Minister KTR: స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో డ్రైవర్లకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్

Telangana Assembly Election 2023: డెలవరీ బాయ్స్‌తో మంత్రి కేటీఆర్ సోమవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా వారి సమస్యలను తెలసుకున్నారు. వారి సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 27, 2023, 09:20 PM IST
Minister KTR: స్విగ్గీ, జొమాటో, ర్యాపిడో డ్రైవర్లకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్

Telangana Assembly Election 2023: స్విగ్గీ, జొమాటో, ఒలా , ఉబర్, ర్యాపిడో, ఇతర పార్ట్ టైం ఉద్యోగాలు చేసే యువకులకు మంత్రి కేటీఆర్ గుడ్‌న్యూస్ చెప్పారు. సంక్షేమం కోసం ఒక ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. వారు సేవలు అందిస్తున్న కంపెనీలతో మాట్లాడి ఈ ఉద్యోగులకు ఆరోగ్య బీమా, ప్రావిడెంట్ ఫండ్, ఈఎస్ఐ వంటి సౌకర్యాలను అందించడంతోపాటు జాబ్ సెక్యూరిటీని కల్పించేలా చూస్తామని చెప్పారు. రాష్ట్రంలో సుమారు మూడు లక్షలకు పైగా యువకులు ఈ పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తున్నారన్నారు. 

ప్రజలకు అనేక రకాల సేవలు అందిస్తున్న వీరి సంక్షేమాన్ని చూసుకోవడం ప్రభుత్వాల బాధ్యత అని,  ఈ దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత అధికారంలోకి రాగానే ఈ గిగ్ వర్కర్ల సంక్షేమం కోసం ప్రభుత్వ అధికారులు కంపెనీ ప్రతినిధులు గిగ్ వర్కర్ల ప్రతినిధుల తో కలిపి ఒక సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ బోర్డులో ఒక లీగల్ సెల్ వ్యవస్థతోపాటు, ఈ యువకులకు కంపెనీల తరఫున ఎదురయ్యే న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం చేస్తున్న డెలివరీకి కొంత సొమ్ము అందుకుంటున్న పద్ధతితోపాటు వీరికి కనీస జీతాలను అందించేలా చర్యలు తీసుకుంటామన్నారు. 
 
రాష్ట్రంలో భారీగా పెరిగిన ఐటీ ఉద్యోగాలు మరియు ఇతర రంగాల్లో జరిగిన కంపెనీల విస్తరణ తర్వాత గిగ్ వర్కర్లకుభారీ డిమాండ్ ఏర్పడిందని దీంతో ఎవరిపైన ఆధారకుండా వీరు సంపాదించుకోగలుగుతున్నారని వీరి సంక్షేమం కోసం కట్టుబడి ఉన్నామన్నారు. 

కేటీఆర్ తో జరిగిన చర్చల సందర్భంగా తమకు ఎదురవుతున్న పలు ఇబ్బందులను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. పలు కంపెనీలు తమ కు అందించే ఫీజులను ఏమాత్రం పెంచడం లేదని పైగా ఇన్సెంటివ్ లను తీసివేశారని తెలిపారు. ఈ కంపెనీ ప్రతినిధులతో  తాను స్వయంగా మాట్లాడి ఈ అంశంలో వీరికి సానుకూలంగా నిర్ణయం తీసుకునేలా చర్యలు తీసుకుంటానని కేటీఆర్ హామీ ఇచ్చారు. 

ప్రభుత్వమే స్వయంగా ఫుడ్ డెలివరీ, క్యాబ్ బుకింగ్ మరియు ఇతర ఆన్లైన్ సేవలకు సంబంధించిన ఒక ప్రత్యేక ఆప్ ని ఏర్పాటు చేస్తే తమకు ఉపయుక్తంగా ఉంటుందని పలువురు తెలిపిన ప్రతిపాదనపై కేటీఆర్ సానుకూలంగా స్పందించారు. ఇప్పటికే ఇలాంటి ఒక వ్యవస్థ కేరళలో ప్రారంభమైందని దానిపైన ఆధ్యాయయనం చేసి మరింత మెరుగులు దిద్ది తెలంగాణలోని అమలు చేస్తామన్నారు.

గిగ్ వర్కర్ల సమస్యల పైన ప్రత్యేకంగా స్పందించి సావధానంగా విని తమ అంశాలను అర్థం చేసుకొని సానుకూలంగా స్పందించిన కేటీఆర్ కి గిగ్ వర్కర్ల ప్రతినిధులు ధన్యవాదాలు తెలిపారు. తమ సంక్షేమం పట్ల సానుకూలంగా స్పందించి తమకు అండగా ఉంటామని భరోసా ఇచ్చిన భారత రాష్ట్ర సమితికి ఈ ఎన్నికలు అండగా నిలబడతామని తెలియజేశారు.

Trending News