చలికాలంలో పాదాల రక్షణ

Last Updated : Jan 20, 2018, 01:22 PM IST
చలికాలంలో పాదాల రక్షణ

చలికాలం వచ్చేసింది. ఈ కాలంలో చాలామందికి పాదాల సమస్య ఇబ్బంది పెడుతుంది. కాబట్టి పాదాలను అశ్రద్ధ చేయకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనమీద ఉంది. పగిలిన పాదాలు చూడడానికి అసహ్యంగా కనిపిస్తాయి. అలా కనిపించకుండా అందంగా కనిపించాలంటే తగు జాగ్రత్తలు పాటించాలి. పాదాలు అందంగా, పగుళ్లు లేకుండా నాజూగ్గా, ఆరోగ్యంగా కనిపించాలంటే ఈ క్రింది సూచనలను పాటిస్తే సరి..! 

* ఎత్తు మడమల చెప్పులు వాడరాదు. వాడితే వెన్నునొప్పి వస్తుంది. కనుక ఇతరులు మనవైపు చూడాలని కాకుండా సౌకర్యవంతమైన చెప్పులు ధరిస్తే సరి. 

* రాత్రిపూట పడుకొనే ముందు వ్యాజిలెన్ లేదా ఇతర చర్మ క్రిములు పూసి కొద్దిసేపు మర్దన చేయాలి. ఇలా చేయడం వల్ల పాదాలకు రక్తం సరఫరా అయ్యి పగుళ్లు తగ్గుతాయి. 

* గోరువెచ్చని ఆలివ్ ఆయిల్‌తో మసాజ్ చేస్తే పాదాలు మృదువుగా మారుతాయి. 

*  ఒక బకెట్‌లో రెండు చెంబుల గోరువెచ్చని నీరు పోసి రెండు టేబుల్ స్పూన్ల గ్లిజరిన్, ఆలివ్ ఆయిల్ వేయాలి. అందులో పాదాలను ఉంచాలి. నీళ్ల వెచ్చదనం తగ్గాక పాదాలను బయటకు తీసి మాయిశ్చరైజర్ రాసుకోండి. ఫలితం ఉంటుంది. 

*  మడమలు, పాదాల వేళ్ల మధ్య సందుల్లో ఇలా అన్ని చోట్ల మసాజ్ చేసుకోవాలి. ఇలా చేయడంవల్ల నిర్జీవ కణాలు తొలిగిపోతాయి. పెరుగు, వెనిగర్ కలిపి మసాజ్ చేస్తే ఫలితం ఉంటుంది. పాదాలు కూడా మెత్తగా మారుతాయి. 

* చివరగా పాదాలకు వ్యాయామం తప్పనిసరి. పాదాలను నేలపై  ఉంచి గుండ్రంగా ఒకవైపు ఐదారుసార్లు, మరోవైపు ఐదారుసార్లు తిప్పాలి. అలానే నేలమీద పెన్సిల్ ఉంచి పాదాల వేళ్ళతో పైకెత్తేవిధంగా ప్రయతించండి. పొద్దున్నే సూర్యనమస్కారం చేసేటప్పుడు మునివేళ్ల మీద పాదాలు నిలబడే విధంగా ఆసనాన్ని వేయండి. ఫలితం ఉంటుంది.   

Trending News