బాల్య వివాహాన్ని వ్యతిరేకించాడని.. కాబోయే వియ్యంకుడితో కలిసి సొంత తండ్రిని హత్య చేశాడు..!

కర్ణాటకలోని దొడ్డబళ్లాపురలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 15 సంవత్సరాల కుమార్తెకు బాల్యవివాహం చేయాలని నిశ్చయించుకొని సంబంధం కూడా తీసుకొచ్చాడు.

Last Updated : Nov 20, 2018, 04:51 PM IST
బాల్య వివాహాన్ని వ్యతిరేకించాడని.. కాబోయే వియ్యంకుడితో కలిసి సొంత తండ్రిని హత్య చేశాడు..!

కర్ణాటకలోని దొడ్డబళ్లాపురలో ఓ దారుణం చోటుచేసుకుంది. ఓ తండ్రి తన 15 సంవత్సరాల కుమార్తెకు బాల్యవివాహం చేయాలని నిశ్చయించుకొని సంబంధం కూడా తీసుకొచ్చాడు. అయితే తన మనవరాలికి బాల్యవివాహం చేయవద్దని ఆయన తండ్రి ప్రాధేయపడ్డాడు. కానీ బాలిక తండ్రి వినలేదు. తన కూతురు వివాహం తన ఇష్టప్రకారమే జరగాలని చెబుతూ తన తండ్రి మాటలతో విభేదించాడు. ఇక తన వల్ల ఈ పెళ్లి ఆగదని తెలుసుకున్న బాలిక తాత మహిళా–శిశు  సంక్షేమ శాఖ అధికారులకు ఫోన్‌ చేసి.. తన మనవరాలికి బాల్యవివాహం జరుగుతుందని తెలిపాడు.

వారు వెంటనే రంగంలోకి దిగి కళ్యాణ మండపానికి వచ్చి వివాహాన్ని ఆపించారు. అయితే ఆ వివాహం ఆగిపోవడం వల్ల ఇరు  కుటుంబాల పరువు పోయిందని కాబోయే వియ్యంకులిద్దరూ.. వివాహాన్ని ఆపించిన వృద్దున్ని దుర్భాషలాడారు. ఆ తర్వాత ఇద్దరూ ఓ బార్‌కి వెళ్లి ఫూటుగా మద్యాన్ని సేవించారు. తర్వాత వృద్దుడి ఇంటికి వచ్చి గొడవ పెట్టుకున్నారు.  ఆ గొడవలో సొంత తండ్రి అని కూడా చూడకుండా.. బాలిక తండ్రి వృద్దుడి తలపై పెద్ద బండరాయితో మోదడంతో ఆయన తీవ్ర గాయాలపాలయ్యాడు. 

వెంటనే గ్రామస్తులు కలగజేసుకొని.. దాడి చేసిన వ్యక్తులిద్దరినీ పక్కకు తీసుకెళ్లారు. తర్వాత వృద్దుడిని ఆసుపత్రికి తరలించారు. కానీ ఆయన మార్గమధ్యంలోనే చనిపోయాడని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ఎప్పుడైతే వృద్దుడు మరణించాడన్న వార్త తెలిసిందో ఈ దాడికి పాల్పడిన ఇద్దరు వ్యక్తులూ తమ కుటుంబాలతో సహా ఇళ్లు వదిలి పరారయ్యారు. ఈ సమాచారం అందుకున్న కర్ణాటక పోలీసులు దొడ్డబళ్లాపుర గ్రామంలోకి వచ్చి పరిస్థితిని గురించి తెలుసుకున్నారు. వృద్దుడి దేహాన్ని పంచనామాకి పంపించారు. ఈ ఘటనకు పాల్పడిన నేరస్తులను పట్టుకుంటామని.. వారిని అదుపులోకి తీసుకొని జైలుకి తరలిస్తామని కూడా పోలీసులు తెలిపారు.

Trending News