Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి

Road Accident In Mysore: కర్ణాటకలో సోమవారం రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ఈ రెండు ఘటనల్లో మొత్తం 16 మంది మరణించారు. మృతులందరూ ఘటన స్థలాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. ఈ దుర్ఘటనపై ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. 

Written by - Ashok Krindinti | Last Updated : May 29, 2023, 07:42 PM IST
Karnataka Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో 10 మంది మృతి

Road Accident In Mysore: కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 10 మంది మరణించారు. మైసూరు జిల్లాలోని టి.నరసిపూర్‌ ప్రాంతంలో ఓ కారును ప్రైవేటు బస్సు ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. మరికొందరు క్షతగాత్రులయ్యారు. గాయపడినవారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. 

బళ్లారికి చెందిన ఓ కుటుంబం ఇన్నోవా కారులో మైసూరు సందర్శనకు బయలుదేరి వెళ్లింది. టి.నరసిపూర్‌ సమీపంలో ఇన్నోవా కారును.. ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారిలో 10 మంది స్పాట్‌లోనే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో కారు మొత్తం నుజ్జునుజ్జు అయింది.

పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. స్థానికుల సాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అతికష్టం మీద కారులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసట్లున్నట్లు పోలీసులు వెల్లడించారు.  

ఈ ఘటనపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పందించారు. 'మైసూరు జిల్లా టి.నరసిపుర్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది అమాయకులు మరణించడం బాధాకంరం. మృతుల కుటుంబాలకు సీఎం సహాయ నిధి నుంచి రూ.2 లక్షల చొప్పున పరిహారం అందజేస్తాం. క్షతగాత్రులకు సరైన చికిత్స అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించాం..' అని సీఎం ట్వీట్ చేశారు.

 

మరో ఘటనలో ఆరుగురు..

కొప్పల్ జిల్లా కుష్టగి తాలూకా కలకేరి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు మృతిచెందారు. ఇండికా కారు టైరు పేలి లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను రాజప్ప బనగోడి, రాఘవేంద్ర, అక్షయ శివశరణ్, జయశ్రీ, రాఖీ, రష్మికగా గుర్తించారు. వీరు విజయపూర్ నుంచి బెంగళూరుకు వెళుతున్నట్లు సమాచారం. ఇండికా కారు టైరు పేలడంతో మరో రోడ్డుపైకి వచ్చి లారీని ఢీకొట్టిందని పోలీసులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం రెండు లక్షల చొప్పున పరిహారం అందజేస్తుందని సీఎం సిద్దరామయ్య ప్రకటించారు. మితిమీరిన వేగం, అజాగ్రత్త ఇలాంటి ప్రమాదాలకు కారణమని.. జాగ్రత్తగా వాహనాలు నడపండి.. సురక్షితంగా ఉండండి.. అని సూచించారు. 

Also Read: Delhi Girl Murder Case: ఢిల్లీలో మరో సంచలన హత్య కేసు.. బాలికపై 16 సార్లు కత్తితో దాడి  

Also Read: Assam Road Accident: ఘోర విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఏడుగురు విద్యార్థులు మృతి  a

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News