రంగస్థలం మూవీ రివ్యూ

'రంగస్థలం'ను రక్తి కట్టించిన అంశాలు ఏంటి ?

Last Updated : Mar 31, 2018, 10:43 AM IST
రంగస్థలం మూవీ రివ్యూ

నటీనటులు : రామ్ చరణ్, సమంత, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, నరేష్, ఆది పినిశెట్టి, అనసూయ తదితరులు
సినిమాటోగ్రఫీ : ఆర్.రత్నవేలు
మ్యూజిక్ : దేవి శ్రీ ప్రసాద్
ఆర్ట్ డైరెక్టర్స్ : రామకృష్ణ సబ్బాని, మౌనిక నిగేత్రే సబ్బాని
రచన : శ్రీనివాస్, కాశి, బుచ్చి బాబు
నిర్మాణం : మైత్రీ మూవీ మేకర్స్
నిర్మాతలు : నవీన్ యెర్నేని, రవి శంకర్, మోహన్ చెరుకూరి
కథ-స్క్రీన్ ప్లే- దర్శకత్వం : సుకుమార్
 
రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన మోస్ట్ ఎవైటింగ్ మూవీ ‘రంగస్థలం’ ఈరోజే థియేటర్స్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. భారీ అంచనాల మధ్య  గ్రాండ్‌గా విడుదలైన ఈ సినిమాతో రామ్ చరణ్ ఎలా ఎంటర్‌టైన్ చేశాడో తెలుసుకోవాలంటే ఈ రివ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ : 
1980లో ‘రంగస్థలం’ అనే ఊరు.. ఆ ఊళ్ళో పొలాల్లో ఉండే ఇంజిన్స్ బాగుచేస్తూ జీవితాన్ని కొనసాగించే యువకుడు చిట్టి బాబు(రామ్ చరణ్) ఈ కథకు హీరో. చిట్టిబాబుకు వున్న వినికిడి లోపం వల్ల అతడిని అందరూ సౌండ్ ఇంజినీర్ అని పిలుస్తుంటారు. ఓ సందర్భంలో ఊళ్ళో ఉండే రామ లక్ష్మి (సమంత)ను చూసి మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు చిట్టిబాబు. ఇక భూపతి ఫణింద్ర(జగపతి బాబు) 30 ఏళ్లుగా ఆ ఊరికి ప్రెసిడెంట్ హోదాలో ఉంటూ సొసైటీ బ్యాంకు పేరుతో అక్రమంగా జనాల దగ్గర నుండి పొలాలు స్వాదీనం చేసుకుంటూ ఊరికి పెద్దమనిషిగా వ్యవహరిస్తుంటాడు. సెలవుల్లో దుబాయ్ నుండి సొంత ఊరు వచ్చిన చిట్టి బాబు అన్నయ్య కుమార్ బాబు (ఆది పినిశెట్టి) ప్రెసిడెంట్ చేసే అక్రమాలపై ఎదురెళ్తాడు. ఊరు బాగుపడాలంటే ఎన్నికల్లో జగపతి బాబుకి పోటీగా నిలబడాలని భావించి ప్రెసిడెంట్ ఎలెక్షన్స్‌లో నామినేషన్ వేస్తాడు. అలా ప్రెసిడెంట్ పదవికి పోటీ చేసే కుమార్ బాబుకి తన పార్టీ తరుపున సపోర్ట్ అందిస్తాడు ఎం.ఎల్.ఎ దక్షిణా మూర్తి (ప్రకాష్ రాజ్). అలా రంగస్థలంలో రాజకీయాలు మొదలవుతాయి. ఈ క్రమంలో అనుకోకుండా కుమార్ బాబు చనిపోతాడు. కుమార్ బాబు మృతి చెందిన తర్వాత జరిగిన ఓ యాక్సిడెంట్‌ కారణంగా దక్షిణ మూర్తి కోమాలోకి వెళ్తాడు. ఇంతకీ కుమార్ బాబుని చంపిందెవరు..? దక్షిణ మూర్తి కోమా నుండి వచ్చాక తెలిసిన నిజం ఏమిటి…? చివరికి తన అన్నయ్యని చంపిన వారిపై చిట్టి బాబు ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు.. అనేదే మిగతా కథ.

