ఆసియా కప్ 2018: కుల్దీప్ యాదవ్‌పై ఆగ్రహించిన ఎంఎస్ ధోని

కుల్దీప్ యాదవ్‌పై ఆగ్రహించిన ఎంఎస్ ధోని

Last Updated : Sep 26, 2018, 03:43 PM IST
ఆసియా కప్ 2018: కుల్దీప్ యాదవ్‌పై ఆగ్రహించిన ఎంఎస్ ధోని

జట్టు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. జట్టు ఎన్ని విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ.. ఏ మాత్రం ఆగ్రహం తెచ్చుకోని కూల్ కెప్టేన్ గా పేరు తెచ్చుకున్న మహేంద్ర సింగ్ ధోనికి నిన్న ఆప్ఘనిస్తాన్ మ్యాచ్ సందర్భంగా కోపమొచ్చింది. ఆసియా కప్ 2018 పోటీల్లో భాగంగా సూపర్ 4 లోని మ్యాచ్‌లో ఆప్ఘనిస్తాన్‌తో ఆడిన మ్యాచ్‌కి ధోని కెప్టేన్‌గా సారథ్యం వహించిన సంగతి తెలిసిందే. చాలాకాలం తర్వాత మళ్లీ టీమిండియాకు కెప్టేన్‌గా వ్యవహరించిన ధోని ఒకానొక సందర్భంలో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్‌ని ఓ విషయంలో సున్నితంగానే మందలించాడు. ఆటలో ఒక చోట ఫీల్డర్‌ని మార్చాల్సిందిగా కుల్దీప్ యాదవ్ కోరగా.. అందుకు స్పందించిన ధోని.. ''నువు ముందు బౌలింగ్ చేస్తావా లేక నేను బౌలర్‌ని మార్చాలా'' అని బదులిచ్చాడు. ధోని వికెట్ కీపర్ కావడంతో అతడి ముందే ఉన్న వికెట్ స్టంప్స్‌కి ఉన్న మైక్రో ఫోన్‌లో అతడి మాటలు స్పష్టంగా రికార్డయ్యాయి. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి.

 

Trending News