TSRTC Super Luxury Busses: టిఎస్ఆర్టీసీ కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సరికొత్త సూపర్ ఫీచర్స్

TSRTC Super Luxury Busses: టిఎస్ ఆర్టీసీ ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ వంటి అధునాతన సాంకేతికతను జోడించడం జరిగిందని టిఎస్ఆర్టీసి ఉన్నతాధికారులు తెలిపారు. ప్రయాణికులకు ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుందన్నారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 24, 2022, 04:57 AM IST
  • టిఎస్ఆర్టీసీ ప్రయాణికుల సేఫ్టీ, సౌకర్యం కోసం కొత్త టెక్నాలజీ
  • ప్రయాణికుల భద్రత కోసం ప్యానిక్ బటన్
  • టిఎస్ ఆర్టీసీ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం
TSRTC Super Luxury Busses: టిఎస్ఆర్టీసీ కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల్లో సరికొత్త సూపర్ ఫీచర్స్

TSRTC Super Luxury Busses: టిఎస్ఆర్టీసీ ప్రయాణికులకు వేగంగా, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు ఎప్పటికప్పుడు కొత్త పద్ధతులను అవలంభిస్తూ నిరంతరం కృషి చేస్తోన్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తాజాగా పాత బస్సుల స్థానంలో కొత్త బస్సులను కొనుగోలు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను రూ.392 కోట్ల వ్యయంతో అధునాతనమైన 1016 కొత్త బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించిన టిఎస్ ఆర్టీసీ.. మొదటి విడతలో భాగంగా 630 సూపర్‌ లగ్జరీ, 130 డిలక్స్,  16 స్లీపర్ బస్సులను టెండర్ల ద్వారా కొనుగోలుకు ఆర్డర్‌ ఇచ్చింది. 

ఆర్డర్ ఇచ్చిన బస్సులన్నీ 2023 మార్చి నాటికి ప్రయాణికులకు అందుబాటులోకి రానుండగా ప్రస్తుతానికి కొన్ని కొత్త సూపర్‌ లగ్జరీ బస్సులు శనివారం నుంచే అందుబాటులోకి రానున్నాయి. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ ట్యాంక్ బండ్ పై జరగనున్న ప్రత్యేక కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై కొత్త బస్సులను జెండా ఊపి ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి టీఎస్‌ఆర్టీసీ చైర్మన్‌, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, రవాణా, రహదారి మరియు భవనాల శాఖ కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్‌ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, రవాణా శాఖ కమిషనర్‌ జ్యోతి బుద్దా ప్రకాశ్‌తోపాటు ఇతర ఉన్నతాధికారులు హాజరుకానున్నారు. 

ట్రాకింగ్‌ సిస్టం.. పానిక్‌ బటన్!
ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని కొత్త సూపర్‌ లగ్జరీ బస్సుల్లో ట్రాకింగ్‌ సిస్టంతో పాటు పానిక్‌ బటన్ వంటి అధునాతన సాంకేతికతను జోడించడం జరిగిందని టిఎస్ఆర్టీసి ఉన్నతాధికారులు తెలిపారు. వాటిని టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయడం ద్వారా ఎక్కడ, ఎవరికి ఎలాంటి సమస్య తలెత్తినా క్షణాల్లో తెలిసిపోతుంది అన్నారు. ప్రయాణికులకు ప్రయాణంలో ఏదైనా ఇబ్బందులు తలెత్తితే పానిక్‌ బటన్‌ను నొక్కగానే టీఎస్‌ఆర్టీసీ కంట్రోల్‌ రూమ్‌కు సమాచారం అందుతుందన్నారు. 

ప్రతి బస్సులోనూ ప్రయాణికుల సౌకర్యం కోసం 36 రిక్లైనింగ్ సీట్లు అమర్చారు. ఎల్ఈడీ డిస్ ప్లే బోర్డులను ఏర్పాటు చేశారు. కొత్త సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణికులకు సెల్ ఫోన్ ఛార్జింగ్ సదుపాయంతో పాటు వినోదం కోసం టీవీలను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యురిటీ కెమెరాల ఏర్పాటుతో పాటు ప్రతి బస్సుకు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కోసం రియర్ కెమెరా కూడా ఏర్పాటు చేశారు. అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం ఏర్పాటు చేసినట్టు అధికారులు తమ తాజా ప్రకటనలో పేర్కొన్నారు. బస్సులో మంటల చెలరేగినా.. లేదా ఉష్ణోగ్రత పెరిగినా.. వెంటనే అలారం మోగుతుంది. వెంటనే అధికారులు స్పందించి చర్యలు తీసుకుంటారని తెలిపారు.

Trending News