Sharmila Vs YS Jagan: షర్మిలకు సీఎం జగన్‌ గట్టి కౌంటర్‌.. 'మీరంతా నా అక్కాచెల్లెళ్లు' అంటూ వ్యాఖ్యలు

Sensational Comments: రాజకీయాల్లోకి ప్రవేశించిన తన సోదరి షర్మిలపై తొలిసారి ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఘాటుగా స్పందించారు. ఆమె పేరు ప్రస్తావించకుండానే పరోక్షంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబును జాకీలు పెట్టి లేపేందుకు చాలా మంది వస్తున్నారని విమర్శలు చేశారు. తనకు ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు అని స్పష్టం చేశారు.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jan 23, 2024, 06:22 PM IST
Sharmila Vs YS Jagan: షర్మిలకు సీఎం జగన్‌ గట్టి కౌంటర్‌.. 'మీరంతా నా అక్కాచెల్లెళ్లు' అంటూ వ్యాఖ్యలు

YS Jagan Counter to Sharmila: 'రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి చంద్రబాబు అభిమాన సంఘం చేరారు. హైదరాబాద్‌లో ఉండి చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్‌గా పనిచేస్తున్నారు. జాకీ ఎత్తి చంద్రబాబును లేపేందుకు కష్టపడుతున్నారు. వీళ్ల ఇల్లు, వాకిలి అంతా పక్క రాష్ట్రమే' అని సీఎం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తెలిపారు. ఆ వ్యాఖ్యల ద్వారా షర్మిల, పవన్‌ కల్యాణ్‌పై పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. వారందరినీ స్టార్‌ క్యాంపెయినర్లుగా పేర్కొన్న జగన్‌ తనకు మాత్రం ప్రజలే స్టార్‌ క్యాంపెయినర్లు అని, లబ్ధిపొందిన అక్కాచెల్లెళ్లు తనకు స్టార్‌ క్యాంపెయినర్లుగా పని చేస్తారని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లా ఉరవకొండలో మంగళవారం వైఎస్సార్‌ ఆసరా నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం జగన్‌ మాట్లాడారు. ఈ సందర్భంగా తన ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను వివరించారు. ప్రజలకు చేసిన గొప్పతనం వివరిస్తూనే ప్రతిపక్షాల కుట్రలను తిప్పికొట్టారు. ఒక్కటై వస్తున్న ప్రతిపక్షాల గుంపుపై తీవ్ర విమర్శలు చేశారు. 'చంద్రబాబు, ఎల్లో మీడియా, ఆయన గజదొంగల ముఠా, రామోజీరావు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వీళ్లందరికీ తోడు ఒక దత్తపుత్రుడు వంటి వారికి రోజూ సమాధానం ఇవ్వాల్సి రావడం నిజంగా కలికాలం అనిపిస్తుంది. రోజూ అబద్ధాలతో వడ్డించడం దానికి సమాధానాలు చెప్పుకోవాల్సిన పరిస్థితి అంటే దీన్నే కలికాలం అంటారు' అని పేర్కొన్నారు.
 

'ఏ మంచి చేయకపోయినా.. ఎలాంటి పథకాలు అమలుచేయకపోయినా కూడా చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్లు దండిగా ఉన్నారు. బాబు కోసం చంద్రబాబును భుజానికెత్తుకుని మోసే ముఠా చాలా మంది ఉన్నారు. వాళ్లు ఇళ్లు, కాపురాలు, సంసారాలు పక్క రాష్ట్రంలో ఉంటాయి. పక్క రాష్ట్రంలో స్థిర నివాసిగా ఉన్న దత్తపుత్రుడు స్టార్‌ క్యాంపెయినర్‌ అయితే, చంద్రబాబు వదిన గారు.. ఆమె పక్క పార్టీలోకి వెళ్లి చంద్రబాబుకు స్టార్‌ క్యాంపెయినర్‌. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి వారంతా బాబుకు స్టార్‌ క్యాంపెయినర్లే' అని జగన్‌ విమర్శించారు. 

