అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి

బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు ఇస్తామని కేంద్రమంత్రి, బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి తెలిపారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Oct 11, 2023, 04:39 PM IST
అధికారంలోకి వస్తే గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు: బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు కిషన్  రెడ్డి

బీజేపీ వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి రాగానే.. రాష్ట్రంలో వారి జనాభా ప్రాతిపదికన 10 శాతం రిజర్వేషన్లు తీసుకొస్తామని కేంద్రమంత్రి, బీజేపీ  రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్  రెడ్డి స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు, విద్య, ఉపాధి అవకాశాల్లోనూ గిరిజన యువతీ, యువకులకు ఈ రిజర్వేషన్లను అమలు చేస్తామని ఆయన వెల్లడించారు. 

బుధవారం ములుగు జిల్లా మేడారంలో కొలువైన వనదేవతలు సమ్మక్క, సారలమ్మల దర్శనం చేసుకున్న కేంద్రమంత్రి.. అనంతరం మీడియాతో మాట్లాడారు. తెలంగానకు గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని, దీని నిర్మాణానికి తొలి విడతగా దాదాపు  రూ.900 కోట్లను కేటాయించడంతోపాటుగా.. ఈ విశ్వవిద్యాలయానికి సమ్మక్క, సారక్క పేరును పెట్టిన ప్రధానమంత్రికి.. గిరిజన సమాజం  తరపున, తెలంగాణ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.

దేశవ్యాప్తంగా.. గిరిజనుల సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించేందుకు, గిరిజన వీరుల త్యాగాలను యావద్భారతం స్మరించుకునేందుకు మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం  చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఆయన అన్నారు. ఈ సందర్బంగా గిరిజనుల సంక్షేమం కోసం కేంద్రం చేపట్టిన  కార్యక్రమాలను ఆయన వివరించారు. హైదరాబాద్ లో రూ. 25 కోట్ల కేంద్ర ప్రభుత్వ నిధులతో గిరిజన  స్మారక మ్యూజియం నిర్మాణం చేపట్టబోతున్న విషయాన్ని, 6.5 కోట్ల కేంద్ర నిధులతో గిరిజన  పరిశోధన సంస్థ ప్రారంభానికి సిద్దంగా ఉన్న విషయాన్నీ ఆయన వెల్లడించారు. ములుగు జిల్లాలోని రుద్రేశ్వర ఆలయం (రామప్ప గుడి)కి యునెస్కో గుర్తింపు తీసుకొచ్చే విషయంలోనూ ప్రధానమంత్రి ప్రత్యేక చొరవతీసుకున్న విషయాన్ని ఈ సందర్బంగా కిషన్  రెడ్డి గుర్తుచేశారు. 

కిషన్ రెడ్డి గారి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
తెలంగాణ వనదేవతలు, గిరిజనుల ఆరాధ్యదైవం.. సమ్మక్క, సారలమ్మల పాదపద్మాలకు నమస్కరిస్తున్నాను. పచ్చని ప్రకృతి నడుమ కొలువై.. ఆదిపరాశక్తి అవతారమైన సమ్మక్క, సారలమ్మ ఆశీర్వాదాలు యావత్ తెలంగాణ ప్రజలపై ఉండాలని కోరుకుంటున్నాను. దేశంలో ఆదివాసీల సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో.. గిరిజన వీరులకు సరైన గౌరవం మర్యాదలు కల్పించే విషయంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. తెలంగాణ గిరిజన సమాజాభివృద్ధి కోసం.. ఇటీవలే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు.. ములుగులో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయ స్థాపనకు పచ్చజెండా ఊపడంతోపాటుగా.. రూ.889 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదముద్ర వేశారు. 

ఈ సెంట్రల్ యూనివర్సిటీకి మన ఆరాధ్యదేవతలైన ‘సమ్మక్క-సారక్క గిరిజన విశ్వవిద్యాలయం’గా పేరు పెట్టడం.. గిరిజన సంస్కృతికి, తెలంగాణ సంప్రదాయాలకు మోదీ గారు ఇస్తున్న గౌరవానికి నిదర్శనం. ఈ యూనివర్సిటీ ద్వారా..తెలంగాణ గిరిజన సమాజం రూపురేఖలే మారిపోతాయి. ఇందులో సందేహం లేదు.  మన ములుగు జిల్లాలో గిరిజన కేంద్రీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయడం.. దీనికి మన వన దేవతల పేర్లు పెట్టడం.. రూ.889 కోట్లు కేటాయించిన సందర్భంగా గౌరవ ప్రధానమంత్రి నరేంద్రమోదీ గారికి మీ అందరి తరపున, తెలంగాణ ప్రజలందరి తరపున ధన్యవాదములు తెలియజేస్తున్నాను.

