KCR BRS PARTY: వారంలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ ను ఢీకొట్టేనా? మద్దతు ఇచ్చేదెవరు..?

KCR BRS PARTY: కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దేశంలో మరో కొత్త పార్టీకి స్కోప్ ఉందా..తెలంగాణ నేతగా ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో కేసీఆర్ రాణించగలరా అన్న చర్చ సాగుతోంది.జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలన్న కేసీఆర్ నిర్ణయం వెనుక ఆయనకున్న ధైర్యం ఏంటన్న చర్చ వస్తోంది.

Written by - Srisailam | Last Updated : Jun 11, 2022, 08:45 AM IST
  • జాతీయ స్థాయిలో కేసీఆర్ కొత్త పార్టీ
  • భారత్‌ రాష్ట్రీయ సమితి పేరుతో పార్టీ
  • జూన్ నెలాఖరులో కేసీఆర్ ప్రకటన
KCR BRS PARTY: వారంలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ ను ఢీకొట్టేనా? మద్దతు ఇచ్చేదెవరు..?

KCR BRS PARTY: కొంత కాలంగా జరుగుతున్న ప్రచారం నిజం కాబోతోంది. జాతీయ రాజకీయాల్లోకి పూర్తిస్థాయిలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. కొంత కాలంగా జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేశారు గులాబీ బాస్. దేశ వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చలు జరిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పాటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీని ఆయన టార్గెట్ చేశారు. ఈ రెండు పార్టీలతో దేశానికి నష్టమని చెబుతూ వస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీజేపీయేతర కూటమి దిశగా కేసీఆర్ అడుగులు వేస్తున్నారనే ప్రచారం జరిగింది. గతంలో కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ప్రతిపాదన తేవడంతో.. ఆ ఫ్రంట్ ఏర్పాటు కోసమే దేశమంతా తిరుగుతున్నారని అంతా భావించారు. అదే సమయంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టే యోచనలో కేసీఆర్ ఉన్నారనే వార్త కొన్ని వర్గాల నుంచి వచ్చింది. తాజాగా కేసీఆర్ జాతీయ కార్యాచరణపై క్లారిటీ వచ్చేసింది.

రాష్ట్రపతి ఎన్నికల షెడ్యూల్ రావడంతోనే పార్టీ ముఖ్య నేతలతో అత్యవసర సమావేశం నిర్వహించారు కేసీఆర్. ఈ సమావేశంలోనే జాతీయ పార్టీ ఏర్పాటుపై సంచలన నిర్ణయం తీసుకున్నారు. జాతీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నేతలతో చెప్పిన కేసీఆర్.. కొత్త పార్టీ పేరుపైనా ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని తెలుస్తోంది. భారత్‌ రాష్ట్రీయ సమితి పేరును త్వరలోనే రిజిస్టర్‌ చేయించనున్నారని టీఆర్ఎస్ వర్గాల సమాచారం. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జూలై 2,3 తేదీలలో హైదరాబాద్ లో జరగనున్నాయి. ఆ సమావేశాల కంటే ముందే జాతీయ పార్టీని కేసీఆర్ ప్రకటించాలని డిసైడ్ అయ్యారట.  ఈనెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుని.. కొత్త పార్టీని జూన్ చివరలో ఢిల్లీలో అధికారికంగా కేసీఆర్ ప్రకటిస్తారని తెలుస్తోంది. ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ సింబల్ గా కారు ఉంది. కారు గుర్తునే భారత్‌ రాష్ట్రీయ సమితి కు ఇవ్వాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరనున్నారట. పార్టీ నేతలకు కొత్త పార్టీపై స్పష్టత ఇచ్చిన కేసీఆర్.. జాతీయ స్ఠాయిలో అనుసరించబోయే వ్యూహలతో పాటు రాష్ట్రపతి ఎన్నికలపైనా చర్చించారని తెలుస్తోంది. దాదాపు ఆరు గంటల పాటు జరిగిన సమావేశంలో తాజా రాజకీయ పరిణామాలతో పాటు భవిష్యత్ కార్యాచరణపైనా నేతలకు గులాబీ బాస్ దిశానిర్దేశం చేశారు.

దేశంలో బీజేపీ ఆగడాలు పెరిగిపోయాయని.. బీజేపీ పాలనలో దేశం దిగజారిపోయిందని కేసీఆర్ అన్నారు. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ విఫలమైందన్న కేసీఆర్.. ఈ రెండు పార్టీలతో దేశానికి నష్టమని చెప్పారు. దేశ ప్రజలు కొత్త రాజకీయ శక్తి కోసం చూస్తున్నారన్న కేసీఆర్.. ఆ స్థానాన్ని మనమే భర్తీ చేద్దామని పార్టీ నేతలకు చెప్పారు. త్వరలో జరగనున్న ప్రెసిడెంట్ ఎన్నికను ఇందుకు ఉపయోగించుకోవాలని అన్నారట. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయన్నారు కేసీఆర్. అందుకే తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందని విమర్శించారు. సీబీఐ, ఈడీ, ఐటీ సంస్థలను ప్రత్యర్థులను టార్గెట్ చేయడానికి మోడీ ప్రభుత్వం వినియోగిస్తుందని కేసీఆర్ ఆరోపించారు. క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్న దేశాన్ని రక్షించేందుకు కొత్త పార్టీ అవసరమని తేల్చి చెప్పారు. జాతీయ పార్టీ పెట్టినా తాను తెలంగాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతూనే పని చేస్తానని కేసీఆర్ క్లారిటీ ఇచ్చారు.

కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టాలన్న నిర్ణయంపై రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. దేశంలో మరో కొత్త పార్టీకి స్కోప్ ఉందా.. తెలంగాణ నేతగా ఉన్న కేసీఆర్ జాతీయ స్థాయిలో కేసీఆర్ రాణించగలరా అన్న చర్చ సాగుతోంది. జాతీయ స్థాయిలో కొత్త పార్టీ పెట్టాలన్న కేసీఆర్ నిర్ణయం వెనుక ఆయనకున్న ధైర్యం ఏంటన్న చర్చ వస్తోంది. ఇటీవల కాలంలో కేసీఆర్ పలు ప్రాంతీయ పార్టీల నేతలతో చర్చించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం మాన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీతో చర్చలు జరిపారు. దేశ మాజీ ప్రధాని దేవేగౌడ, ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తోనూ మంతనాలు సాగించారు. గతంలో ఒకసారి ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ తోనూ చర్చలు జరిపారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కూడా కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని తెలుస్తోంది. వీళ్లతో జరిగిన సమావేశంలో జాతీయ స్థాయిలో కొత్త పార్టీ ఏర్పాటుపై కేసీఆర్ చర్చించారని తెలుస్తోంది. అందరి అభిప్రాయాలు తీసుకున్నాకే ఆయన ముందుకు అడుగు వేశారని అంటున్నారు. అయితే వీళ్లలో ఎంతమంది కేసీఆర్ కు చివరి వరకు మద్దతుగా ఉంటారన్నది అనుమానమే.

Read also:  PRESIDENT ELECTION: వెంకయ్య నాయుడు రాష్ట్రపతి కాకుండా జగన్ అడ్డుకుంటున్నారా?

Read also: Rajya Sabha Election: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం.. 4 రాష్ట్రాల్లో 8 స్థానాల్లో గెలుపు...

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News