Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం అంతా అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగిందా, ఈడీ ఛార్జిషీటులో ఏముంది

Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం మరోసారి సంచలనం రేపుతోంది. కుంభకోణంలో ఈసారి ఏకంగా డిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరు బయటికొచ్చింది. అసలు కేజ్రీవాల్‌కు ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధమేంటో చూద్దాం..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 3, 2023, 02:50 PM IST
Delhi Liquor Scam: ఢిల్లీ మద్యం కుంభకోణం అంతా అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగిందా, ఈడీ ఛార్జిషీటులో ఏముంది

ఢిల్లీ రాస్ ఎవెన్యూ కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి కీలక పరిణామాలు వెలుగుచూశాయి. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ దాఖలు చేసిన 428 పేజీల ఛార్జిషీటులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేరుండటం సంచలనం కల్గిస్తోంది. మద్యం కుంభకోణం ఎలా జరిగింది..ఎవరి సమక్షంలో ఎప్పుడెప్పుడు ఏం జరిగిందనేది సవివరంగా ప్రస్తావించారు. 

ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఈడీ దాఖలు చేసిన ఛార్జిషీటులో మొత్తం 17 మందిని నిందితులుగా చేర్చింది. వీరిలో సమీర్ మహేంద్రు, ఖావో గలీ రెస్టారెంట్స్, బబ్లీ బేవరేజెస్, ఇండో స్పిరిట్స్, ఇండో స్పిరిట్స్ డిస్ట్రిబ్యూషన్, విజయ్ నాయర్, పి శరత్ చంద్ర, ట్రైడెంట్ కేంఫర్ లిమిటెడ్, అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గోనామిక్స్ ఈకోసిస్టమ్స్, బినోయ్ బాబు, పెర్నోడ్ రిచర్డ్ ఇండియా లిమిటెడ్, అభిషేక్ బోయినపల్లి, అమిత్ అరోరా, కేఎస్‌జేఎస్ స్పిరిట్స్, మెస్సర్స్ బడ్డీ రిటైల్, పాపులర్ స్పిరిట్స్ పేర్లు ఉన్నాయి. 

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంబంధం ఎలా

ఈ మొత్తం వ్యవహారంలో ఆప్ అగ్రశ్రేణి నేతల ప్రమేయం ఉందని ఛార్జిషీటులో ప్రస్తావించారు. బ్యాక్‌డోర్ విధానాల ద్వారా హోల్‌సేల్ మార్జిన్ 12 శాతం, రిటైల్ మార్జిన్ 185 శాతం ఉండేలా నేరపూరిత కుట్రతో ఆప్ నాయకులు సృష్టించారనేది ఈడీ అభియోగం.

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సెక్రటరీ సి అరవింద్ 2022, డిసెంబర్ 7వ తేదీన వెల్లడించిన వివరాల ప్రకారం..మార్చ్ 2021న డ్రాఫ్ట్ రిపోర్ట్‌ను ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి మనీష్ సిసోడియా పిలిపించి ఇచ్చారు. ఆ సమయంలో మరో మంత్రి సత్యేంద్ర జైన్ కూడా అక్కడే ఉన్నారు. మద్యం హోల్‌సేల్ వ్యాపారాన్ని ప్రైవేట్ సంస్థలకు 12 శాతం మార్జిన్‌తో ఇచ్చేందుకు ఒప్పందం సిద్ధమైంది. ఈ 12 శాతం మార్జిన్‌లో 6 శాతం వెనక్కి ఆప్ నేతలకు ఇచ్చేలా ఒప్పందం జరిగింది. కానీ ఒప్పందపు సమావేశాల్లో అటువంటి నిర్ణయాలేవీ తీసుకోలేదని..డ్రాఫ్ట్ జీవోఎమ్‌లో మాత్రం ఉందని సి అరవింద్ స్పష్టం చేశాడు.

మొత్తం మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఉన్న విజయ్ నాయర్ ఆమ్ ఆద్మీ పార్టీలో సాధారణ కార్యకర్త కాదు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు అత్యంత సన్నిహితుడు. అంతేకాకుండా..మద్యం పాలసీ విషయాల్లో ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సన్నిహితంగా చర్చించేవాడు. ఇక విజయ్ నాయర్ వాంగ్మూలం ప్రకారం..విజయ్ నాయర్ తన కార్యకలాపాల్ని 2020 నుంచి ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటి నుంచే నిర్వహించేవాడు. ఢిల్లీ కేబినెట్ మంత్రి కైలాష్ గెహ్లాట్‌కు ప్రభుత్వం కేటాయించిన బంగ్లాలోనే నివసించేవాడు.

అంతా అరవింద్ కేజ్రీవాల్ సమక్షంలోనే జరిగిందా

ఇండో స్పిరిట్స్ కంపెనీ యజమాని సమీర్ మహేంద్రుతో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సమావేశాన్ని విజయ నాయర్ ఏర్పాటు చేయగా..అది సాధ్యం కాలేదు. దాంతో తన ఫోన్‌లోని ఫేస్‌టైమ్ ద్వారా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, సమీర్ మహేంద్రుతో వీడియో కాల్ మీటింగ్ ఏర్పాటు చేశాడు. ఆ వీడియో కాల్ సమావేశంలో విజయ్ తన మనిషని..అతడిని నమ్మవచ్చని..అతనితో ప్రొసీడ్ అవమని సాక్షాత్తూ అరవింద్ కేజ్రీవాల్ స్పష్టం చేశారు. 

Also read: PM Modi Foreign Trips: ప్రధాని మోదీ విదేశీ పర్యటనల కోసం ఎంత ఖర్చు చేశారో తెలుసా ?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News