మహాకూటమి ఛైర్మన్‌గా కోదండరామ్.. ఉమ్మడి ప్రచారంలోనూ కీలక పాత్ర

మహాకూటమి (ప్రజాకూటమి) ఛైర్మన్‌గా తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ వ్యవహరించనున్నారు. 

Last Updated : Nov 18, 2018, 10:40 AM IST
మహాకూటమి ఛైర్మన్‌గా కోదండరామ్.. ఉమ్మడి ప్రచారంలోనూ కీలక పాత్ర

మహాకూటమి (ప్రజాకూటమి) ఛైర్మన్‌గా తెలంగాణ జన సమితి అధినేత కోదండరామ్ వ్యవహరించనున్నారు. ఇటీవలే జనగాం నియోజకవర్గం నుండి పోటీ చేయాలని భావించిన కోదండరామ్.. సీటు త్యజించాలని రాహుల్ కోరిన మీదట అందుకు అంగీకరించినట్లు సమాచారం. శుక్రవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో తెలంగాణ జన సమితి కార్యాలయానికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోదండరామ్‌తో ఏకాంతంగా మాట్లాడారు. తర్వాత కుంతియా, పొన్నాల లక్ష్మయ్య కూడా వచ్చి కోదండరామ్‌తో మాట్లాడారు. ఆ తర్వాత కోదండరామ్ తన సీటును త్యాగం చేస్తున్నట్లు ప్రకటించారు.

పొన్నాల లక్ష్మయ్య జనగాం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడతారని తెలిపారు. ఆ తర్వాత కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల కమిటీ ఇన్‌ఛార్జి కుంతియా మాట్లాడుతూ.. కేసీఆర్ నిరంకుశ పాలనను అంతమొందించడం కోసమే ఈ కూటమి మొదలైందని.. ఇది ప్రజల అభీష్టం ప్రకారం ప్రారంభమైన కూటమి కాబట్టి.. దీనికి ప్రజా కూటమి అని నామకరణం చేశామని తెలిపారు. ఈ కూటమికి కోదండరామ్‌ని అధ్యక్షుడిని చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఈ కూటమి ద్వారా తెలుగుదేశం 14 స్థానాల్లో పోటీ చేస్తుండగా.. సీపీఐ 3 స్థానాల్లోనూ.. తెలంగాణ జన సమితి 8 స్థానాల్లోనూ పోటీ చేస్తుందని.. అలాగే కాంగ్రెస్ మిగతా స్థానాల్లోనూ పోటీ చేస్తుందని కుంతియా వెల్లడించారు. ప్రస్తుతానికి తెలంగాణ జన సమితి తరఫున మెదక్ నుండి కొలుకూరి జనార్ధనరెడ్డి, దుబ్బాక నుండి చిందం రాజ్‌కుమార్‌, సిద్ధిపేట నుండి మరికంటి భవానీరెడ్డి, మల్కాజిగిరి నుండి కపిలవాయి దిలీప్‌కుమార్‌ పోటీ చేయనున్నట్లు టీజేఎస్ నేతలు  ప్రకటించారు. మిగతా స్థానాల నుండి ఎవరెవరు పోటీ చేస్తారన్న విషయంపై ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది.

Trending News