షర్మిలను పరోక్షంగా ప్రస్తావిస్తూ.. 'వీళ్లుకాక రాష్ట్రాన్ని విడగొట్టిన పార్టీలోకి ప్రవేశించిన చంద్రబాబు అభిమాన సంఘం అంతా కూడా చంద్రబాబును జాకీ పెట్టి ఎత్తేందుకు కష్టపడుతున్న ఇంకొంతమంది స్టార్‌ క్యాంపెయినర్లు. వీళ్లంతా బాబుకు తోడుగా ఉన్నారు. బీజేపీలో తాత్కాలికంగా తలదాచుకున్నవారు కూడా బాబు ప్రయోజనాల కోసం పని చేస్తున్నారు. పసుపు కమలాలన్నీ బాబుకు స్టార్‌ క్యాంపెయినర్లే' అని సీఎం జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు.

'రాష్ట్రానికి, ప్రజలకు ఏమీ చేయని బాబుకు అంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు ఉంటే.. నాకు మాత్రం మీరంతా స్టార్‌ క్యాంపెయినర్లే' సభకు హాజరైన వారినుద్దేశించి సీఎం జగన్‌ చెప్పారు. 'ప్రతి పేద ఇంటికి అభివృద్ధి ఫలాలు అందించిన మీ బిడ్డకు, ప్రతి పేదింటికి మంచి చేసిన మీ బిడ్డకు ఎలాంటి స్టార్‌ క్యాంపెయినర్లు లేరు. కానీ మీ బిడ్డ వాళ్లను నమ్ముకోలేదు. వాళ్లందరికన్నా ఎక్కువ స్టార్‌ క్యాంపెయినర్లు మీ బిడ్డకు ఉన్నారని చెప్పడానికి సంతోషిస్తున్నా. మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లు ఎవరో తెలుసా?' అని ప్రశ్నించారు. 'కుట్రలు, కుతంత్రాలతో జెండాలు జత కట్టడమే వారి అజెండా. జనం గుండెల్లో గుడి కట్టడమే మీ జగన్‌ అజెండా. కాబట్టే వారికి భిన్నంగా నాకు ఉన్నంత మంది స్టార్‌ క్యాంపెయినర్లు. దేశ చరిత్రలోనే కాదు.. రాజకీయ చరిత్రలోనే ఎవరూ ఉండరని మీకు తెలియజేస్తున్నా' అని సీఎం జగన్‌ చెప్పారు.

'మీ బిడ్డకు స్టార్‌ క్యాంపెయినర్లు మంచి జరిగిన ప్రతిఇల్లు.. ఆ ప్రతి ఇంట్లో ఉన్న నా అక్కచెల్లెమ్మలందరూ నాకు స్టార్‌ క్యాంపెయినర్లే' అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. వైఎస్సార్‌ ఆసరా అందుకున్న నా అక్కచెల్లెమ్మలంతా 80 లక్షల మంది నాకు స్టార్‌ క్యాంపెయినర్లే' అని పేర్కొన్నారు. సున్నావడ్డీ అందుకున్న కోటిమందికి పైగా ఉన్న లబ్ధిదారులు నా స్టార్‌ క్యాంపెయినర్లేనని చెప్పారు. చేయూత అందుకున్న 31 లక్షల మంది మహిళలు, ఇళ్ల పట్టాలు అందుకున్న 31 లక్షల మంది అక్కాచెల్లెళ్లు నా స్టార్‌ క్యాంపెయినర్లు' అని వెల్లడించారు. రైతు భరోసా, పింఛన్లు తదితర సంక్షేమ పథకాలు పొందుతున్న ప్రతి లబ్ధిదారుడు తనకు స్టార్‌ క్యాంపెయినర్‌ అని సీఎం జగన్‌ వివరించారు.

Also Read: Ayodhya Crown: అయోధ్య రాముడికి స్వర్ణ కిరీటం.. వజ్రాలు, విలువైన రాళ్లు పొదిగినది ఎన్ని కోట్లు అంటే?

Also Read: Mizoram Flight: ఎయిర్‌పోర్టులో జారిన విమానం.. పొదల్లోకి దూసుకెళ్లడంతో 12 మందికి గాయాలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News