తారక్, చెర్రీ మల్టీస్టారర్ చిత్ర ప్రారంభోత్సవానికి.. అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

వైవిధ్య చిత్రాల దర్శకుడు, జక్కన్న ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 

Last Updated : Nov 11, 2018, 12:41 PM IST
తారక్, చెర్రీ మల్టీస్టారర్ చిత్ర ప్రారంభోత్సవానికి.. అతిథిగా మెగాస్టార్ చిరంజీవి

వైవిధ్య చిత్రాల దర్శకుడు, జక్కన్న ఎస్‌.ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న నూతన చిత్ర ప్రారంభోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ చిత్రానికి "రామ రావణ రాజ్యమ్" లేదా "తారక్ రామ్" అనే టైటిల్స్ పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ పూర్తయినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తేజ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే.  డీవీవీ  ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయాలపై ఇంకా ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు దర్శక నిర్మాతలు.

ఈ చిత్రానికి సంబంధించి ఈ రోజు జరిగిన ప్రారంభోత్సవ వేడుకలకు మెగాస్టార్ చిరంజీవి అతిథిగా హాజరయ్యారు. ఆయనే ముహుర్తం షాట్‌కి క్లాప్ ఇచ్చారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు ఆశీస్సులను కథానాయకులిద్దరూ తీసుకోవడం గమనార్హం. ప్రస్తుతం డీవీవీ దానయ్య రామ్ చరణ్‌తో "వినయ విధేయ రామ" చిత్రాన్ని తెరకెక్కిస్తు్న్న సంగతి తెలిసిందే. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇటీవలే విడుదలైన "అరవింద సమేత"" చిత్ర సక్సెస్‌తో మంచి జోష్ మీద ఉన్నారు. 

తాజాగా ఎన్టీఆర్, రామ్ చరణ్ కాంబినేషనులో రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్ర ప్రారంభోత్సవ ముహుర్తాన్ని ఈ రోజు అనగా 11వ నెల (నవంబరు) 11వ తారీఖు 11 గంటలకు ఖరారు చేయడం విశేషం. ఏదో సెంటిమెంట్‌తోనే ఈ  ముహుర్తాన్ని నిర్మాతలు ఖరారు చేశారని తెలుస్తోంది. బాహుబలి తర్వాత రాజమౌళి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం కావడంతో.. ఈ చిత్రంపై కూడా అభిమానులకు అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ క్రమంలో ఈ సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక చర్చకు దారి తీస్తోంది.

Trending News