Egg Murder: 'కోడిగుడ్డు'తో చనిపోయిన మహిళ.. ప్రేమ వ్యవహారమే కారణం

Man Killed Egg Issue Holi Festival For Love: హోలీ వేడుకల్లో జరిగిన కోడిగుడ్డు వివాదంలో మహిళ దారుణ హత్యకు గురయ్యారు. కూతురి ప్రేమ వ్యవహారంతోనే ఓ యువకుడు ఆమెను హత్యకు పాల్పడడం కలకలం రేపింది. ఈ సంఘటన తెలంగాణలో చోటుచేసుకుంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Mar 27, 2024, 03:14 PM IST
Egg Murder: 'కోడిగుడ్డు'తో చనిపోయిన మహిళ.. ప్రేమ వ్యవహారమే కారణం

Egg Issue Turns Quarrel: తన ప్రేమ వ్యవహారంలో తలదూర్చిన ప్రియురాలి తల్లిపై యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. హోలీ పండుగను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా ఇంట్లో కోడిగుడ్డు విసిరి కయ్యానికి కాలు దువ్వాడు. కోడిగుడ్డు విసరిన విషయంపై తీవ్ర వాగ్వాదం జరగ్గా ప్రణాళిక వేసుకున్న వచ్చిన ఆ యువకుడు కొడవలితో ప్రియురాలి తల్లిపై విచక్షణా రహితంగా దాడి చేసి ఆమె ప్రాణం తీశాడు. తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందడంతో తీవ్ర విషాదం అలుముకుంది. 

Also Read: Egg Clash: హోలీ పండుగలో కోడిగుడ్డు గొడవ.. మహిళపై వేట కొడవలితో దాడి

జగిత్యాల జిల్లా తిప్పన్నపేట గ్రామానికి చెందిన మేడిపల్లి సురేశ్‌-రమ దంపతులకు కుమారుడు రిషివర్ధన్‌, కుమార్తె వాణి ఉన్నారు. తండ్రి సురేశ్‌ ఉపాధి కోసం దుబాయ్‌ వెళ్లగా ఇద్దరు పిల్లలతో రమ గ్రామంలోనే నివసిస్తోంది. అయితే గ్రామానికి చెందిన బోగ ప్రకాశ్‌ ఆమె కుమార్తె వాణిని ప్రేమిస్తున్నానని చెప్పి పెళ్లి చేసుకుంటానని రమకు చెప్పాడు. పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకుందామని చూడగా ప్రకాశ్‌ పెళ్లి ప్రతిపాదనను రమ దంపతులు నిరాకరించారు. పెళ్లికి అంగీకరించకపోవడంతో ప్రకాశ్‌ ఆ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. వారిపై కక్ష తీర్చుకునేందుకు అదును కోసం ఎదురుచూస్తున్నాడు.

Also Read: Cricket Betting: ఐపీఎల్‌ బెట్టింగ్‌కు భార్య బలి.. రూ.కోటిన్నర అప్పులతో సంసారం సర్వనాశనం

ఈ సమయంలో సోమవారం (మార్చి 25వ తేదీన) హోలీ పండుగను అడ్డం పెట్టుకుని ఆ కుటుంబంపై దాడి చేయాలని ప్రణాళిక వేసుకున్నాడు. పండుగ రోజు గ్రామంలో రంగులు చల్లుకుంటూ బోగ ప్రకాశ్‌ ఉద్దేశపూర్వకంగా రమ ఇంట్లో కోడిగుడ్డు విసిరాడు. కోడిగుడ్డు విసరడంపై ఆమె కుమారుడు రిషివర్ధన్‌ వచ్చి బోగ ప్రకాశ్‌తో గొడవకు దిగాడు. ఘర్షణలో రిషి గాయపడడంతో ఈ సమాచారం తెలుసుకున్న రమ అక్కడకు వచ్చింది. ఇదే అదునుగా భావించిన ప్రకాశ్‌ కొడవలి తీసుకుని రమపై పలుమార్లు దాడి చేశాడు. విచక్షణారహితంగా దాడి చేయడంతో రమ తీవ్రంగా గాయపడింది. 

గాయపడిన రిషి, రమను కుటుంబసభ్యులు, గ్రామస్తులు కరీంనగర్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందింది. నిందితుడు బోగ ప్రకాశ్‌పై కరీంనగర్‌ రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. ఈ విషయం తెలుసుకున్న భర్త సురేశ్‌ వెంటనే దుబాయ్‌ నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. పోస్టుమార్టం అనంతరం రమ అంత్యక్రియలు గ్రామంలో జరిగింది.

ప్రేమ వ్యవహారం ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. ఎప్పటినుంచో రమ కూతురు వాణిపై మనసు పడ్డ బోగ ప్రకాశ్‌ పెద్దల అంగీకారంతో పెళ్లి చేసుకోవాలని చూశాడు. పెళ్లికి నిరాకరించడంతో తట్టుకోలేక ఇంతటి దారుణానికి పాల్పడడం గ్రామంలో కలకలం రేపింది. పెళ్లికి అంగీకరించకపోతే ఇంతటి దారుణానికి పాల్పడతారా అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. రమ మృతికి కారణమైన ప్రకాశ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కుటుంబసభ్యులు, గ్రామస్తులు డిమాండ్‌ చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News