ఇకపై రెండు రోజుల్లోనే మొబైల్ పోర్టబులిటీ!

దేశంలో మొబైల్ నంబర్ పోర్టబులిటీ మరింత సులభం కానుంది.

Last Updated : Sep 9, 2018, 02:03 PM IST
ఇకపై రెండు రోజుల్లోనే మొబైల్ పోర్టబులిటీ!

దేశంలో మొబైల్ నంబర్ పోర్టబులిటీ మరింత సులభం కానుంది. ఇందుకు సంబంధించి ది టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ట్రాయ్)  విధివిధానాలను రూపొందిస్తున్నది. 2011లో దేశంలో నంబర్ పోర్టబులిటీ విధానాన్ని ప్రవేశపెట్టింది కేంద్రం. మొబైల్‌  పోర్టబులిటీ అంటే.. మొబైల్ ఫోన్‌ వినియోగదారుడు ఫోన్‌ నంబరు మార్చుకోకుండా ఇతర మొబైల్‌ కంపెనీ ఆపరేటర్‌లోకి మారే విధానం.  

నంబర్ పోర్టబులిటీ ద్వారా మొబైల్ ఆపరేటర్‌ను మార్చుకోవడానికి గరిష్టంగా ఉన్న 7 రోజుల సమయాన్ని రెండు రోజులకే కుదించాలని ట్రాయ్ ఆలోచనగా ఉంది. మొబైల్ ఆపరేటర్‌ను మార్చదలచినవారు ఆంగ్లంలో పోర్ట్ అని టైప్ చేసి దాని పక్కన పది అంకెల నెంబర్‌ను కలిపి ట్రాయ్ నెంబర్ 1900కు ఎస్ఎంఎస్ పంపితే.. ట్రాయ్‌ నుంచి పోర్ట్‌ అవుట్‌ కోడ్‌ ఒకటి మొబైల్‌కి వస్తుంది. ఆ కోడ్‌ని కొత్త ఆపరేటర్‌కి చెప్తే.. కొత్త సిమ్ ఇస్తాడు. ఇలా రెండు రోజుల్లో పోర్టబులిటీ అవుతుంది. వారం రోజుల్లోపు కొత్త సిమ్‌ సిగ్నల్స్‌ అందుబాటులోకి వస్తాయి. అయితే.. పాత సిమ్‌లో బ్యాలెన్స్‌ మిగిలి ఉంటే అది వృథా అవుతుంది.

నంబర్ పోర్టబులిటీ చేసుకోవాలనుకుంటే.. మొబైల్ ఫోన్‌ వినియోగదారుడు కనీసం 90 రోజులపాటు సిమ్‌‌ని వాడి ఉండాలి. గత 7 ఏళ్లలో దేశంలో 34.5 కోట్ల మంది నంబర్‌ పోర్టబులిటీ ద్వారా మొబైల్‌ ఆపరేటర్‌ను మార్చుకున్నట్లు సమాచారం.

Trending News