Revanth Reddy: సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేసేది అక్కడి నుంచే?

Revanth Reddy: ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో  తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వరుస కార్యక్రమాలతో  క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు

Written by - Srisailam | Last Updated : Sep 27, 2022, 10:27 AM IST
Revanth Reddy: సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి పోటీ చేసేది అక్కడి నుంచే?

Revanth Reddy: ఫైర్ బ్రాండ్ లీడర్ గా పేరున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో  తనదైన శైలిలో దూసుకుపోతున్నారు. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. వరుస కార్యక్రమాలతో  క్షేత్ర స్థాయిలో పార్టీ కేడర్ లో జోష్ నింపుతున్నారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కాంగ్రెస్ పార్టీకో బూస్ట్ వచ్చింది. ఇక  రాబోయే ఎన్నిల్లో కాంగ్రెస్ తరపున సీఎం అభ్యర్థి  కూడా రేవంత్‌ రెడ్డే ఉంటారని పీసీసీ నేతలే చెబుతున్నారు. దీంతో  ముఖ్యమంత్రి రేసులో ఉన్న రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్నది ఆసక్తి గా మారింది.

గతంలో రెండు సార్లు కొడంగల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు రేవంత్ రెడ్డి. 2009, 2014లో టీడీపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి విజయం సాధించారు. కొడంగల్ ఎమ్మెల్యేగానే ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లారు. కొడంగల్ అంటే రేవంత్ రెడ్డి అన్నట్లుగా మారిపోయింది. అయితే  2018 ఎన్నికల్లో మాత్రం కొడంగల్ లో పట్నం నరేందర్ రెడ్డితో ఆయన అనూహ్యాంగా ఓడిపోయారు రేవంత్ రెడ్డి. తర్వాత 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి పోటీ చేసి విజయం సాధించారు.  పీసీసీ చీఫ్ ఎన్నిక కావడంతో ఆయన కొడంగల్ వెళ్లడం తగ్గిపోయింది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీకి సంబంధించి కొన్ని రోజులుగా రకరకాల ప్రచారాలు సాగుతున్నాయి. కొడంగల్ కాకుండా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే రేవంత్ రెడ్డి పోటీ చేస్తారనే ప్రచారం సాగింది.

కూకట్ పల్లి, ఎల్బీ నగర్ నియోజకవర్గాల నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేస్తారంటూ వార్తలు వచ్చాయి. ఈ రెండు నియోజకవర్గాల్లోనూ సెటిలర్లు ఎక్కువ. సెటిలర్లు మొదటి నుంచి రేవంత్ రెడ్డికి మద్దతుగా ఉన్నారు. ఎంపీగా రేవంత్ రెడ్డి గెలిచినప్పుడు ఈ రెండు నియోజకవర్గాల్లో ఆయనకు మంచి మెజార్టీ వచ్చింది. ఎల్బీనగర్ లో సెటిలర్లతో పాటు మహబూబ్ నగర్ ఓటర్లు భారీగానే ఉన్నారు. కూకట్ పల్లిలో టీడీపీ సానుభూతిపరులే గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నారు. అందుకే ఈ రెండు నియోజకవర్గాల్లోనే ఏదో ఒక చోట నుంచి రేవంత్ పోటీ చేస్తారనే ప్రచారం జోరుగా సాగింది. తాజాగా తన పోటీ విషయంలో క్లారిటీ ఇచ్చారు రేవంత్ రెడ్డి. కొన్ని రోజులుగా కొడంగల్ పై ఫోకస్ చేశారు. టీఆర్ఎస్, బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరికలు జరిగాయి. రేవంత్‌ సమక్షంలో మద్దూరు మండలానికి చెందిన పలువురు టీఆర్ఎస్, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దీంతో కొడంగల్ నుంచే పోటీ చేయాలనే నిర్ణయానికి  రేవంత్ రెడ్డి వచ్చినట్లు తెలుస్తోంది.

కొడంగల్ నేతల సమావేశంలో రేవంత్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొడంగల్‌లో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందన్నారు. కొడంగల్ ప్రజలు అభివృద్ధి చేసే పార్టీలనే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్, ప్రధాని మోదీ కలిసి కొడంగల్‌కు రావాల్సిన అభివృద్ధి పనులను ఆపారని మండిపడ్డారు. కృష్ణా- వికారాబాద్ రైలు ఎందుకు నిలిపివేశారో చెప్పాలన్నారు. గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 5 వేల ట్రాన్స్ ఫార్మర్లు తెచ్చి ..ప్రతి గ్రామంలో ఏర్పాటు చేశామన్నారు. మళ్లీ అలాంటి అభివృద్ధి జరగాలంటే తనను గెలిపించాలని కోరారు.కాంగ్రెస్ అధికారంలోకి రాగానే కొడంగల్‌ను రెవెన్యూ డివిజన్ చేస్తామని హామీ ఇచ్చారు రేవంత్ రెడ్డి.

Read Also: Seshanna : ఆరున్నర ఏళ్ల తర్వాత దొరికిన నరహంతకుడు.. నయీం ప్రధాన అనుచరుడు శేషన్నఅరెస్ట్

Read Also: SCR: దసరా సందర్భంగా సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైళ్ల వివరాలు ఇవే..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News