కర్నాటక ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

Last Updated : Apr 16, 2018, 04:44 PM IST
కర్నాటక ఎన్నికలు: కాంగ్రెస్ అభ్యర్థుల తొలి జాబితా విడుదల

కర్ణాటకలో మే నెలలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ తమ నేతల జాబితాను బహిర్గతం చేసింది. ఆదివారం రాత్రి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల జాబితాను ప్రకటించింది.  మొత్తం 224 సీట్లకు గానూ.. సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వరన్‌ సహా 218 మంది పేర్లను ప్రకటించింది. సిట్టింగ్‌ స్థానం వరుణతోపాటు చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని సీఎం మొదట నిర్ణయించారు. అయితే చాముండేశ్వరి స్థానం నుంచి సిద్దరామయ్య, వరుణ స్థానం నుంచి ఆయన చిన్న కుమారుడు యతీంద్ర పోటీలో దిగనున్నారు.

అనూహ్యంగా 90 శాతం మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఈసారి టికెట్ దక్కించుకోగలిగారు. మొత్తం 122 మంది శాసనసభ్యుల్లో 107 మందికి అధిష్ఠానం తిరిగి టికెట్లు ఇచ్చింది. ముగ్గురిని పెండింగ్‌లో పెట్టగా, ఎనిమిది మంది ఆశావహులు టికెట్ల కోసం ఎదురుచూస్తున్నారు. కొరట్‌గెరె నుంచి గత ఎన్నికల్లో ఓడిన కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు జి. పరమేశ్వరన్‌ మరోసారి ఇక్కడినుంచే పోటీ చేయనున్నారు.

 

కాంగ్రెస్ విడుదల చేసిన తొలి జాబితాలో సిద్ధ రామయ్య మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వివాదాస్పద వ్యాపారవేత్త అశోక్‌ ఖెనీ బీదర్‌ (దక్షిణం) నుంచి సీటు సంపాదించారు. మల్లికార్జున ఖర్గే కుమారుడు చితాపూర్‌ (ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు. బెంగళూరులోని శాంతినగర్ సహా ఆరు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది.

Trending News