Also Read: IND Vs AFG Dream11 Prediction Today Match: ఆఫ్ఘన్‌తో భారత్ పోరు.. పిచ్ రిపోర్ట్, డ్రీమ్11 టీమ్ టిప్స్ మీ కోసం..  

దీంతోపాటుగా గిరిజనుల కోసం ఏకలవ్య మోడల్ స్కూళ్లు, గిరిజన ప్రభావిత ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు, గిరిజన పోరాట యోధులను గౌరవించుకునేలా.. వారి స్మారకంగా.. దేశవ్యాప్తంగా మ్యూజియాల నిర్మాణానికి నిధుల కేటాయింపు చేస్తోంది. దీంట్లో భాగంగానే.. తెలంగాణ గిరిజనుల ఆత్మగౌరవాన్ని కాపాడే విధంగా.. స్వాతంత్ర్య పోరాటం, రజాకార్ల ఆకృత్యాలపై పోరాడిన గిరిజన వీరులకు సరైన గుర్తింపును ఇస్తూ.. రూ. 34 కోట్లతో హైదరాబాద్ లోని ఆబిడ్స్ లో గిరిజన స్మారక మ్యూజియం నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఇది కాకుండా.. రాష్ట్రంలో గిరిజన ప్రాంతాల్లో విద్యారంగాన్ని ప్రోత్సహించడం ద్వారా ఈ వర్గాల్లో అక్షరాస్యతను పెంపొందించే లక్ష్యంతో రూ.420 కోట్లతో.. 17 కొత్త ‘ఏకలవ్య పాఠశాలలను’ కేంద్రం ఏర్పాటుచేసింది. ఇవి కాకుండా గిరిజనులు ఎక్కువగా ప్రాంతాలను యాస్పిరేషనల్ డిస్ట్రిక్ట్స్ (అత్యంత వెనుకబడిన జిల్లాలు)గా గుర్తించి.. అక్కడ అభివృద్ధి కార్యక్రమాలకోసం ప్రత్యేకమైన నిధులు కేటాయించింది. మన తెలంగాణలో భూపాలపల్లి, ఆసిఫాబాద్, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలకోసం 37 కోట్లు విడుదల చేసింది. ఇలా గిరిజనుల అభివృద్ధికి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాం.

స్వదేశ్ దర్శన్ పథకం కింద ‘ములుగు - లక్నవరం - మేడవరం - తాడ్వాయి - దామరవాయి - మల్లూరు - బొగత జలపాతం’లను కలుపుతూ గిరిజన సర్క్యూట్ పేరుతో ఆయా ప్రాంతాలలో మౌలిక సదుపాయాలను కల్పించాం. ఇందుకోసం రూ.80 కోట్లను కేంద్ర ప్రభుత్వ ఖర్చు చేసింది. సోమశిల, సింగోటం, కదళీవనం, అక్కమహాదేవి, ఈగలపెంట, ఫరాహాబాద్, ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం మధ్య ఎకో-సర్క్యూట్ అభివృద్ధి కోసం రూ. 92 కోట్లను ఖర్చు చేసి పర్యాటకులకు అవసరమైన సౌకర్యాలను కల్పించడం జరిగింది. ఇలా గిరిజనుల సంక్షేమం విషయంలోనూ.. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, మాజీ ఎంపీలు గరికపాటి మోహన్ రావు, రవీంద్ర  నాయక్, రమేశ్ రాథోడ్ తోపాటు.. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ ముఖ్యనాయకులు, పెద్ద సంఖ్యలో గిరిజన సోదర, సోదరీమణులు పాల్గొన్నారు.

Also Read: PM Kisan Status: రైతులకు శుభవార్త.. రూ.8 వేలకు పెంచనున్న కేంద్రం.. ఇలా అప్లై చేసుకోండి..!  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News