ప్రాణాలు తీస్తున్న చలి తీవ్రతకు 18 మంది బలి !

చంపేస్తున్న చలి తీవ్రత..

Last Updated : Dec 19, 2018, 01:03 PM IST
ప్రాణాలు తీస్తున్న చలి తీవ్రతకు 18 మంది బలి !

పెథాయ్ తుఫాన్ రెండు తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. తుఫాన్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. ముఖ్యంగా కోస్తాంధ్రా, తెలంగాణల్లో వీస్తున్న చలిగాలుల కారణంగా గత నాలుగు రోజులుగా చలి తీవ్రత అమాంతం పెరిగిపోయింది. ఉన్నట్టుండి పెరిగిన చలి తీవ్రతను తట్టుకోలేని వృద్ధులు చిగురుటాకుల్లా వణికిపోతున్నారు. చలి పులి పంజా విసిరి ఆంధ్రప్రదేశ్‌లో ఐదుగురు, తెలంగాణలో 13 మంది.. మొత్తం కలిపి ఇప్పటివరకు తెలుగు రాష్ట్రాల్లో 18 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఓవైపు ఉత్తరాది నుంచి శీతల గాలులు, మరోవైపు పెథాయ్ తుఫాన్ ప్రభావంతో బంగాళాఖాతం వైపు నుంచి బలంగా వీస్తున్న తేమ గాలులు ఉష్ణోగ్రతలు పడిపోయేందుకు ఓ కారణం అయ్యాయని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. 

Trending News