ట్రాలలో కాంగ్రెస్‌ అతి పెద్ద పార్టీగా అవతరించి ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ, అక్కడ బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని ఆయన అన్నారు.

జేడీఎస్ పార్టీలో చీలిక తీసుకురావడానికి బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని విమర్శించారు. మత విశ్వాసాలను రెచ్చగొట్టి బీజేపీ విజయం సాధించిందని అన్నారు. కర్ణాటకలో సెక్యులర్‌ ఓట్లు చీలిపోయాయని ఆయన అన్నారు. 104 సీట్లతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఆయన అన్నారు. ప్రధాని మోదీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆయన చెప్పారు. ఆ పార్టీని కట్టడిచేసేందుకు కాంగ్రెస్‌తో కలిసి వెళుతున్నామన్నారు.

'నాకు ఇరుపార్టీల నుంచి ఆఫర్ వచ్చింది. గతంలో బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల మా పార్టీకి మచ్చ ఏర్పడింది. ఈ మచ్చ తొలగించుకోవడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. నేను కాంగ్రెస్‌తో కలిసి వెళ్తాను'  అని హెచ్.డి. కుమారస్వామి, జేడీ(ఎస్) అన్నారు. బీజేపీ కర్ణాటక ఇంచార్జ్ ప్రకాశ్ జవదేకర్ తనను కలవలేదని, బీజేపీ పార్టీ నన్ను సంప్రదించలేదని ఆయన అన్నారు. మేము మరోసారి కాంగ్రెస్ నేతలతో కలిసి గవర్నర్‌ను కలుస్తామని అన్నారు.

బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలకు గాలం వేయడానికి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. అదే సమయంలో బీజేపీ ఎమ్మెల్యేలు తమ పార్టీలో చేరడానికి ఉత్సాహం ప్రదర్శిస్తున్నారని ఆయన అన్నారు.

 

 

 

 

 

 

 

జేడీఎస్‌లో చీలిక లేనట్టే..!

జేడీఎస్‌లో చీలిక వస్తుందనే ఊహాగానాలకు నేడు జరిగిన ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశంలో తెరపడింది. జేడీఎస్ అధినేత దేవెగౌడ పెద్ద కుమారుడు రేవణ్ణ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో పార్టీని వీడుతారన్న వదంతులకు ఫులుస్టాప్ పడింది. రేవణ్ణ కుమారస్వామితో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు. తామంతా ఒక్కటేనని, తమలో చీలిక లేదని రేవణ్ణ స్పష్టం చేశారు. కాగా జేడీఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు క్యాంపు రాజకీయాలకు తెర తీశాయి. ఈ రెండు పార్టీల ఎమ్మెల్యేలను రిసార్ట్‌లకు తరలించారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను షాంగ్రీన్‌ హొటల్‌కు తరలించగా.. జేడీఎస్ ఎమ్మెల్యేలు నిన్న రాత్రి నుంచే ఈ హొటల్‌లో బస చేస్తుండటం గమనార్హం..!

Trending News