బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

త్రిపురలో బీజేపీ నేత దారుణ హత్య

Last Updated : Jun 24, 2018, 02:22 PM IST
బీజేపీ నేతను కాల్చి చంపిన దుండగులు

త్రిపురలో బీజేపీ నేత ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. రాజధాని అగర్తలాకు చెందిన స్థానిక బీజేపీ నేత బిస్వజిత్ పాల్ (35) శనివారం పనిపై బయటికి వెళ్లి అర్థరాత్రి వేళ స్కూటీపై ఇంటికి తిరిగి వస్తుండగా... ఇంటికి 200 మీటర్ల దూరంలోనే బదర్‌ఘాట్ వద్ద గుర్తు తెలియని దుండగులు ఆయనపై అకస్మాత్తుగా కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో బిస్వజిత్ ఛాతిపై తీవ్రమైన బుల్లెట్ గాయాలయ్యాయి. దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన బిస్వజిత్ అక్కడికక్కడే మృతిచెందారు. ఈ హత్యపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఘటనాస్థలంలో మృతుడి స్కూటీ, బ్యాగ్ స్వాధీనం చేసుకున్నట్టు ఇంచార్జ్ ఎస్పీ హెచ్.కే. డెబ్బర్మ తెలిపారు. ఇప్పటివరకు ఈ కేసులో ఎవ్వరినీ అరెస్ట్ చేయలేదని ఆయన స్పష్టంచేశారు.

అయితే, తనకి గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ప్రాణహానీ ఉందని ఇప్పటికే బిస్వజిత్ ఫిర్యాదు చేసినట్టు అతడి కుటుంబసభ్యులు తెలిపారు. భూతగాదాలే బిస్వజిత్ హత్యకు కారణం అయి వుంటాయని పోలీసులు అనుమానిస్తున్నారు. 

Trending News