పరిషత్లలోనూ పదేళ్లకోసారి రిజర్వేషన్ల మార్పు

తెలంగాణలోని కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రభుత్వం స్థానిక సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేసింది.

Last Updated : Apr 1, 2018, 04:54 PM IST
పరిషత్లలోనూ పదేళ్లకోసారి రిజర్వేషన్ల మార్పు

తెలంగాణలోని కొత్త పంచాయతీరాజ్‌ చట్టంలో ప్రభుత్వం స్థానిక సంస్థల విషయానికి సంబంధించి కొన్ని మార్పులు చేసింది. గ్రామ పంచాయతీల్లాగే మండల ప్రజా పరిషత్, జిల్లా ప్రజా పరిషత్‌ పాలకవర్గాల రిజర్వేషన్లు పదేళ్లకోసారి మారనున్నాయి. రెండు వరుస ఎన్నికల్లోనూ ఒకే రిజర్వేషన్లు ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. జెడ్పీటీసీ సభ్యుడు, ఎంపీటీసీ సభ్యుడు, జిల్లా పరిషత్‌ ఛైర్మన్, మండల పరిషత్‌ అధ్యక్ష ఎన్నికల విషయంలో పదేళ్లు ఒకే కేటగిరీకి కేటాయించనుంది. ఇక సర్పంచుల తరహాలోనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యుల పోటీకి విద్యార్హతల్లేవని చట్టంలో పేర్కొంది.

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన జిల్లాలు, మండలాల పునర్విభజన ప్రకారం కొత్త జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లు ఏర్పాటవుతాయని చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుత జెడ్పీలు, ఎంపీపీల పాలకవర్గాల పదవీకాలం పూర్తవగానే.. కొత్త మండలాలు, జిల్లాల ఆధారంగా ప్రత్యేక యూనిట్లుగా పరిషత్‌లు ఏర్పడుతాయి.  

రాష్ట్ర ప్రభుత్వం 2016లో జిల్లాల సంఖ్యను 10 నుంచి 31కి పెంచింది. హైదరాబాద్‌ పూర్తిగా నగరపాలక సంస్థ పరిధిలో ఉండటంతో దీనికి జిల్లా ప్రజా పరిషత్‌ లేదు. ప్రస్తుతం రాష్ట్రంలో తొమ్మిది జిల్లా ప్రజా పరిషత్‌లు, 438 మండల ప్రజా పరిషత్‌లు ఉన్నాయి. వీటి పదవీకాలం పూర్తవగానే 30 జిల్లా ప్రజా పరిషత్‌లు, మండల ప్రజా పరిషత్‌లు 534 ఏర్పాటు కానున్నాయి. ఈ లెక్కన జెడ్పీటీసీ సభ్యుల సంఖ్య సైతం 534కు పెరగనుంది.

జిల్లా ప్రజా పరిషత్, మండల ప్రజా పరిషత్‌లకు ప్రస్తుతం ఉన్న విధానంలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఎంపీటీసీ సభ్యులు ప్రత్యక్షంగా ఎన్నికవుతారు. ఎంపీటీసీ సభ్యులందరూ కలిసి మండల ప్రజా పరిషత్‌ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అలాగే జెడ్పీటీసీ సభ్యులు జిల్లా ప్రజా పరిషత్‌ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్‌‌లను ఎన్నుకుంటారు. వీరి పదవీకాలం ఎప్పటిలాగే ఐదేళ్లు కాగా.. కొత్త చట్టం ప్రకారం పదేళ్లకోసారి రిజర్వేషన్లు మారుతాయి. రొటేషన్‌ విధానం అమలు చేస్తారు. రాజకీయ పార్టీల గుర్తులతోనే ఎన్నికలు నిర్వహిస్తారు.

 

Trending News