20ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పిన నటుడు

అర్జున్ రాంపాల్, మెహర్ జేసియా 20 ఏళ్ల క్రితం అంటే 1998లో వివాహం చేసుకున్నారు.

Last Updated : May 28, 2018, 10:57 PM IST
20ఏళ్ల బంధానికి గుడ్‌బై చెప్పిన నటుడు

బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్, మెహర్ జేసియా విడిపోయారు. తామిద్దరం విడిపోతున్నట్లు ఓ సంయుక్త ప్రటకన ద్వారా చెప్పారు. దీంతో 20 ఏళ్ల వైవాహిక బంధానికి తెర పడినట్లయింది.

అర్జున్ రాంపాల్, మెహర్ జేసియా 20 ఏళ్ల క్రితం అంటే 1998లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు సంతానం. మహికా(16), మైరా(13).

బొంబాయి టైమ్స్‌కి జారీ చేసిన ఉమ్మడి ప్రకటనలో, అర్జున్(45), మెహర్ (47) ఇద్దరం పరస్పరం విడిపోవాలనే నిర్ణయానికి వచ్చాం అని పేర్కొన్నారు. 20 ఏళ్ల తమ వైవాహిక బంధంలో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ఉన్నాయని, ఈ ప్రకటన చేయాల్సి వస్తుందని ఊహించకపోయినా పరిస్థితులు అలా దారి తీశాయని ఆ ప్రకటనలో చెప్పారు. విడిపోయినా తమ మధ్య ప్రేమ ఎప్పటికీ అలానే ఉంటుందని చెప్పారు.

ఈ జంట విడిపోతున్నదని గతేడాదే వార్తలు వచ్చాయి. కొన్ని నెలలుగా వాళ్లు వేరుగా ఉంటున్నారని అనేక కథనాలు, వార్తలు వచ్చాయి. ఇద్దరూ బాంద్రా కోర్టులో కనిపించేసరికి విడాకుల కోసమే అని పుకార్లు వినిపిస్తే.. ఆ సమయంలో వాటిని అర్జున్ రాంపాల్ కొట్టిపారేసినా.. ఇప్పుడు విడిపోతున్నట్లు స్వయంగా అతనే ప్రకటించాడు.

కెరీర్ పరంగా 2001లో 'ప్యార్ ఇష్క్ ఔర్ మోహోబత్' సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ  ఇచ్చిన అర్జున్ రాంపాల్ ప్రస్తుతం శైలేష్ వర్మ తెరకెక్కిస్తున్న 'నాస్తిక్'లో నటిస్తున్నాడు.

Trending News