Vyooham Movie: వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాక్.. మా సినిమాను అడ్డుకోలేరంటూ ఆర్జీవీ కామెంట్స్

Ramgopal Varma Vyooham: రామ్ గోపాల్ వర్మ వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాకిచ్చింది. ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపించింది. దీంతో ఈ నెల 10న విడుదల కావాల్సిన సినిమా వాయిదా పడింది. ఈ విషయంపై దర్శకుడు ఆర్జీవీ స్పందించారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 2, 2023, 08:43 PM IST
Vyooham Movie: వ్యూహం మూవీకి సెన్సార్ బోర్డు షాక్.. మా సినిమాను అడ్డుకోలేరంటూ ఆర్జీవీ కామెంట్స్

Ramgopal Varma Vyooham: తన కొత్త సినిమా "వ్యూహం" రిలీజ్‌ను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కావాల్సి ఉండగా.. సెన్సార్ బృందం రివైజింగ్ కమిటీకి రిఫర్ చేశారని తెలిపారు. వ్యూహం సినిమాకు సెన్సార్ అడ్డంకులపై నిర్మాత నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌తో కలిసి గురువారం మీడియాతో ఆయన మాట్లాడారు. ఇటీవల వ్యూహం సినిమాను సెన్సార్‌కు ఇచ్చామని.. సినిమా చూసిన  సెన్సార్ వాళ్లు తమ సినిమాను రివైజింగ్ కమిటీకి  పంపిస్తున్నట్లు మెసేజ్ పంపారని తెలిపారు. అయితే ఎందుకు రివైజింగ్ కమిటీకి పంపిస్తున్నారో మాత్రం వాళ్లు కారణాలు చెప్పలేదన్నారు. దీంతో ఈ నెల 10న రిలీజ్ కావాల్సిన వ్యూహం సినిమాను వాయిదా వేస్తున్నామన్నారు. 

"గతంలో ఉడ్తా పంజాబ్, పద్మావత్ వంటి సినిమాల విషయంలో రివైజింగ్ కమిటీల్లోనూ తేల్చకుంటే కోర్టు ద్వారా సినిమా రిలీజ్  ఆర్డర్ తెచ్చుకున్నారు. సెన్సార్ అనేది సినిమా రిలీజ్‌ను ఆపకూడదని కోర్టులు కూడా చెప్పాయి. మేము కూడా అదే దారిని అనుసరిస్తాం. చట్టపరంగా ఉన్న పద్ధతుల ద్వారా వ్యూహం సినిమాను రిలీజ్ చేసుకుంటాం. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరు. అలాగే మా వ్యూహం సినిమా విడుదలను కూడా ఎవరూ ఆపలేరు. ఈలోగా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం  చేయకుండా నేనే ముందుకొచ్చి మాట్లాడుతున్నా. వ్యూహం సినిమా ఆపాలని నారా లోకేష్ సెన్సార్‌కు లేఖ రాసినట్లు తెలిసింది. 

అయితే అదెంతో నిజమో చెప్పడానికి నా దగ్గర ప్రూఫ్స్ లేవు. మీడియా, సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు తమ తమ అభిప్రాయాలు  చెప్పినట్లే.. నేను వ్యూహం సినిమా ద్వారా నా అభిప్రాయాలు చెప్పాను. ఆర్టికల్ 19 ప్రకారం పౌరుడిగా నా అభిప్రాయం చెప్పే హక్కు నాకు ఉంది. నేను గతంలో లక్ష్మీస్ ఎన్టీఆర్, కమ్మరాజ్యం సినిమాలు రూపొందించాను. అలాగే బాలీవుడ్‌లో యాక్సిడెంటల్ ప్రైమ్ మినిస్టర్ అని సినిమాలు చేశారు. అవన్నీ ఆపగలిగారా.. వ్యక్తుల గురించైనా, ఏదైనా ఇష్యూ గురించైనా ఎవరి అభిప్రాయాలైనా చెప్పవచ్చు. సెన్సార్ అనేది మత సామరస్యం దెబ్బతినకుండా, కులాలను కించపరిచే సినిమాలు బయటకు రాకుండా లా అండ్ ఆర్డర్ కోణంలో అడ్డుకుంటుంది. అంతే గానీ వ్యక్తులపై అభిప్రాయాలు చెప్పే సినిమాలను ఆపే పవర్ సెన్సార్ కు లేదు. రివైజింగ్ కమిటీకి ఎప్పుడు పంపిస్తారో డేట్ చెప్పలేదు. వాళ్లు చూసి ఏం చెప్తారో విని.. తదుపరి నిర్ణయం తీసుకుంటాం.." అని ఆర్జీవీ అన్నారు. 

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాజకీయ జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను ప్రతిబింబిస్తూ వ్యూహం సినిమాను తెరకెక్కించారు రామ్ గోపాల్ వర్మ. ఈ సినిమాను రామదూత క్రియేషన్స్ బ్యానర్ లో దాసరి కిరణ్ కుమార్ నిర్మించారు. వైఎస్ జగన్ పాత్రలో అజ్మల్‌ నటించగా.. వైఎస్ భారతి పాత్రలో మానస కనిపించబోతున్నారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Trending News