బాలయ్య బాబు-వివి వినాయక్ కాంబోలో వచ్చే సినిమాకు టైటిల్ ఇదేనా ?

'చెన్నకేశవ రెడ్డి' తర్వాత మళ్లీ 16 ఏళ్లకు కుదిరిన కాంబినేషన్ 

Last Updated : Jun 14, 2018, 12:27 PM IST
బాలయ్య బాబు-వివి వినాయక్ కాంబోలో వచ్చే సినిమాకు టైటిల్ ఇదేనా ?
బాలయ్య బాబు, వివి వినాయక్ కాంబినేషన్ అంటే ఎంత క్రేజీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 2002లో రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో వీళ్లిద్దరి కాంబోలో వచ్చిన చెన్నకేశవ రెడ్డి సినిమా ఎంత సూపర్ హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. బాలయ్య బాబును ఫ్యాక్షన్ హీరోగా ఇష్టపడే ఆడియెన్స్‌కి కావాల్సినంత వినోదాన్ని పంచిన సినిమా ఇది. ఆ తర్వాత మళ్లీ వీళ్లిద్దరి కాంబోలో ఇంతవరకు ఏ సినిమా రాలేదు. అయితే, తన తండ్రి ఎన్టీఆర్ పేరిట క్రిష్ దర్శకత్వంలో ఓ బయోపిక్‌ను రూపొందించాలని ప్లాన్ చేస్తోన్న బాలయ్య బాబు అంతకన్నా ముందుగా రెండు సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అందులో ఒకటి వివి వినాయక్ దర్శకత్వంలో కాగా మరొకటి తనకు సింహ, లెజెండ్ వంటి రెండు సూపర్ హిట్స్ అందించిన బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో చేయనున్నారు. 
 
త్వరలోనే వివి వినాయక్ దర్శకత్వంలో సెట్స్‌పైకి వెళ్లనున్న సినిమాకు ఓ ఆసక్తికరమై టైటిల్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. బాల‌య్య బాబు కెరీర్‌లో 104వ చిత్రమైన ఈ సినిమాను సీకే ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సీ క‌ళ్యాణ్ నిర్మించ‌నున్నాడు. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందనున్న ఈ సినిమాకు చెన్నకేశవ రెడ్డి మూవీ హీరోయిన్ శ్రియ‌నే మళ్లీ బాలయ్యకు జోడీగా ఎంపిక చేసుకున‌ట్టు టాక్ వినిపిస్తోంది‌. తాజాగా టాలీవుడ్ వర్గాలు చెబుతున్న వివరాల ప్రకారం ఈ సినిమాకు ఏకే 47 అనే టైటిల్‌ని ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం. ఫ్యాక్షన్ చిత్రాలకు పెట్టింది పేరైన ఈ ఇద్దరూ కలిసి చేయబోయే ఈ సినిమా కూడా పూర్తి ఫ్యాక్షన్ నేపథ్యంలోనే ఉండనుందనే ప్రచారం జరుగుతోంది. ఇందులో ఏది, ఎంత వరకు నిజమో తెలియాలంటే ఆ మూవీ యూనిట్ అధికారికంగా స్పందించే వరకు వేచిచూడాల్సిందే.

Trending News