నటీనటుల పని తీరు :
చిట్టిబాబు పాత్ర పోషించిన రామ్ చరణ్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. చెర్రీ కెరీర్‌ను 'రంగస్థలం'కు ముందు, 'రంగస్థలం'కు తర్వాత అని చెప్పుకోవచ్చు. అలాంటి అల్టిమేట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు చెర్రీ. వినికిడి లోపం కలిగిన యువకుడిగా చరణ్ నటించిన తీరు చూస్తే ముచ్చటేస్తుంది. సినిమాకు ఎంత సెటప్ ఉన్నా, చెర్రీ యాక్టింగ్ బాగాలేకపోతే మూవీ మొత్తం తేలిపోయేది. చిట్టిబాబు పాత్ర కోసం ప్రాణం పెట్టాడు చరణ్. 1980లనాటి యాంబియన్స్‌ను క్యారీ చేయడంతోపాటు యాక్షన్, డిక్షన్, స్టెప్స్ ఇలా అన్నింటిలో హండ్రెడ్ పర్సెంట్ ఔట్‌పుట్ ఇచ్చాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే చరణ్ నటవిశ్వరూపం చూడొచ్చు. సినిమా నుండి బయటికొచ్చాక చిట్టి బాబు క్యారెక్టర్ అందరి మైండ్‌లో అలాగే ఉండిపోతుంది.

ఇక చరణ్ తర్వాత మళ్లీ చెప్పుకోవాల్సింది ఆది గురించే. కుమార్ బాబుగా ఆది చాలా బాగా నటించాడు. సినిమా అసలు కథ మొదలయ్యేది ఈ క్యారెక్టర్ ఎంట్రీతోనే. అంతటి కీలకమైన పాత్రను ఆది చక్కగా పెర్ఫార్మ్ చేశాడు. రామలక్ష్మిగా సమంత బాగా చేసింది. కాకపోతే ఈ క్యారెక్టర్ ఫస్టాఫ్ వరకే. సెకెండాఫ్‌లో పెద్దగా కనిపించదు. చరణ్, ఆది, సమంత పాత్రల తర్వాత కచ్చితంగా చెప్పుకోవాల్సిన పాత్ర రంగమ్మత్తది. అనసూయ సినీకెరీర్‌కు రంగమ్మత్త పాత్ర పునాదిగా నిలుస్తుంది. ప్రెసిడెంట్‌గా జగపతి బాబు, ఎం.ఎల్.ఎ దక్షిణ మూర్తిగా ప్రకాష్ రాజ్, కోటేశ్వరరావుగా నరేష్, రామ్ చరణ్‌కు వినబడేట్టు అన్నీ గట్టిగా చెప్పే పాత్రలో మహేష్ ఆచంట బాగా నటించారు.

టెక్నిషియన్స్ పని తీరు :
ఈ సినిమాకు పనిచేసిన టెక్నిషియన్స్‌లో ముందుగా మాట్లాడుకోవలిసింది ఆర్ట్ డైరెక్టర్స్ గురించ. తమ ఆర్ట్ వర్క్‌తో 1980ల నాటి పల్లెటూరి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఆర్ట్ డైరెక్టర్స్‌గా బెస్ట్ అనిపించుకున్నారు రామకృష్ణ సబ్బాని, మౌనిక నిగేత్రే. సినిమాకు మరో హైలైట్ రత్నవేలు సినిమాటోగ్రఫీ. తన కెమెరా వర్క్‌తో గోదారి అందాలను అద్భుతంగా చూపించి సినిమాకు హైలైట్‌గా నిలిచాడు రత్నవేలు. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు, పాటల పిక్చరైజేషన్‌లో తన కేపబిలిటీస్ ఏంటో చూపించాడు.

ఇక తన మ్యూజిక్‌తో రిలీజ్‌కి ముందే పాజిటీవ్ టాక్ తీసుకొచ్చిన దేవి అదిరిపోయే సాంగ్స్‌తోపాటు సినిమాకు తగినట్టుగా బ్యాగ్రౌండ్ స్కోర్ అందించి సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాడు. ప్రతీ సాంగ్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. చంద్ర బోస్ ఈ సినిమాకు సాహిత్యం అందించాడు అనేకంటే ప్రాణం పెట్టాడు అని చెప్పొచ్చు. తన అద్భుతమైన సాహిత్యంతో అలరించిన చంద్రబోస్ సినిమాలో ఓ ముఖ్యమైన సందర్భంలో వచ్చే ఎమోషనల్ సాంగ్ పాడి చక్కని ఫీల్ కలిగించాడు. బుచ్చి బాబు, కాశి, శ్రీనివాస్ అందించిన మాటలు సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. నటీ నటులు మాట్లాడే పల్లె యాస అందరినీ ఆకట్టుకుంటుంది.

తన సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్నసుకుమార్ మరోసారి దర్శకుడిగా తన కేపబిలిటీస్ ఏంటో అందరికీ చూపించాడు. సరైన కథ ఉంటే ఎంత డెప్త్‌లోకి అయినా వెళ్లగలడని నిరూపించుకున్నాడు. ముఖ్యంగా సుకుమార్ స్క్రీన్‌ప్లే ఈ సినిమాకు మేజర్ హైలైట్‌గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్ వాల్యూస్ రిచ్‌గా ఉన్నాయి.

