రజనీకాంత్ ఆరోగ్యంపై హల్చల్ చేస్తున్న పుకార్లు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ అనారోగ్యంగా ఉన్నారని.. పలు రుగ్మతలతో బాధపడుతున్నారని వస్తున్న పుకార్లను ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమాన సంఘాల నాయకులు ఖండించారు.

Last Updated : Nov 24, 2018, 12:04 PM IST
రజనీకాంత్ ఆరోగ్యంపై హల్చల్ చేస్తున్న పుకార్లు

తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ అనారోగ్యంగా ఉన్నారని.. పలు రుగ్మతలతో బాధపడుతున్నారని వస్తున్న పుకార్లను ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమాన సంఘాల నాయకులు ఖండించారు. రజనీ ఈ మధ్యకాలంలో తీవ్ర ఒత్తిడికి లోనై ఆసుపత్రిలో చేరారని.. అక్కడ చికిత్స తీసుకుంటున్నారని సామాజిక మాధ్యమాల్లో శుక్రవారం పలు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇది అబద్ధమని.. ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని ఆయన కుటుంబ సభ్యులు  ప్రకటన ఇచ్చారు. ఇలాంటి వదంతులను నమ్మవద్దని కోరారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న  ‘2.ఓ’ సినిమా నవంబరు 29న విడుదలకు సంసిద్ధమవుతోంది.

శంకర్‌ దర్శకత్వం వహించిన ఈ భారీ బడ్జెట్ చిత్రంలో అక్షయ్‌ కుమార్‌, అమీ జాక్సన్‌  ముఖ్యపాత్రలు పోషించగా.. రూ.550 కోట్ల బడ్జెట్‌తో చాలా ప్రతిష్ఠాత్మకమైన రీతిలో చిత్రాన్ని రూపొందించారు. ఈ క్రమంలో ఆయన ఆరోగ్యంపై వస్తున్న వదంతులపై తాము బాధపడుతున్నామని.. ఇవి చాలా సెన్సిటివ్ అంశాలని.. ఇలాంటి విషయాలకు సంబంధించి పుకార్లను ప్రచారం చేయవద్దని మీడియాని కోరారు. 

రజనీ ‘2.ఓ’ సినిమా తర్వాత ‘పేట’ అనే మరో చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా ఆడియోను  డిసెంబరు 9న విడుదల చేయాలని భావిస్తున్నట్లు చిత్ర నిర్మాతలు తెలిపారు. కార్తీక్‌ సుబ్బరాజ్‌ డైరెక్షన్‌లో తెరకెక్కే ఈ చిత్రంలో త్రిష, సిమ్రాన్, విజయ్ సేతుపతి ముఖ్యపాత్రలు పోషిస్తుండగా.. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మాణ సారధ్యం వహిస్తోంది. ఈ చిత్రం తర్వాత ప్రముఖ దర్శకుడు ఎ.ఆర్‌. మురుగదాస్‌, రజనీకాంత్ కాంబినేషనులో మరో చిత్రం వస్తుందని కూడా కోలీవుడ్ టాక్. 

Trending News