Ind Vs SA Highlights: తొలి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు.. టీమిండియా గ్రాండ్‌ విక్టరీ

India Vs South Africa 1st Odi Highlights: తొలి వన్డేలో టీమిండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. దక్షిణాఫ్రికాపై మరో 200 బంతులు ఉండగానే.. 8 వికెట్లతో తేడాతో గెలుపొందింది. అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌ ధాటికి సఫారీలు 116 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అనంతరం భారత్ 16.4 ఓవర్లలోనే విజయాన్ని అందుకుంది.  

Written by - Ashok Krindinti | Last Updated : Dec 17, 2023, 10:39 PM IST
Ind Vs SA Highlights: తొలి వన్డేలో సౌతాఫ్రికా చిత్తు.. టీమిండియా గ్రాండ్‌ విక్టరీ

India Vs South Africa 1st Odi Highlights: సౌతాఫ్రికాతో వన్డే సిరీస్‌ను టీమిండియా విజయంతో ఆరంభించింది. జోహన్నెస్‌బర్గ్‌ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాను ఓడించింది. బౌలింగ్‌లో అర్ష్‌దీప్‌ సింగ్‌, అవేష్‌ ఖాన్‌ మెరుపులు మెరిపించడంతో మొదట బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే కుప్పకూలింది. అర్ష్‌దీప్ సింగ్ 5 వికెట్లు తీయగా.. అవేష్‌ ఖాన్ 4 వికెట్లు పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్‌లో శ్రేయాస్ అయ్యర్, సాయి సుదర్శన్ హాఫ్ సెంచరీలతో రాణించడంతో కేవలం 16.4 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి భారత్ లక్ష్యాన్ని ఛేదించింది. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అర్ష్‌దీప్‌కు దక్కింది.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా మొదట బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన సఫారీకి పేసర్లు అర్ష్‌దీప్, అవేశ్‌ ఖాన్‌ చుక్కలు చూపించారు. తొలి నాలుగు వికెట్లను పడగొట్టి అర్ష్‌దీప్ సింగ్ బ్యాటింగ్ ఆర్డర్‌ను కకలావికలం చేయగా.. అనంతరం అవేశ్‌ ఖాన్ రెచ్చిపోయాడు. ఫెలుక్వాయో 33 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలవగా.. ఓపెనర్ టోనీ డిజోర్జి (28), కెప్టెన్ ఐడెన్‌ మార్‌క్రమ్‌ (12), షంసి (11 నాటౌట్) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ అంతా సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. హెండ్రిక్స్ (0), డస్సెన్ (0), క్లాసెన్ (6), డేవిడ్ మిల్లర్ (2), వియాన్‌ ముల్డర్ (0), కేశవ్ మహరాజ్ (4) ఇలా క్రీజ్‌లోకి వచ్చి అలా వెళ్లిపోయారు. చివరకు 116 ఆలౌట్ అయింది. మొదటి తొమ్మిది వికెట్లు పేసర్లు పడగొట్టగా.. చివరి వికెట్‌ కుల్దీప్ యాదవ్‌కు దక్కింది. 

దక్షిణాఫ్రికా విధించిన స్వల్ప లక్ష్యాన్ని దిగిన టీమిండియాకు సరైన ఆరంభం దక్కలేదు. రుతురాజ్ గైక్వాడ్ (5) త్వరగా పెవిలియన్‌కు చేరిపోయాడు. అయితే అరంగేట్ర బ్యాట్స్‌మెన్ సాయి సుదర్శన్, శ్రేయాస్ అయ్యర్ సఫారీ బౌలర్లకు ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. ఇద్దరు దూకుడుగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. సుదర్శన్ 43 బంతుల్లో 9 ఫోర్ల సాయంతో 55 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. శ్రేయాస్ అయ్యర్ (45 బంతుల్లో 52, 6 ఫోర్లు, ఒక సిక్స్) చివర్లో ఔట్ అయినా అప్పటికే భారత్ విజయం ఖాయమైంది. తిలక్ వర్మ ఒక పరుగుతో నాటౌట్‌గా మిగిలాడు. భారత్‌ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

అతి తక్కువ బంతుల్లోనే లక్ష్యాన్ని ఛేదించిన భారత్.. నాలుగో అతిపెద్ద వన్డే విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్‌లో 200 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది. ఈ ఏడాది శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో 263 బంతులు మిగిలి ఉండగానే విజయం సాధించిన విషయం తెలిసిందే. అంతకుముందు 2001లో కెన్యాతో జరిగిన మ్యాచ్‌లో 231 బంతులు మిగిలి ఉండగానే భారత్ లక్ష్యాలను ఛేదించింది. బంతుల పరంగా దక్షిణాఫ్రికాకు ఇది రెండో అతిపెద్ద ఓటమి. అంతకుముందు ఇంగ్లాండ్ చేతిలో 215 బంతులు మిగిలి ఉండగానే ఓటమిపాలైంది. 

Also Read: Google Trend Video: వీడు మగాడ్రా బుజ్జి..ఏకంగా 16 అడుగుల కింగ్ కోబ్రాకు ముద్దు పెట్టాడు..మీరే చూడండి..

Also Read: Tamil Nadu Road Accident: తమిళనాడులో కారు ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ అయ్యప్ప భక్తులు మృతి   

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News