'రంగస్థలం'ను రక్తి కట్టించిన అంశాలు :
రిలీజ్ కు ముందే చిట్టిబాబు అందరికీ కనెక్ట్ అయిపోయాడు. అతడు సౌండ్ ఇంజినీర్ అనే విషయం కూడా అందరికీ తెలుసు. ఇక సినిమా కాన్సెప్ట్ కూడా 80ల నాటిదని తెలుసు. ఇలా రిలీజ్ కు ముందే ఆడియన్స్ ను ఫుల్ గా ప్రిపేర్ చేసింది యూనిట్. సగం సక్సెస్ ఇక్కడే కొట్టారు. ప్రేక్షకులు ప్రిపేర్ అయి వెళ్లడంతో ఫస్ట్ ఫ్రేమ్ నుంచే లీనమయ్యారు. కథతో పాటు ట్రావెల్ చేశారు. సినిమా 3 గంటలు ఉందన్న ఫీలింగ్ కూడా కలగలేదంటే దానికి కారణం ఇదే.

కమర్షియల్ సినిమాల్లో ఎన్నో రకాలుంటాయి. రంగస్థలం కూడా ఫుల్ లెంగ్త్ కమర్షియల్ సినిమానే. ఇందులో ఐటెంసాంగ్ ఉంది, కామెడీ ఉంది, పక్కా యాక్షన్ ఉంది, మంచి పాటలున్నాయి. మిగతా సినిమాలతో దీన్ని సెపరేట్ చేసి చూపించిన అంశం చిట్టిబాబు క్యారెక్టర్, 80ల నాటి నేపథ్యం. ఈ రెండు విషయాల్లో రంగస్థలం పైసా వసూల్ అనిపించుకుంటుంది. ఆర్ట్ డైరక్టర్ రామకృష్ణ వేసి సెట్స్ అద్భుతం. ఇది సెట్ అనే ఫీలింగ్ రాకుండా చేశాడంటే అద్భుతమే కదా.

సుకుమార్ టైపు స్క్రీన్‌ప్లే ఇందులో కనిపించదు. చరణ్‌లాగే సుక్కూకు కూడా అతడి కెరీర్‌లో ఇదొకడిఫరెంట్ సినిమాగా నిలిచిపోతుంది. కథ మొత్తం స్ట్రయిట్ నెరేషన్‌తోనే సాగుతుంది. ఇవన్నీ ఒత్తయితే, ఒక్కో పాత్రకు సుకుమార్  పెర్‌ఫెక్ట్‌గా నటీనటుల్ని ఎంచుకున్నాడు. చివరికి అనసూయ చేసిన రంగమ్మత్త పాత్రకు కూడా అనసూయే కరెక్ట్ అనిపించేలా చేశాడు. ప్రతి క్యారెక్టర్‌లో మేజిక్ కనిపిస్తుంది. అదే రంగస్థలంలో గొప్పతనం.

ఇవన్నీ ఒకెత్తయితే దేవిశ్రీ ప్రసాద్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాను మరో మెట్టుపైకి తీసుకెళ్లాయి. రంగస్థలం సినిమాలో అటు మ్యూజిక్, ఇటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో డబుల్ శాటిస్‌ఫాక్షన్ అందించాడు. రామకృష్ణ వేసిన సెట్స్ సినిమాకు ప్రాణం పోశాయి. సెల్ ఫోన్లు, ఫేస్‌బుక్ లేని 1980ల నాటి ఫ్లేవర్‌ను మరోసారి రంగస్థలం సినిమాలో చక్కగా చూపించారు.

చిట్టిబాబు క్యారెక్టరైజేషన్, కుమార్ బాబు, రంగమ్మత్త క్యారెక్టర్స్, సాంగ్స్, ఇంటర్వెల్ బ్యాంగ్, క్లైమాక్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలో హైలెట్స్. సెకెండాఫ్‌లో కొన్ని ఎపిసోడ్స్ మరీ సాగదీసినట్టు అనిపించడం మైనస్ పాయింట్. నిజానికి సెకండాఫ్ కాస్త ట్రిమ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ట్రిమ్ చేయొచ్చు కూడా.

ఫైనల్‌గా చెప్పాలంటే చిట్టిబాబు విశ్వరూపం, దేవిశ్రీప్రసాద్ మేజిక్, 1980ల నాటి ఫీల్ కోసం రంగస్థలం సినిమాను తప్పకుండా చూడాల్సిందే.

రేటింగ్ : 3. 25 / 5

జీ సినిమాలు సౌజన్యంతో....

 

Trending News