Ind Vs NZ: టీమిండియాదే సిరీస్.. చివరి టీ20 మ్యాచ్ టై

India Won Series Against New Zealand: టీమిండియాదే టీ20 సిరీస్. మూడో టీ20 మ్యాచ్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా ముగియడంతో సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. వర్షం కారణంగా పూర్తి మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 22, 2022, 04:33 PM IST
Ind Vs NZ: టీమిండియాదే సిరీస్.. చివరి టీ20 మ్యాచ్ టై

India Won Series Against New Zealand: టీ20 వరల్డ్ కప్‌ ఓటమి నుంచి టీమిండియా త్వరగానే కోలుకుంది. న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-0తో సొంతం చేసుకుంది. నిర్ణయాత్మక మూడో మ్యాచ్‌ డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం టైగా ముగిసింది. మొదట బ్యాటింగ్ చేసిన కివీస్ 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. కాన్వే, ఫిలిప్స్ అర్ధ సెంచరీలతో రాణించారు. అనంతరం టీమిండియా 9 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులు చేసింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహణకు సాధ్యం కాలేదు. దీంతో అంపైర్లు డక్ వర్త్ లూయిస్ పద్ధతితో టై అయినట్లు ప్రకటించారు. మొదటి మ్యాచ్‌ వర్షం కారణంగా రద్దవ్వగా.. రెండో మ్యాచ్‌లో భారత్ విజయం సాధించింది. తాజాగా మూడో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో 1-0 తేడాతో సిరీస్ భారత్ వశమైంది.

మొదట టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అర్ష్‌దీప్ సింగ్ వేసిన రెండో ఓవర్ మూడో బంతికి కివీస్ ఓపెనర్ ఫిన్ అలెన్ (3) ఎల్బీడబ్యూ అయ్యాడు. మార్క్ చాప్‌మన్‌ (12)ను సిరాజ్ ఔట్ చేశాడు. మరో ఓపెనర్ కాన్వే, గ్లెన్ ఫిలిప్స్ ఇద్దరు టీమిండియా బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇద్దరు బౌండరీలు స్కోరు బోర్డు పరుగులు పెట్టించారు. దీంతో 13వ ఓవర్లలోనే స్కోరు బోర్డు వంద పరుగులు దాటింది. ఈ క్రమంలోనే డెవాన్ కాన్వే 39 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకోగా.. ఫిలిప్స్ 31 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఇద్దరు క్రీజ్‌లో కుదురుకోవడంతో కివీస్ భారీ స్కోరు చేస్తుందని అందరూ అనుకున్నారు. 

ఈ సమయంలో భారత బౌలర్లు విజృంభించారు. ఫిలిప్స్ (54)ను సిరాజ్ ఔట్ చేశాడు. ఆ తరువాత కాన్వే (59)ను అర్ష్‌దీప్ పెవిలియన్‌కు పంపించాడు. నీషమ్ (0), శాంట్నర్ (1)లను సిరాజ్ ఒకే ఓవర్లో ఔట్ చేయగా.. టెయిలిండర్లు కూడా పెవిలియన్‌ క్యూ కట్టడంతో 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది. అర్ష్‌దీప్ సింగ్, మహ్మాద్ సిరాజ్ చెరో నాలుగు వికెట్లు తీయగా.. హర్షల్ పటేల్ ఒక వికెట్ తీశాడు. 

161 లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. గత మ్యాచ్‌లో పర్వాలేదనిపించిన ఇషాన్ కిషాన్ (10) పరుగులకే ఔట్ అయ్యాడు. రిషబ్ పంత్ (11) మరోసారి విఫలమయ్యాడు. శ్రేయాస్ అయ్యర్ కూడా డకౌట్ అవ్వగా.. స్టార్ బ్యాట్స్‌మెన్ సూర్య కుమార్ యాదవ్ (13) కూడా తక్కువ స్కోరుకే పెవిలియన్ బాటపట్టాడు. అయితే మరో ఎండ్‌లో కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (30) వేగంగా ఆడడంతో భారత్ స్కోరు 9 ఓవర్లలో  నాలుగు వికెట్ల నష్టానికి 75 పరుగులకు చేరుకుంది. 

రెండు జట్లకు విజయ అవకాశాలు సమానంగా ఉన్న సమయంలో ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. కాసేపటి తరువాత వర్షం ఆగిపోయినా.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో అంపైర్లు మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాదన్నారు. డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్‌ టైగా ముగిసినట్లు ప్రకటించారు. దీంతో 1-0 తేడాతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను భారత్ సొంతం చేసుకుంది. మ్యాన్‌ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సిరాజ్‌కు దక్కగా.. సూర్య కుమార్ యాదవ్‌  మ్యాన్‌ ఆఫ్ ద సిరీస్ కైవసం చేసుకున్నాడు.

Also Read: Shraddha Murder Case: అఫ్తాబ్ ఇంట్లో రక్తపు మరకలు.. అక్కడి నుంచి 18 ఎముకలు స్వాధీనం  

Also Read: Spearmint Tea Cough Cold: ఈ ఆకుల టీతో దగ్గు, జలుబు చిటికెలో మాటు మాయం.. ఇప్పుడు ట్రై చేయండి..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News