ప్రేమ వివాహంలో కలహాలు.. భార్య కాపురానికి రావడం లేదని..!

ప్రేమ వివాహంలో కలహాలు.. భర్త ఆత్మహత్య, కోడలిపై అత్త పోలీసులకు ఫిర్యాదు

Last Updated : Oct 5, 2018, 03:39 PM IST
ప్రేమ వివాహంలో కలహాలు.. భార్య కాపురానికి రావడం లేదని..!

తాను ఎంతో ఇష్టపడి, ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్య కాపురానికి రావడం లేదనే కారణంతో మనస్తాపానికి గురైన ఓ యువకుడు బుధవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని తనువు చాలించిన ఘటన హైదరాబాద్‌లోని నేరేడ్‌మెట్‌లో చోటుచేసుకుంది. నేరేడ్‌మెట్ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నేరెడ్‌మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని పీబీ కాలనీకి చెందిన నవీన్ (24) అదే కాలనీకి చెందిన ఓ యువతిని గతేడాది మార్చి నెలలో ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లయిన ఏడు నెలలకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో పుట్టింటికి వెళ్లిపోయిన ఆ యువతి అప్పటి నుంచి అక్కడే ఉంటోంది. భార్య తనకు దూరంగా ఉండటాన్ని తట్టుకోలేకపోయిన నవీన్.. అనేకసార్లు ఆమెకు నచ్చచెప్పే ప్రయత్నం చేశాడు. బుధవారం కూడా అలాగే తన భార్యకు నచ్చచెప్పి ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. 

అయితే, నవీన్ భార్య ఎంతకీ అతడి మాట వినకపోవడంతో రాత్రి ఇంట్లో తల్లికి జరిగిన విషయం చెప్పి తన గదిలోకి తాను వెళ్లి పడుకున్న నవీన్ ఉదయం ఎంతసేపటికీ నిద్ర లేవలేదు.. గదిలోంచి బయటికి రాలేదు. కొడుకు గదిలోంచి బయటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన అతడి తల్లి.. ఇరుగుపొరుగు సాయంతో తలుపులు బద్ధలు కొట్టి చూడగా అప్పటికే అతడు ఉరి వేసుకుని చనిపోయాడు. భార్య వేరుగా ఉండటాన్ని తట్టుకోలేకే తన కొడుకు ఆత్మహత్య చేసుకున్నాడని, అందుకు తన కోడలే బాధ్యురాలని పేర్కొంటూ నవీన్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. నవీన్ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. 
 

Trending News